సమర్థ ఆర్థిక విధానాలకు సాధనాలు!

ఆర్థిక వ్యవస్థలో అనేక రకాల అంశాలు ఇమిడి ఉంటాయి. అవి ద్రవ్య విధాన నిర్ణయాలను, పెట్టుబడి వ్యూహాలను, వేతనాల తీరుతెన్నులను నిర్ణయిస్తుంటాయి. ఆ పరిణామాలను కొన్ని ధరల సూచికల ఆధారంగా అంచనా వేస్తుంటారు.

Published : 23 Feb 2024 00:23 IST

జనరల్‌ స్టడీస్‌  ఇండియన్‌ ఎకానమీ

ఆర్థిక వ్యవస్థలో అనేక రకాల అంశాలు ఇమిడి ఉంటాయి. అవి ద్రవ్య విధాన నిర్ణయాలను, పెట్టుబడి వ్యూహాలను, వేతనాల తీరుతెన్నులను నిర్ణయిస్తుంటాయి. ఆ పరిణామాలను కొన్ని ధరల సూచికల ఆధారంగా అంచనా వేస్తుంటారు. దాంతోపాటు జనాభా కొనుగోలు శక్తిని, ధరల స్థిరత్వాన్ని లెక్కించడానికి, స్థిరమైన వృద్ధిని కొనసాగించడానికి, ద్రవ్యోల్బణం ఒత్తిడిని నియంత్రించడానికి, సమర్థ ఆర్థిక విధానాలను రూపొందించడానికి ఆ సూచికలనే కొలమానాలుగా ఉపయోగిస్తుంటారు. వీటిపై పోటీ పరీక్షల్లో ప్రశ్నలు వస్తున్నాయి. అభ్యర్థులు ద్రవ్యోల్బణాన్ని గణించే సూచికలను, ఆహార ద్రవ్యోల్బణం, వివిధ నియంత్రణ చర్యల గురించి తెలుసుకోవాలి.

ద్రవ్యోల్బణం - కొలమానాలు

భారతదేశంలో ద్రవ్యోల్బణాన్ని రెండు సూచీల ఆధారంగా గణిస్తున్నారు. అవి 1) టోకు ధరల సూచిక (డబ్ల్యూపీఐ),  2) వినియోగ ధరల సూచిక (సీపీఐ).

టోకు ధరల సూచిక: మొదట్లో ద్రవ్యోల్బణాన్ని టోకు ధరల సూచిక ఆధారంగా గణించేవారు. వ్యవహారాల ప్రారంభ   దశలో పెద్ద మొత్తంలో వస్తువులు అమ్మేటప్పుడు ధరల సగటు మార్పును లెక్కిస్తారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణ గణాంకాలను నెలకు ఒకసారి విడుదల చేస్తున్నారు. గణనకు ప్రాథమిక వస్తువులు, ఫ్యూయల్‌, విద్యుత్తుకు సంబంధించిన వస్తువులు, తయారీ వస్తువులు అనే మూడు గ్రూపులు తీసుకుంటారు. ఈ గణనలో తయారీ వస్తువులు అత్యధిక భారితం (వెయిటేజీ) కలిగి ఉంటాయి. ఉత్పత్తి విలువను బట్టి ఈ భారితాన్ని ఇస్తారు. టోకుధరల సూచీలో సేవలను పరిగణనలోకి తీసుకోరు. ‘ఆఫీస్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ అడ్వైజర్‌’వారు టోకు ధరల సూచీని లెక్కించడానికి ఆధార సంవత్సరాన్ని 2004-05 నుంచి 2011-12కి 2017లో మార్చారు. టోకు ధరల సూచిక ఆధార సంవత్సరాన్ని ఇప్పటివరకు 7 సార్లు సవరించారు. అవి 1952-53, 1961-62, 1970-71, 1981-82, 1993-94, 2004-05, 2011-12. సౌమిత్ర చౌదరీ అధ్యక్షతన ఏర్పాటైన వర్కింగ్‌ గ్రూప్‌ 2011-12 ఆధార సంవత్సరాన్ని సిఫార్సు చేసింది. కొత్త ఆధార  సంవత్సరాన్ని మార్చిన తర్వాత వస్తువుల సంఖ్య 676 నుంచి 697కి పెరిగింది.

ప్రధాన అంశాలు: 1) కొత్త ఆధార సంవత్సరంలో పరోక్ష పన్నులను లెక్కించలేదు. 2) అంకమద్యమానికి బదులు ప్రస్తుతం గుణమద్యమంలో లెక్కిస్తున్నారు. 3) గతంలో విద్యుచ్ఛక్తిని వ్యవసాయం, గృహ, వాణిజ్య, రైల్వే, పారిశ్రామిక రంగాల్లో భాగంగా గణించేవారు. ప్రస్తుతం    విద్యుచ్ఛక్తిని ప్రత్యక్షంగా సింగిల్‌ యూనిట్‌గా గణిస్తున్నారు.

వినియోగ ధరల సూచిక: సమాజంలో ఒక వర్గం ప్రజల జీవన స్థితిగతులను తెలుసుకోవడానికి వినియోగధరల సూచికను గణిస్తారు. వారి వ్యయాన్ని బట్టి వస్తువులకు భారితాన్ని ఇస్తారు. దీనిలో రిటైల్‌ ధరలు తీసుకుంటారు. మనదేశంలో 4 రకాల వినియోగ ధరల సూచికలు ఉన్నాయి.

1) పారిశ్రామిక కార్మికుల వినియోగ ధరల సూచిక: లేబర్‌, ఎంప్లాయిమెంట్‌ సలహా కమిటీ ప్రకారం 260 వస్తువుల సేవలను అంచనా వేస్తారు. 2020, ఫిబ్రవరిలో ఆధార సంవత్సరాన్ని 2001 నుంచి 2016కి మార్చారు. నెలవారీ ప్రాతిపదికన గణాంకాలను సేకరిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యాన్ని (డీఏ) దీని ద్వారా ప్రకటిస్తారు.

2) వ్యవసాయ శ్రామికుల వినియోగ ధరల సూచిక: ఆధార సంవత్సరం 1986-87. నెలవారీ ప్రాతిపదికగా గణాంకాలను సేకరిస్తారు. వివిధ రాష్ట్రాల్లో వ్యవసాయ శ్రామికుల కనీస వేతనాలను సవరించడానికి ఉపయోగపడుతుంది.

ఉదా: ఉపాధిహామీ పనుల వేతనాలు

3) గ్రామీణ శ్రామికుల వినియోగ ధరల సూచిక: దీని ఆధార సంవత్సరం 1986-87. నెలవారీ ప్రాతిపదికన లెక్కిస్తారు. ఈ మూడు గణాంకాలను లేబర్‌ బ్యూరో ఆఫ్‌ ఇండియా వారు అంచనా వేస్తారు.

4) నూతన వినియోగ ధరల సూచిక: ఆధార సంవత్సరం 2011-12 కి ముందు వివిధ రకాల వినియోగ ధరల సూచికలను గణించేవారు. ఇవి ఏదో ఒక కేటగిరి ప్రజలకు సంబంధించిన వస్తువుల ధరల పెరుగుదలను మాత్రమే  ప్రకటించేవి. ఆర్థిక వ్యవస్థలోని మొత్తం ధరల పెరుగుదలను వ్యక్తపరిచేవి కావు. అందువల్ల ఆర్‌బీఐ గ్రామీణ, పట్టణాలకు సంబంధించి ద్రవ్యోల్బణ సూచికలను గణించాలని నిర్ణయించింది. దీని ఆధారంగా కేంద్ర గణాంక సంస్థ సీపీఐ గ్రామీణ, సీపీఐ పట్టణ, సీపీఐ అఖిలభారత సూచికలను తయారు చేస్తుంది.

  • 2001 జనాభా లెక్కల ప్రకారం 9 లక్షల జనాభా కంటే ఎక్కువ జనాభా ఉన్న 310 పట్టణాల్లో సీపీఐ పట్టణాన్ని   గణిస్తారు.
  • దేశంలో జిల్లాకు రెండు గ్రామాలను తీసుకుని 1183 గ్రామాల్లో ధరల కొటేషన్లను సేకరించడం ద్వారా సీపీఐ గ్రామీణాన్ని గణిస్తారు.
  • ఈ రెండింటినీ కలిపి సీపీఐ అఖిలభారతాన్ని రూపొందిస్తున్నారు. నూతన సీపీఐ గణనలో గ్రామీణ ప్రాంతాల్లో 225 , పట్టణ ప్రాంతాల్లో 250 వస్తువులను తీసుకుంటారు. 20రకాల సేవలను కూడా ఇందులో చేర్చారు. రిటైల్‌ ధరల ఆధారంగా దీనిని గణిస్తారు. ఈ నూతన సూచీని ఉర్జిత్‌ పటేల్‌ కమిటీ సిఫార్సు చేసింది. దీనిలో అత్యధిక భారితం ఆహార అంశాలకు ఉంది.

ప్రొడ్యూసర్‌ ప్రైస్‌ ఇండెక్స్‌ (పీపీఐ): బీఎన్‌ గోల్డర్‌ అధ్యక్షతన 2017లో మొదటిసారిగా ప్రయోగాత్మకంగా పీపీఐను ప్రవేశపెట్టారు. పీపీఐ అనేది మార్కెట్‌లోని ప్రాథమిక, మధ్యంతర, పూర్తిగా తయారైన వస్తువులు, సేవల ధరల్లో వచ్చే మార్పులను గణిస్తుంది. ప్రపంచంలో అనేక దేశాలు టోకుధరల సూచిక స్థానంలో పీపీఐని ప్రవేశపెట్టాయి. బీఎన్‌ గోల్డర్‌ కమిటీ భారత్‌లో టోకు ధరల సూచీ స్థానంలో పీపీఐని ప్రవేశపెట్టాలని, సూచీని నెలవారీ ప్రాతిపదికన విడుదల చేయాలని, ఆధార సంవత్సరం 2011-12ని కొనసాగించాలని, ప్రారంభంలో 15 సేవలను తీసుకోవాలని సిఫార్సు చేసింది.

ఆహార ద్రవ్యోల్బణం: గణించేందుకు రెండు సూచీలున్నాయి.

1) టోకు ధరల ఆధార ఆహార ద్రవ్యోల్బణం: టోకు ధరల సూచికలోని ప్రాథమిక వస్తువుల్లో ఆహార వస్తువులను, తయారీ వస్తువుల్లోని ఆహార వస్తువులను కలిపి దీన్ని లెక్కిస్తారు. దీనిలో అతిపెద్ద వాటాదారు ఆహారవస్తువులు. ఆ ఆహారవస్తువుల్లో అధిక భారితం కలిగింది పాలు.  

2) వినియోగ ధరల ఆధార ఆహార ద్రవ్యోల్బణం: కేంద్ర గణాంక సంస్థ దీన్ని 2014లో ప్రారంభించింది. గ్రామీణ, పట్టణ, దేశానికి సంబంధించిన రిటైల్‌ ధరల ద్వారా దీన్ని గణిస్తారు. ఆధార సంవత్సరం 2012లో ఆహారం, పానీయాల వాటా అధికంగా ఉంది.

హౌసింగ్‌ ప్రైస్‌ ఇండెక్స్‌: ఒక భౌగోళిక సరిహద్దు పరిధిలో నివాస ఆస్తుల ధరల్లో మార్పులను తెలియజేస్తుంది.భారతదేశ మొదటి రెసిడెక్స్‌ని 2007లో జాతీయ హౌసింగ్‌ బ్యాంకు ప్రారంభించింది. దీని ఆధార సంవత్సరం 2012-13. జాతీయ హౌసింగ్‌ బ్యాంకు 50 నగరాలకు సంబంధించిన రెసిడెక్స్‌ని ప్రచురిస్తోంది.

బాటిల్‌నెక్‌ ఇన్‌ఫ్లేషన్‌: డిమాండ్‌ మారకుండా సప్లయి భారీగా పడిపోతే పెరిగే ధరలను బాటిల్‌నెక్‌ ఇన్‌ఫ్లేషన్‌ అంటారు.

ద్రవ్యోల్బణ ధోరణిలో మార్పులు (2015-20): 2014 తర్వాత భారతదేశ ద్రవ్యోల్బణ ధోరణిలో వ్యవస్థాపరమైన మార్పులు చోటు చేసుకున్నాయి. 1977-2000 మధ్య కాలంలో ద్రవ్యోల్బణం 9.0 శాతంగా ఉండేది. 2005-06 మధ్యకాలంలో -5.0 శాతానికి తగ్గింది. తర్వాత 2006-14 మధ్య తిరిగి 9.0 శాతంగా నమోదైంది. ముడిచమురు, విదేశీ మారకరేటు తగ్గుదల, ఆహార ద్రవ్యోల్బణం పెరుగుదల ఇందుకు కారణాలు. 2014-15లో 5.9 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణ రేటు 2015-16లో 4.9 శాతానికి, ఆ తర్వాత 2016-17లో 4.5 శాతానికి తగ్గింది. టోకుధర, వినియోగ ధరల సూచీల మధ్య అంతరం తగ్గడమే ఇందుకు కారణం. 2014-15లో 4.7 శాతంగా ఉన్న ఈ అంతరం 2015-16లో 8.6 శాతానికి పెరిగింది. వర్తక వస్తువుల ధరల నియంత్రణ వల్ల టోకుధరల సూచీ స్థాయిని తగ్గించడంతో ఈ అంతరాన్ని 2.8 శాతానికి తగ్గించారు. వినియోగదారుడి ధరల సంబంధిత ఆహార ద్రవ్యోల్బణ రేటు 2014-15లో 6.4 శాతం నుంచి 2015-16లో 4.9 శాతానికి, తర్వాత 2016-17లో 4.2 శాతానికి తగ్గింది. ఆహారధాన్యాల ఉత్పత్తులు పెరగడం, 19 లక్షల టన్నుల ఆహారధాన్యాల మిగులు నిల్వలు ఏర్పాటుతో ఆహారద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చింది.

ద్రవ్యోల్బణ నియంత్రణకు సూచనలు: 1) నిరంతరం పెరుగుతున్న ప్రభుత్వ వ్యయం ముఖ్యంగా అభివృద్ధేతర వ్యయాన్ని నియంత్రించాలి. ప్రభుత్వ యంత్రాంగంపై చేసే రెవెన్యూ వ్యయాన్ని పెరగకుండా చూడాలి. 2) ప్రజాఉపయోగకరమైన పథకాలపై సమర్థంగా ఖర్చు చేసి, తక్కువ ప్రయోజనాలిచ్చే పథకాలు, ప్రచార కార్యక్రమాలపై వ్యయాన్ని నియంత్రించాలి. 3) ప్రభుత్వం లోటు బడ్జెట్‌ విధానానికి స్వస్తి చెప్పి సంతులిత బడ్జెట్‌ విధానం వైపు దృష్టి సారించాలి. అంటే రెవెన్యూలోటు, కోశలోటును స్థూల దేశీయోత్పత్తిలో 2.0 శాతానికి తగ్గించాలి. 4) బడ్జెట్‌ లోటును అధిగమించడానికి రాబడిని పెంచుకోవాలి. భారం అధికం కాకుండా ప్రస్తుత పన్నురేట్లను పెంచి, కొన్ని కొత్త పన్నులను విధించాలి. 5) దేశీయ, విదేశీయ రుణభారం నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో రుణసేకరణ నియమాలను పాటిస్తూ వడ్డీ చెల్లింపుల భారాన్ని కనిష్ఠంచేయాలి. 6) కొరతగా ఉన్న వస్తువుల దిగుమతిని అనుమతించి, వాటి ఎగుమతిని క్రమబద్దీకరించాలి. దేశీయఉత్పత్తులను పెంచడానికి ప్రోత్సాహం ఇవ్వాలి. 7) అక్రమనిల్వలు, చీకటి వ్యాపారం లాంటి ప్రమాదకర పద్ధతులను కఠినంగాఅణచివేయాలి.

ఆహార ద్రవ్యోల్బణం ఏర్పడటానికి కారణాలు: ఆహార ద్రవ్యోల్బణం ఏర్పడటానికి ప్రధానంగా నాలుగు కారణాలు ఉన్నాయి. 1) చక్కెర, పప్పులు, ఉల్లిపాయలు లాంటి నిత్యావసర వస్తువుల అక్రమనిల్వ. 2) బహుళజాతి సంస్థలు ఆహారవస్తువుల వ్యాపారంలో భావి వ్యాపారాన్ని నిర్వహించడం. 3) వ్యవసాయరంగంలో సమస్యల వల్ల దేశ జనాభాకు అవసరమైన పరిమాణంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి జరగకపోవడం. 4) సబ్సిడీల తగ్గింపు, వ్యవసాయ ఉత్పాదకాలైన డీజిల్‌, ఎరువుల ధరలు   పెరగడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరగడం.

నియంత్రణ చర్యలు: 1) కోశసంబంధ చర్యలుగా వరి, గోధుమ, పప్పులు, వంటనూనెలపై దిగుమతి సుంకాన్ని సున్నారేటుకు తగ్గించింది. రిఫైన్డ్‌ నూనెలు, వెజిటేబుల్‌ ఆయిల్‌పై ఈ సుంకాన్ని ప్రభుత్వం 7.5 శాతానికి తగ్గించింది.ముడి చక్కెర దిగుమతిపై సుంకాన్ని కూడా సున్నారేటుకు తగ్గించింది. బియ్యం, వంటనూనెలు, పప్పుధాన్యాలు ఎగుమతిని నిషేధించింది. 2) బియ్యం, మినుము, కందిపప్పు లాంటి ఆహారధాన్యాల భావివ్యాపారాన్ని నిలిపివేసింది. 3) రాష్ట్రప్రభుత్వాలు రైతుబజార్లు, సంచాలక బజార్లు నెలకొల్పడానికి అనుమతించింది. 4) మండీ టాక్స్‌, ఆక్ట్రాయ్‌ ఇతర స్థానిక పన్నుల వసూలును నిలిపేయాలని సూచించింది. 5) శీతల గిడ్డంగుల నిర్మాణానికి కావాల్సిన నిధులకు ప్రోత్సాహం ఇచ్చింది. 6) 2016-17 నుంచి ద్రవ్యోల్బణ ప్రభావాలను తగ్గించడానికి ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసింది.7)20 లక్షల టన్నుల కందిపప్పు మిగులు నిల్వలను ఏర్పాటుచేసి దాన్ని సబ్సిడీ ధరకు అమ్మడానికి ఏర్పాట్లుచేశారు. కందిపప్పు, ఉల్లిపాయలు, వంటనూనెలనిల్వలు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు లభించాయి. వీటి దిగుమతులపై సుంకం లేకుండా చేసి ఎగుమతులపై ఆంక్షలు విధించారు. 8) ఆహారవస్తువుల కనీస మద్దతుధరను బాగా పెంచారు.9) చక్కెర ఎగుమతులపై 20 శాతం పన్నువిధించి వంటనూనెలు, బంగాళాదుంపలపై దిగుమతి సుంకాన్ని తగ్గించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని