మేటి మేనేజ్‌మెంట్‌కి జాట్‌ మార్గం!

దేశంలో మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఎన్నో పరీక్షలున్నాయి. వాటిలో క్యాట్‌ తర్వాత ప్రాధాన్యమున్నది జేవియర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు (జాట్‌). దీన్ని జేవియర్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, జంషెడ్‌పుర్‌ నిర్వహిస్తోంది.

Updated : 24 Jul 2023 00:25 IST

దేశంలో మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఎన్నో పరీక్షలున్నాయి. వాటిలో క్యాట్‌ తర్వాత ప్రాధాన్యమున్నది జేవియర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు (జాట్‌). దీన్ని జేవియర్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, జంషెడ్‌పుర్‌ నిర్వహిస్తోంది. ఈ పరీక్ష స్కోరుతో దేశంలో 160 బిజినెస్‌ స్కూళ్లలో ఎంబీఏ/పీజీడీఎం కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే విద్యా సంవత్సరంలో కోర్సుల్లో ప్రవేశానికి ఎక్స్‌ఏటీ-2024 ప్రకటన వెలువడింది!

భారత్‌లోని టాప్‌-10 బీ స్కూళ్లలో జేవియర్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ), జంషెడ్‌పుర్‌ ఒకటి. దీంతోపాటు జేవియర్‌ అనుబంధ సంస్థల్లో ఎంబీఏ/పీజీడీఎం కోర్సులో ప్రవేశానికి ఎక్స్‌ఏటీ ఏటా నిర్వహిస్తున్నారు. వివిధ ఐచ్ఛికాలతో ఇక్కడ మేనేజ్‌మెంట్‌ కోర్సులు లభిస్తున్నాయి. హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ స్పెషలైజేషన్‌కు అత్యుత్తమ సంస్థగా ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐని చెప్పుకోవచ్చు. దీనికి చెన్నై, ముంబై, బెంగళూరు, రాంచీ, భువనేశ్వర్‌, దిల్లీల్లో క్యాంపస్‌లు ఉన్నాయి. వీటిల్లో ప్రవేశం ఎక్స్‌ఏటీ స్కోరు, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూలతో లభిస్తుంది. ఇక్కడ చదువు పూర్తిచేసుకున్న విద్యార్థులు ప్రాంగణ నియామకాల్లో ఆకర్షణీయ వేతనాలతో బహుళజాతి సంస్థల్లో కొలువులు సొంతం చేసుకుంటున్నారు. 

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ప్రస్తుతం చివరి ఏడాది కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
రిజిస్ట్రేషన్‌ ఫీజు: రూ.2100.
దరఖాస్తులకు చివరి తేదీ: నవంబరు 30
అడ్మిట్‌ కార్డులు: డిసెంబరు 20 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
పరీక్ష తేదీ: జనవరి 7 (ఆదివారం), 2024
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్‌.
వెబ్‌సైట్‌: https://xatonline.in/


ఇవీ కోర్సులు

పీజీడీఎం: బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ (బీఎం), హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ (హెచ్‌ఆర్‌ఎం), జనరల్‌ మేనేజ్‌మెంట్‌(జీఎం), ఇన్నోవేషన్‌, ఆంత్రప్రెన్యూర్‌షిప్‌, వెంచర్‌ క్రియేషన్‌ (ఐఈవీ). వీటిని ఫుల్‌టైం రెసిడెన్షియల్‌ విధానంలో అందిస్తున్నారు. అలాగే పీజీ పూర్తిచేసుకున్నవారు, ప్రొఫెషనల్‌ కోర్సులు చదివినవాళ్లు, పని అనుభవం ఉన్నవారికోసం ఫెలో ప్రోగ్రాం ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (ఎఫ్‌పీఎం) కోర్సు నాలుగేళ్ల వ్యవధితో నడుపుతున్నారు. లాజిస్టిక్‌ సప్లై చెయిన్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ అనలిటిక్స్‌లో రెండేళ్ల కోర్సును అమెరికాలోని రట్జెర్జ్‌ బిజినెస్‌ స్కూల్‌తో కలిసి అందిస్తున్నారు.


ప్రవేశం కల్పించే కొన్ని ప్రముఖ సంస్థలు

ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ, జంషెడ్‌పూర్‌; ఫ్లేమ్‌ యూనివర్సిటీ, పుణె; ఫోర్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, న్యూదిల్లీ; గీతం యూనివర్సిటీ, విశాఖపట్నం, హైదరాబాద్‌, బెంగళూరు; గ్రేట్‌ లేక్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, చెన్నై; ఐఎఫ్‌ఎంఆర్‌, చిత్తూరు; ఐఐఆర్‌ఎం, హైదరాబాద్‌; ఐఎంటీ, హైదరాబాద్‌, నాగ్‌పుర్‌, ఘజియాబాద్‌, దుబాయ్‌; ఐఆర్‌ఎం, ఆనంద్‌; మైకా, అహ్మదాబాద్‌; నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంక్‌ మేనేజ్‌మెంట్‌, పుణె; పండిట్‌ దీన్‌ దయాళ్‌ పెట్రోలియం యూనివర్సిటీ, గాంధీనగర్‌; టీఏపాయ్‌, మణిపాల్‌; విట్‌, వెల్లూరు; విజ్ఞాన జ్యోతి, హైదరాబాద్‌.


ఆన్‌లైన్‌ పరీక్ష

ఆన్‌లైన్‌లో నిర్వహించే పరీక్షలో రెండు సెక్షన్లు ఉంటాయి. మొదటి సెక్షన్‌లో వెర్బల్‌ ఎబిలిటీ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌, డెసిషన్‌ మేకింగ్‌, క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ అండ్‌ డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. సెక్షన్‌ 2లో జనరల్‌ నాలెడ్జ్‌ ప్రశ్నలు అడుగుతారు. అలాగే వ్యాసం రాయాలి. సెక్షన్ల వారీ వ్యవధి నిబంధన లేదు. అభ్యర్థులు నచ్చిన సెక్షన్‌ నుంచి పరీక్ష ప్రారంభించుకోవచ్చు. ఒక విభాగం నుంచి మరో విభాగానికి వెళ్లిపోవచ్చు. పరీక్ష వ్యవధి 3:30 గంటలు. అన్ని ప్రశ్నలకు సమాన మార్కులు కేటాయిస్తారు. ప్రతి తప్పు జవాబుకూ పావు మార్కు తగ్గిస్తారు. జనరల్‌ నాలెడ్జ్‌ విభాగంలో రుణాత్మక మార్కులు లేవు. ఇందులో సాధించిన స్కోర్‌ గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూలకు పరిగణనలోకి తీసుకోరు. ఎక్స్‌ఏటీ- 2023లో వెర్బల్‌ ఎబిలిటీ అండ్‌ లాజికల్‌ ఎబిలిటీలో 26, డెసిషన్‌ మేకింగ్‌ ఎబిలిటీలో 22, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ అండ్‌ డేటా ఇంటర్‌ప్రిటేషన్‌లో 28, జనరల్‌ నాలెడ్జ్‌ నుంచి 25 ప్రశ్నలు అడిగారు. పాత ప్రశ్నపత్రాలు వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. అలాగే టాపర్స్‌ సూచనలూ అందుబాటులో ఉంచారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని