మేటి సంస్థల్లో మ్యాథ్స్‌, సైన్స్‌

కోర్సులు ఎన్ని ఉన్నప్పటికీ విస్తృత అవకాశాలు అందించడంలో మ్యాథ్స్‌, సైన్స్‌లే ముందుంటున్నాయి. వీటిని సుప్రసిద్ధ సంస్థల్లో చదివినవారు అత్యున్నత స్థాయిలో రాణించగలరు.

Published : 25 Mar 2024 00:05 IST

కోర్సులు ఎన్ని ఉన్నప్పటికీ విస్తృత అవకాశాలు అందించడంలో మ్యాథ్స్‌, సైన్స్‌లే ముందుంటున్నాయి. వీటిని సుప్రసిద్ధ సంస్థల్లో చదివినవారు అత్యున్నత స్థాయిలో రాణించగలరు. ఈ సబ్జెక్టుల్లో కెరియర్‌ను ఆశిస్తున్న ఇంటర్మీడియట్‌ విద్యార్థులు నేషనల్‌ ఎంట్రన్స్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ (నెస్ట్‌)కు ప్రాధాన్యం ఇస్తే ఉజ్వల భవిష్యత్తుకు ఆస్కారం ఉంటుంది. ఇటీవలే నెస్ట్‌-2024 ప్రకటన వెలువడింది!

పరీక్షలో ప్రతిభ చూపినవారు.. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆప్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (నైసర్‌), భువనేశ్వర్‌; యూనివర్సిటీ ఆఫ్‌ ముంబయి, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీ విభాగానికి చెందిన సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ బేసిక్‌ సైన్సెస్‌ (సీఈబీఎస్‌)ల్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ కోర్సులు చదువుకోవచ్చు. ఈ సంస్థల్లో  చేరినవారికి నెలకు రూ.5000 చొప్పున ఐదేళ్లపాటు ఉపకార వేతనం అందుతుంది.

మ్యాథ్స్‌, సైన్స్‌ కోర్సుల్లో మెరికల్లాంటి విద్యార్థులను గుర్తించి, వాళ్లను పరిశోధనల దిశగా ప్రోత్సహించాలనే లక్ష్యంతో నెస్ట్‌ను ఏటా నిర్వహిస్తున్నారు. బోధన, పరిశోధనల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఫ్యాకల్టీ, అధునాతన ల్యాబ్‌ సౌకర్యాలు, ఉన్నత ప్రమాణాలు.. నైసర్‌, సీఈబీఎస్‌ల ప్రత్యేకత. ఎంతో పేరున్న శాస్త్రవేత్తలతోనూ తరగతులు నిర్వహిస్తారు. ఈ సంస్థల్లో బయాలజీ, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో కోర్సులు అందిస్తున్నారు. నైసర్‌లో 200, సీఈబీఎస్‌లో 57 సీట్లు ఉన్నాయి. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీ (డీఏఈ) నుంచి దిశ ప్రోగ్రాంలో భాగంగా ఈ సంస్థల్లో చేరిన విద్యార్థులకు ప్రతి నెలా రూ.5000 స్టైపెండ్‌ అందుతుంది. అలాగే వేసవిలో ప్రాజెక్టు కోసం ఏడాదికి రూ.20,000 చొప్పున కాంటింజెన్సీ చెల్లిస్తారు.

అన్ని సెమిస్టర్లలోనూ మేటి ప్రతిభ చూపిన విద్యార్థులు భాభా అటామిక్‌ రిసెర్చ్‌ సెంటర్‌ (భార్క్‌) ట్రెయినింగ్‌ స్కూల్‌లో పరీక్ష రాయకుండా, నేరుగా ఇంటర్వ్యూలో పాల్గొనవచ్చు. ఇందులో మెరిసినవారు శిక్షణ తర్వాత భార్క్‌లో సైంటిఫిక్‌ ఆఫీసర్‌ హోదాలో విధులు నిర్వర్తించవచ్చు. నైసర్‌లో ఎమ్మెస్సీ పూర్తిచేసుకున్నవారికి హోమీ భాభా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ (హెచ్‌బీఎన్‌ఐ) డిగ్రీలను ప్రదానం చేస్తుంది. సీఈబీఎస్‌లో చదివినవారికి ముంబై యూనివర్సిటీ వీటిని అందిస్తుంది. ఈ రెండింటిలో కోర్సులు పూర్తిచేసుకున్నవారు దేశం, విదేశాల్లో పేరున్న సంస్థల్లో పీహెచ్‌డీలో చేరుతున్నారు. జాతీయ సంస్థల్లో ఫ్యాకల్టీ, కార్పొరేట్‌ సెక్టార్‌లో మేటి ఉద్యోగాలు వీరికి దక్కుతున్నాయి.

ప్రశ్నపత్రం

రీక్షను ఆన్‌లైన్‌లో ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. వ్యవధి మూడున్నర గంటలు. ప్రశ్నలు ఇంగ్లిష్‌, హిందీ మాధ్యమాల్లో ఉంటాయి. వీటిని 4 సెక్షన్ల నుంచి అడుగుతారు. అభ్యర్థికి ఆ సబ్జెక్టుల్లో ఉన్న పరిజ్ఞానం, విశ్లేషణ సామర్థ్యాన్ని తెలుసుకునేలా వీటిని రూపొందిస్తారు. సెక్షన్ల వారీ కనీస మార్కులు పొందడం తప్పనిసరి. సెక్షన్‌ 1 నుంచి 4 వరకు బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టుల్లో ప్రశ్నలు వస్తాయి. ఒక్కో సెక్షన్‌కూ 60 మార్కులు కేటాయించారు. ఒక్కో విభాగంలో 20 ప్రశ్నలు వస్తాయి. సరైన సమాధానం గుర్తిస్తే 3 మార్కులు. తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు. అభ్యర్థులు 4 సెక్షన్లలో ఎక్కువ మార్కులు సాధించిన మూడు సెక్షన్ల స్కోరుతో మెరిట్‌ లిస్టు తయారుచేస్తారు. దీని ప్రకారం మొత్తం 180 మార్కుల్లో అభ్యర్థులు సాధించిన స్కోరు పర్సంటైల్‌ విధానంలో లెక్కిస్తారు. జనరల్‌ అభ్యర్థులు 95, ఓబీసీలు 90, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 75 పర్సంటైల్‌ సాధించాలి. ఇలా అర్హుల జాబితా నుంచి మెరిట్‌, రిజర్వేషన్ల ప్రకారం విద్యార్థులను కోర్సుల్లోకి తీసుకుంటారు.

ముఖ్య వివరాలు

అర్హత: సైన్స్‌ గ్రూపులతో 2022, 2023లో ఇంటర్‌ ఉత్తీర్ణులు, ఈ ఏడాది ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 60 శాతం మార్కులు తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 55 శాతం ఉండాలి. వయసు నిబంధన లేదు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: మే 31 వరకు స్వీకరిస్తారు.

ఫీజు: జనరల్‌, ఓబీసీ పురుషులైతే రూ.1400. అన్ని వర్గాల మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.700.

అడ్మిట్‌ కార్డులు: జూన్‌ 15 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

పరీక్ష తేదీ: జూన్‌ 30 (రెండు సెషన్లలో ఉదయం, మధ్యాహ్నం)

ఫలితాలు: జులై 10న ప్రకటిస్తారు.

పరీక్ష కేంద్రాలు: తెలంగాణ.. హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌. ఏపీ.. గుంటూరు, కర్నూలు, రాజమహేంద్రవరం తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. (విద్యార్థులు వారి ప్రాధాన్యం ప్రకారం ఐదు కేంద్రాలు ఎంచుకోవాలి. పరీక్ష కేంద్రానికి 90 నిమిషాల ముందు చేరుకోవాలి)

వెబ్‌సైట్‌: https://www.nestexam.in/ 

సన్నద్ధత

బ్జెక్టులవారీ సిలబస్‌ వివరాలు నెస్ట్‌ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. అందులో పేర్కొన్న చాప్టర్లు, అంశాలను గమనించి, అధ్యయనంలో వాటిపైనే దృష్టి సారించాలి.

  • సీబీఎస్‌ఈ 11, 12 తరగతుల్లోని బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, మ్యాథ్స్‌ అంశాల నుంచే ప్రశ్నలొస్తాయి. అందువల్ల పాఠ్యపుస్తకాలు బాగా చదవాలి.
  • కొన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడానికి హైస్కూల్‌ స్థాయి పరిజ్ఞానమూ అవసరం కావచ్చు. అందువల్ల 8, 9, 10 తరగతుల మ్యాథ్స్‌, సైన్స్‌ పుస్తకాల్లోని ముఖ్యాంశాలూ అధ్యయనం చేయాలి.
  • ప్రాథమికాంశాలు, భావనలపై పట్టు సాధించాలి. వాటిలో ముఖ్యమైనవి రివిజన్‌ కోసం నోట్సు రాసుకోవాలి.  
  • ఏవైనా 3 సెక్షన్లకు సరైన జవాబులు గుర్తిస్తే సరిపోతుంది కాబట్టి బయాలజీ విద్యార్థులు మ్యాథ్స్‌ను, మ్యాథ్స్‌ విద్యార్థులు బయాలజీని చదవనవసరం లేదు.  
  • పాత ప్రశ్నపత్రాలను అధ్యయనం చేయాలి.
  • నెస్ట్‌ వెబ్‌సైట్‌లో 2007 నుంచి 2023 వరకు నిర్వహించిన పరీక్షల ప్రశ్నపత్రాలు, సమాధానాలు అందుబాటులో ఉంచారు. అవన్నీ సాధన చేయడంతోపాటు, ప్రశ్నలు ఏ స్థాయిలో అడుగుతున్నారో
  • గమనించాలి. సబ్జెక్టులవారీ ఏ చాప్టర్ల నుంచి ఏ తరహా ప్రశ్నలు, ఎన్నేసి వస్తున్నాయో తెలుసుకుని, అందుకు తగ్గట్టుగా సన్నద్ధం కావాలి.
  • ఎంసెట్‌, ఐఐటీ-జేఈఈ, నీట్‌ పాత ప్రశ్నపత్రాలు, మోడల్‌ పేపర్ల సాధన ఉపయోగకరం.
  • ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నవారు మోడల్‌ టెస్టులు రాసుకోవచ్చు. పరీక్షకు కొద్దిరోజుల ముందు మాక్‌ టెస్టు నెస్ట్‌ సైట్‌లో ఉంచుతారు. దాన్ని రాయాలి.


తాజా మార్పు

ఈసారి పరీక్ష విధానం మారింది.

1 గతంలో సింగిల్‌ ఆన్సర్‌, మల్టిపుల్‌ ఆన్సర్‌ ప్రశ్నలు వచ్చేవి. తాజాగా ప్రశ్నలన్నీ సింగిల్‌ ఆన్సర్‌వే అడుగుతారు.
2 గతంలో సబ్జెక్టుకు 50 మార్కులు. ఇప్పుడు వాటిని 60కి పెంచారు.
3 సబ్జెక్టుల వారీగా ఇచ్చే ప్రశ్నల సంఖ్య 17 నుంచి 20కి పెరిగింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని