సీటు సాధిస్తే.. భవితకు భరోసా!
ప్రతి కోర్సుకూ చెప్పుకోదగ్గ విశిష్ట విద్యాసంస్థలు కొన్ని ఉంటాయి. ఆ సంస్థల్లో బోధన ప్రమాణాలు, ల్యాబ్, లైబ్రరీ, వసతులు, ప్రోత్సాహకాలు, ప్రాంగణ నియామకాలు అన్నీ అత్యున్నతంగా ఉండటమే వాటి విశిష్టతకు కారణం.
సీఎంఐ, ఐఎస్ఐల్లో యూజీ, పీజీ, పీహెచ్డీ
ప్రతి కోర్సుకూ చెప్పుకోదగ్గ విశిష్ట విద్యాసంస్థలు కొన్ని ఉంటాయి. ఆ సంస్థల్లో బోధన ప్రమాణాలు, ల్యాబ్, లైబ్రరీ, వసతులు, ప్రోత్సాహకాలు, ప్రాంగణ నియామకాలు అన్నీ అత్యున్నతంగా ఉండటమే వాటి విశిష్టతకు కారణం. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ (ఐఎస్ఐ), చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్ (సీఎంఐ) ఇలాంటివే. వీటిలో మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, డేటా సైన్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ల్లో యూజీ, పీజీ, పీహెచ్డీ కోర్సులు అందిస్తున్నారు. రెండు సంస్థల్లోనూ ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
ఈ విద్యాసంస్థల్లో సీట్లకు పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. పేద విద్యార్థులకు ఫీజు మినహాయింపు, ప్రతిభావంతులకు స్టైపెండ్ దక్కుతాయి. భవిష్యత్తులో మేటి అవకాశాలు సొంతం చేసుకోవాలని ఆశించేవారు, పరిశోధనల దిశగా అడుగులేయాలనుకున్నవారు, సంబంధిత కోర్సులపై ప్రత్యేక ఆసక్తి ఉన్నవారు.. ఐఎస్ఐ, సీఎంఐల్లో చేరడానికి తొలి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. వీటిలో సీటు పొందితే భవిష్యత్తుకు భరోసా లభించినట్లే. విదేశీ సంస్థల నిపుణులతోనూ తరగతులు నిర్వహిస్తారు. ఇక్కడ చదివినవారు దేశంలో అత్యున్నతమైన, ప్రపంచ స్థాయి సంస్థల్లో బోధన, పరిశోధనలో గొప్ప అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు. అధిక స్టైపెండ్, వేతనంతో ప్రాంగణ నియామకాల్లో ఎంపికవుతున్నారు.
చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్
కోర్సులన్నీ రెసిడెన్షియల్ విధానంలో అందిస్తున్నారు. ట్యూషన్ ఫీజు సెమిస్టర్కు రూ.1.25 లక్షలు చెల్లించాలి. ఎమ్మెస్సీ డేటా సైన్స్కు రూ.2.5 లక్షలు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు పూర్తిగా, మిగిలినవారికి ఆర్థిక నేపథ్యం ప్రకారం పూర్తిగా లేదా పాక్షికంగా ఫీజు మినహాయింపు లభిస్తుంది. అలాగే ప్రతిభావంతులకు యూజీ కోర్సులకు ప్రతి నెలా రూ.5000 ఫెలోషిప్ చెల్లిస్తారు. ఎమ్మెస్సీ కోర్సులైతే రూ.6000 అందిస్తారు. పీహెచ్డీలకు మొదటి రెండేళ్లూ నెలకు రూ.37,000 తర్వాత మూడేళ్లు రూ.42,000 చెల్లిస్తారు. పీహెచ్డీలో చేరి, ప్రాంగణంలో వసతి సౌకర్యం పొందనివారు స్టైపెండ్లో 27 శాతం హెచ్ఆర్ఏ అందుకోవచ్చు. వీరికి ఏటా బుక్ గ్రాంట్ రూ.పది వేలు ఇస్తారు.
ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్
ఈ సంస్థకు కోల్కతా, దిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, తేజ్పూర్, గిరిడీల్లో క్యాంపస్లు ఉన్నాయి. ఐఎస్ఐ ప్రాంగణాల్లో బీస్టాట్, ఎంస్టాట్, బీ మ్యాథ్స్, ఎం మ్యాథ్స్, ఎంటెక్, పీజీ డిప్లొమా, పీహెచ్డీ కోర్సులు చదువుకోవచ్చు. ఇంటర్, డిగ్రీ, పీజీ పూర్తిచేసినవాళ్లు, చివరి సంవత్సరం కోర్సులు చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షలో ప్రతిభ, ఇంటర్వ్యూతో అవకాశం దక్కుతుంది. పరీక్షపై అవగాహన పొందడానికి సిలబస్, మాదిరి ప్రశ్నలు ఐఎస్ఐ వెబ్సైట్లో ఉంచారు.
ఈ సంస్థల్లో డిగ్రీ కోర్సుల్లో చేరినవారికి నెలకు రూ.5 వేలు, పీజీలకు రూ.8 వేలు, ఎంటెక్ కోర్సులకు రూ.12,400 స్టైపెండ్ చెల్లిస్తారు. ఇంజినీరింగ్ కోర్సుల్లో జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్పు (జేఆర్ఎఫ్)కు ఎంపికైతే నెలకు రూ.31,000+హెచ్ఆర్ఎ, సీనియర్ రిసెర్చ్ ఫెలోషిప్పులకు రూ.35,000+హెచ్ఆర్ఎ అందిస్తారు.
కోర్సులు, అర్హతలు
బీస్టాట్: మ్యాథ్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఇంటర్ పూర్తిచేసినవాళ్లు ఈ కోర్సుకు అర్హులు. కోల్కతా క్యాంపస్లో ఆనర్స్ విధానంలో కోర్సు నిర్వహిస్తున్నారు. కోర్సు వ్యవధి మూడేళ్లు. 63 సీట్లు ఉన్నాయి.
బీమ్యాథ్స్: మ్యాథ్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఇంటర్ పూర్తిచేసినవాళ్లు ఈ కోర్సుకు అర్హులు. బెంగళూరు క్యాంపస్లో ఆనర్స్ విధానంలో కోర్సు నిర్వహిస్తున్నారు. కోర్సు వ్యవధి మూడేళ్లు. 63 సీట్లు ఉన్నాయి.
పై రెండు కోర్సుల్లోనూ విద్యార్థినుల కోసం అదనంగా 16 చొప్పున సూపర్ న్యూమరరీ సీట్లు కేటాయించారు.
కొత్తగా బీఎస్ డీఎస్: యూజీ స్థాయిలో బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టికల్ డేటా సైన్స్ (బీఎస్ డీఎస్) కోర్సును ఐఎస్ఐ కోల్కతా, దిల్లీ, బెంగళూరు క్యాపంస్ల్లో అందిస్తున్నారు. ఒక్కో శాఖలో 25 చొప్పున సీట్లు ఉన్నాయి. ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, ఇంగ్లిష్ చదువుకున్నవారు అర్హులు.
ఏయే కోర్సులు?
బీఎస్సీ ఆనర్స్: మ్యాథ్స్ అండ్ కంప్యూటర్ సైన్స్; మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్
అర్హత: ఇంటర్ ఉత్తీర్ణులు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎమ్మెస్సీ: మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్
అర్హత: డిగ్రీలో మ్యాథ్స్ లేదా బీస్టాట్ లేదా బీటెక్ చదువుకున్నవారు ఎమ్మెస్సీ మ్యాథ్స్కు అర్హులు. కంప్యూటర్ సైన్స్ నేపథ్యంతో బీఎస్సీ, బీటెక్ కోర్సులు చదివినవారు ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్కు దరఖాస్తు చేసుకోవచ్చు. మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ లేదా కంప్యూటర్ సైన్స్తో యూజీ కోర్సులు చదివినవారు ఎమ్మెస్సీ డేటా సైన్స్కు అర్హులు. సంబంధిత సబ్జెక్టుల్లో చివరి ఏడాది కోర్సులు చదువుతోన్న విద్యార్థులూ అర్హులే.
పీహెచ్డీ: మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్
అర్హత: సంబంధిత విభాగాల్లో పీజీ ఉత్తీర్ణులు, చివరి ఏడాది కోర్సులు చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
పీజీ కోర్సులు
వీటిని రెండేళ్ల వ్యవధితో అందిస్తున్నారు.
మాస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్: స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా ఏదైనా మూడేళ్ల డిగ్రీ లేదా బీఈ/బీటెక్ చదివుండాలి. ఈ కోర్సు మొదటి సంవత్సరం కోల్కతా, చెన్నై, దిల్లీల్లో, ద్వితీయ సంవత్సరం కోల్కతా క్యాంపస్లో అందిస్తారు. 38 సీట్లు ఉన్నాయి.
మాస్టర్ ఆఫ్ మ్యాథమాటిక్స్: మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా ఏదైనా మూడేళ్ల డిగ్రీ లేదా బీఈ/బీటెక్ కోర్సు పూర్తిచేసినవారు అర్హులు. ఈ కోర్సు కోల్కతా క్యాంపస్లో అందిస్తున్నారు. 36 సీట్లు.
ఎంఎస్ క్వాంటిటేటివ్ ఎకనామిక్స్: ఏదైనా డిగ్రీ కోర్సుతోపాటు ఇంటర్లో మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదివుండాలి. కోల్కతా, దిల్లీ క్యాంపస్ల్లో అందిస్తున్నారు. దిల్లీలో 35, కోల్కతాలో 21 సీట్లు ఉన్నాయి.
ఎంఎస్ క్వాలిటీ మేనేజ్మెంట్ సైన్సెస్: మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా డిగ్రీలో చదివుండాలి లేదా ఏదైనా విభాగంలో బీఈ/ బీటెక్ పూర్తిచేయాలి. 20 సీట్లు ఉన్నాయి. బెంగళూరు, హైదరాబాద్ క్యాంపస్ల్లో నిర్వహిస్తున్నారు. తొలి రెండు సెమిస్టర్లు బెంగళూరు, మూడో సెమిస్టరు హైదరాబాద్ క్యాంపస్లో చదువుతారు.
ఎంఎస్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు ఈ కోర్సుకి దరఖాస్తు చేసుకోవచ్చు. బెంగళూరు క్యాంపస్లో అందిస్తున్నారు. 12 సీట్లు ఉన్నాయి.
జేఆర్ఎఫ్
స్టాటిస్టిక్స్ 9, మ్యాథ్స్ 10, క్వాంటిటేటివ్ ఎకనామిక్స్ 8, కంప్యూటర్ సైన్స్ 20, క్వాలిటీ రిలయబిలిటీ అండ్ ఆపరేషన్స్ రిసెర్చ్ 4, ఫిజిక్స్ అండ్ అప్లయిడ్ మ్యాథ్స్ 6, జియాలజీ 3, బయలాజికల్ సైన్స్ 4, లింగ్విస్టిక్స్ 1 చొప్పున జేఆర్ఎఫ్ అవకాశం లభిస్తుంది. కోల్కతా, దిల్లీ, బెంగళూరు, చెన్నై, గిరిడీ క్యాంపస్ల్లో ఈ కోర్సులు ఉన్నాయి. దీన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి ఎస్ఆర్ఎఫ్లోకి తీసుకుంటారు. సంబంధిత విభాగాల్లో పీజీ పూర్తిచేసుకున్నవారు జేఆర్ఎఫ్కు అర్హులు. ఎన్బీహెఎం/సీఎస్ఐఆర్/ యూజీసీ నెట్ స్కోరుతో అవకాశం కల్పిస్తారు.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 2.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.1500, జనరల్ మహిళలకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఓబీసీ (ఎన్సీఎల్)లకు రూ.750
పరీక్ష: మే 12న.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం.
వెబ్సైట్: https://www.isical.ac.in/
ఎంటెక్
కంప్యూటర్ సైన్స్ (సీఎస్): బీఈ/ బీటెక్ లేదా ఇంటర్లో మ్యాథ్స్తో ఏదైనా పీజీ చదివినవారు అర్హులు. కోల్కతా క్యాంపస్లో కోర్సు అందిస్తున్నారు. ఐఎస్ఐ పరీక్షతో 30, గేట్ స్కోర్తో 15 మందికి అవకాశం కల్పిస్తారు.
క్రిప్టాలజీ అండ్ సెక్యూరిటీ (సీఆర్ఎస్): బీఈ/బీటెక్ లేదా ఇంటర్లో మ్యాథ్స్తో ఏదైనా పీజీ చదివినవారు అర్హులు. కోల్కతా క్యాంపస్లో కోర్సు అందిస్తున్నారు. ఐఎస్ఐ పరీక్షతో 20, గేట్ స్కోర్తో 5 మందిని చేర్చుకుంటారు.
క్వాలిటీ, రిలయబిలిటీ అండ్ ఆపరేషన్ రిసెర్చ్ (క్యూఆర్ఓఆర్): స్టాటిస్టిక్స్లో మాస్టర్ డిగ్రీ ఉండాలి. దీంతోపాటు ఇంటర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివుండాలి. లేదా మ్యాథ్స్లో మాస్టర్ డిగ్రీతోపాటు డిగ్రీలో స్టాటిస్టిక్స్ ఇంటర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివుండాలి. లేదా బీఈ/బీటెక్ ఉండాలి. కోల్కతా క్యాంపస్లో కోర్సు అందుబాటులో ఉంది. 32 సీట్లు ఉన్నాయి.
పీజీ డిప్లొమా
ఈ కోర్సుల వ్యవధి ఏడాది.
స్టాటిస్టికల్ మెథడ్స్ అండ్ అనలిటిక్స్: మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ లేదా బీఈ/ బీటెక్ చదివినవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు వ్యవధి ఏడాది. చెన్నై, తేజ్పూర్ క్యాంపస్ల్లో అందిస్తున్నారు. చెన్నైలో 25, తేజ్పూర్లో 18 సీట్లు ఉన్నాయి.
పోస్టుగ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ మేనేజ్మెంట్ విత్ స్టాటిస్టికల్ మెథడ్స్ అండ్ అనలిటిక్స్ (పీజీడీఏఆర్ఎస్ఎంఏ): ఈ కోర్సును గిరిడీ (జార్ఖండ్) క్యాంపస్లో అందిస్తున్నారు. ఇందులో 18 సీట్లు ఉన్నాయి. డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. ఇంటర్లో మ్యాథ్స్ లేదా స్టాటిస్టిక్స్ చదివుండాలి. ఈ కోర్సుకు స్టైపెండ్ లేదు.
అప్లయిడ్ స్టాటిస్టిక్స్లో పీజీ డిప్లొమా: ఈ కోర్సును గత రెండేళ్ల నుంచి ఆన్లైన్లో కోర్స్ఎరాతో కలిసి అందిస్తోంది. ఇంటర్లో మ్యాథ్స్ చదివి, ఏదైనా డిగ్రీ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షతో ఎంపికలు ఉంటాయి. 30 సీట్లు ఉన్నాయి.
పరీక్ష ఇలా
బీఎస్సీలోని రెండు కోర్సులకూ ఉమ్మడి పరీక్ష వంద పాయింట్లకు నిర్వహిస్తారు. ఇందులో 2 విభాగాలుంటాయి. ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ తరహా ప్రశ్నలు వస్తాయి. పార్ట్ ఏ 40, పార్ట్ బీ 60 పాయింట్లు. పరీక్ష వ్యవధి 3 గంటలు. పార్ట్ ఏ స్క్రీనింగ్. ఇందులో కనీస పాయింట్లు సాధిస్తేనే పార్ట్ బీ మూల్యాంకనం చేస్తారు. తుది ఎంపిక రెండు విభాగాల్లో సాధించిన పాయింట్లతో ఉంటుంది. పార్ట్ ఏలో 10 ప్రశ్నలు వస్తాయి. ఒక్కో దానికి 4 పాయింట్లు. పార్ట్ బీలో 6 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 60 పాయింట్లు. ప్రశ్నలన్నీ ఇంటర్ మ్యాథ్స్లో ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగనోమెట్రీ, కాలిక్యులస్ విభాగాల నుంచి అడుగుతారు.
ఎమ్మెస్సీ, పీహెచ్డీ పరీక్షల్లోనూ రెండు విభాగాల్లో ప్రశ్నలు వస్తాయి. పార్ట్ ఏలో కనీస మార్కులు సాధిస్తేనే పార్ట్ బీ మూల్యాంకనం చేస్తారు. రెండు విభాగాల్లో సాధించిన మార్కులతో ప్రవేశం కల్పిస్తారు. ప్రశ్నలన్నీ సంబంధిత సబ్జెక్టుల్లో యూజీ పాఠ్యాంశాల నుంచి వస్తాయి. ఎమ్మెస్సీ డేటా సైన్స్ ప్రశ్నలు మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్ నుంచి అడుగుతారు. పాతప్రశ్నపత్రాలు, సొల్యూషన్లు సీఎంఐ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. వాటిని పరిశీలిస్తే ప్రశ్నల స్థాయి, చదవాల్సిన అంశాలపై అవగాహన పొందవచ్చు.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 15
దరఖాస్తు ఫీజు: రూ.వెయ్యి. రెండు కోర్సులకు రూ.1200.
పరీక్ష తేదీ: మే 19
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం.
వెబ్సైట్: www.cmi.ac.in/admissions/
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.