కమ్మని రుచుల కలినరీ కెరియర్‌

‘ఆహా.. ఏమి రుచి’ అంటూ మైమరచి తినేలా వండాలంటే పాకశాస్త్రంలో ప్రావీణ్యం ఉండాలి. రుచిగా వండటం ఒక్కటే కాదు.. మరెన్నో దీనిలో భాగమైవుంటాయి. పోషకాలు, వంటలో అనుసరించాల్సిన ప్రమాణాలు, వంట సామగ్రి సేకరణ, వండిన పదార్థాలను చక్కగా అలంకరించడం..

Updated : 04 Apr 2024 00:46 IST

‘ఆహా.. ఏమి రుచి’ అంటూ మైమరచి తినేలా వండాలంటే పాకశాస్త్రంలో ప్రావీణ్యం ఉండాలి. రుచిగా వండటం ఒక్కటే కాదు.. మరెన్నో దీనిలో భాగమైవుంటాయి. పోషకాలు, వంటలో అనుసరించాల్సిన ప్రమాణాలు, వంట సామగ్రి సేకరణ, వండిన పదార్థాలను చక్కగా అలంకరించడం... ఇవన్నీ శాస్త్రీయంగా అధ్యయనం చేయటానికి జాతీయ స్థాయిలో ప్రత్యేకంగా కొన్ని సంస్థలు నెలకొల్పారు. వాటిలో కేంద్ర పర్యటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్‌ కలినరీ ఇన్‌స్టిట్యూట్‌ ముఖ్యమైంది. ఈ సంస్థ నోయిడా, తిరుపతి కేంద్రాల్లో బీబీఏ, ఎంబీఏ కలినరీ కోర్సుల్లో ప్రవేశానికి ప్రకటన వెలువరించింది.

ఇందిరాగాంధీ జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం, అమర్‌కంఠక్‌తో కలసి, ఇండియన్‌ కలినరీ ఇన్‌స్టిట్యూట్లు బీబీఏ, ఎంబీఏ కలినరీ కోర్సులు అందిస్తున్నాయి. పరీక్షలో ప్రతిభతో ప్రవేశం కల్పిస్తారు. సీయూఈటీ (యూజీ/పీజీ) స్కోరుతోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సంస్థల్లో కోర్సులు పూర్తిచేసుకున్న విద్యార్థులు ప్రాంగణ నియామకాల ద్వారా మేటి అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు. హోటళ్లు, ఆతిథ్య, విమానయాన, పర్యటక సంస్థలు, ఆసుపత్రులు, కార్పొరేట్‌ కంపెనీలు, క్యాటరింగ్‌, షిప్పింగ్‌ సంస్థలు, రైల్వే, మిలటరీ...మొదలైనవాటిలో సేవలందించవచ్చు. భిన్న రంగాలకు చెందిన ప్రముఖుల దగ్గరా వీరికి అవకాశాలు లభిస్తాయి. సొంతగా ఫుడ్‌ కోర్టులు నిర్వహించవచ్చు. న్యూట్రిషన్‌ నిపుణులుగానూ నిలదొక్కుకోవచ్చు.  

బీబీఏ కలినరీ ఆర్ట్స్‌

సీట్లు: నోయిడా, తిరుపతి... ఒక్కో క్యాంపస్‌లో 120 చొప్పున ఉన్నాయి.
విద్యార్హత: 45 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌ లేదా సమాన స్థాయి కోర్సుల్లో ఉత్తీర్ణత. దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీలైతే 40 శాతం. ద్వితీయ సంవత్సరం ఫలితాల కోసం ఎదురుచూస్తున్నవారూ దరఖాస్తు చేయవచ్చు.  
పరీక్ష: ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున వంద మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. న్యూమరికల్‌ ఎబిలిటీ అండ్‌ అనలిటికల్‌ ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌ అండ్‌ లాజికల్‌ డిడక్షన్‌, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌, సర్వీస్‌ సెక్టార్‌ ఆప్టిట్యూడ్‌ వీటిలో ఒక్కో విభాగం నుంచి 20 చొప్పున ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు. రుణాత్మక మార్కులు లేవు. ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది.  

ఎంబీఏ కలినరీ ఆర్ట్స్‌

సీట్లు: ఒక్కో సంస్థలోనూ 30 ఉన్నాయి.
అర్హత: బీఎస్సీ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ లేదా కలినరీ ఆర్ట్స్‌ లేదా హాస్పిటాలిటీ కోర్సులు చదివినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత డిగ్రీలో 45 శాతం మార్కులు ఉండాలి. దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీలైతే 40 శాతం సరిపోతాయి.
పరీక్ష ఇలా: ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున వంద మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ఫుడ్‌ ప్రొడక్షన్‌, ఫుడ్‌ ఖీ బేవరేజ్‌ సర్వీస్‌, జనరల్‌ నాలెడ్జ్‌ ఖీ కరెంట్‌ అఫైర్స్‌, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌, సర్వీస్‌ సెక్టార్‌ ఆప్టిట్యూడ్‌ ఒక్కో విభాగం నుంచి 20 చొప్పున ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు. రుణాత్మక మార్కులు లేవు. ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు గడువు: మే 25. రిజిస్ట్రేషన్‌ ఫీజు లేదు.
పరీక్ష తేదీ: మే 26.
వెబ్‌సైట్‌: https://www.icitirupati.in/


ఐహెచ్‌ఎంల్లో..

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ (ఐహెచ్‌ఎం)ల్లో బీఎస్సీ హాస్పిటాలిటీ ఖీ హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కోర్సును చదువుకోవచ్చు. వీటిలో ప్రవేశాలకు గడువు తేదీ పొడిగించారు. నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌- జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (ఎన్‌సీహెచ్‌ఎం- జేఈఈ) పేరుతో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) పరీక్ష నిర్వహిస్తోంది. ఈ స్కోరుతో మొత్తం 78 సంస్థల్లో అవకాశం లభిస్తుంది. వీటిలో కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తోన్న 21 జాతీయ ఐహెచ్‌ఎంలు ఉన్నాయి. మిగిలినవి రాష్ట్ర స్థాయి, పబ్లిక్‌ సెక్టార్‌ అండర్‌ టేకింగ్‌, ప్రైవేటు సంస్థలు.

తెలుగు రాష్ట్రాల్లో...

కేంద్రం ఆధ్వర్యంలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ (ఐహెచ్‌ఎం) హైదరాబాద్‌, రాష్ట్రీయ సంస్థలైన డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ హైదరాబాద్‌, స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ తిరుపతి, తెలంగాణ స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌    హోటల్‌ మేనేజ్‌మెంట్‌ సంగారెడ్డి...    ఎన్‌సీహెచ్‌ఎం-జేఈఈతో ప్రవేశం కల్పిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 11,995 సీట్లు ఉన్నాయి. ఐహెచ్‌ఎం- హైదరాబాద్‌లో 285, వైఎస్‌ఆర్‌ నిథమ్‌, హైదరాబాద్‌లో 120, తిరుపతి, మెదక్‌ ఐహెచ్‌ఎంలు ఒక్కో దానిలో 60 సీట్లు ఉన్నాయి. ఈ పరీక్ష స్కోరుతో  పలు ఇతర సంస్థల్లోనూ చేరవచ్చు.

పరీక్ష ఇలా...

పరీక్ష ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో న్యూమరికల్‌ ఎబిలిటీ అండ్‌ ఎనలిటికల్‌ ఆప్టిట్యూడ్‌ 30, రీజనింగ్‌ అండ్‌ లాజికల్‌ డిడక్షన్‌ 30, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌ 30, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 60, సర్వీస్‌ సెక్టార్‌ ఆప్టిట్యూడ్‌ 50 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 3 గంటలు. ప్రతి సరైన సమాధానానికీ 4 మార్కులు. తప్పు జవాబుకు ఒక మార్కు తగ్గిస్తారు. ప్రశ్నలు ఇంగ్లిష్‌, హిందీ మాధ్యమాల్లో ఉంటాయి.

బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్‌ హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌

అర్హత: ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసినవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్‌ జండర్‌ రూ.450. ఈడబ్ల్యుఎస్‌   రూ.700. మిగిలిన అందరికీ రూ.1000
ఆన్‌లైన్‌ దరఖాస్తులు: ఏప్రిల్‌ 7 సాయంత్రం 5 వరకు స్వీకరిస్తారు.
పరీక్ష తేదీ: మే 11
పరీక్ష కేంద్రాలు: ఏపీలో.. గుంటూరు, నెల్లూరు, తిరుపతి, విశాఖపట్నం.     తెలంగాణలో.. హైదరాబాద్‌, వరంగల్‌.
వెబ్‌సైట్‌:https://exams.nta.ac.in/NCHM


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని