భవిష్యత్తుకు బాటలు వేశారు!

సామాన్యుల దృష్టిలో భవిష్యత్తు అంటే కొద్ది నెలల్లో, ఏళ్లలో మొదలవుతుంది. కానీ వ్యాపారుల దృష్టిలో అది నేడే!

Updated : 21 May 2023 03:57 IST

సామాన్యుల దృష్టిలో భవిష్యత్తు అంటే కొద్ది నెలల్లో, ఏళ్లలో మొదలవుతుంది. కానీ వ్యాపారుల దృష్టిలో అది నేడే! భవిష్యత్తుని ముందుగానే అంచనా వేసి తమ వ్యాపారానికి ఆ దిశగా పునాది వేయడం విజయవంతమైన వ్యాపారుల లక్షణం. ఈ యువకులు అదే పనిచేసి తమ వ్యాపారంలో దూసుకెళ్తున్నారు!


పాతఫోన్లని ‘క్యాష్‌’ చేస్తోంది!

కొత్తవాటిని కొనడమే కాదు, పాతవాటిని వినియోగంలోకి తీసుకురావడమూ చాలా అవసరం. ముఖ్యంగా ఖరీదైన సెల్‌ఫోన్లని. ఇలా చేస్తే పర్యావరణానికీ ఎంతో మేలు. ఎందుకంటే సెల్‌ఫోన్లలో వాడే భాగాల్లో ఎక్కువ శాతం అరుదైన ఖనిజాలతో తయారవుతాయి. వాటిని పునర్వినియోగిస్తే... వృధా కాకుండా చేయొచ్చు. ఈ అవసరాన్ని పదేళ్ల కిందటే గుర్తించారు మన్‌దీప్‌ మనోచా, నకుల్‌ కుమార్‌. వీరిద్దరూ పంజాబ్‌ యూనివర్సిటీ నుంచి 2009లో ఎంబీఏ చేశారు. తర్వాత రీసైక్లింగ్‌ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఆ క్రమంలో వారి దృష్టి ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలవైపు మళ్లింది. అలా 2014లో ‘క్యాషిఫై’ని ప్రారంభించారు. ఈ సంస్థకు పాత మొబైల్‌ ఫోన్లను అమ్మొచ్చు, వారి దగ్గర రిపేర్‌ చేయించుకోవచ్చు, వారినుంచి సెకండ్‌ హ్యాండ్‌ ఫోన్లని కొనొచ్చు. పాత ఫోన్‌ అమ్మకానికి పెడితే ఈ సంస్థ ప్రతినిధి వచ్చి దాన్ని పరీక్షించి తగిన ధర చెల్లించి తీసుకువెళ్తారు. గుడ్‌గావ్‌ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఆఫ్‌లైన్‌ దుకాణాల ద్వారానూ సేవలు అందిస్తోంది. ప్రస్తుతం నెలకు 1.5 లక్షల మొబైల్‌ ఫోన్లను పునర్వినియోగంలోకి తెచ్చి అమ్ముతున్నారు. సామ్‌సంగ్‌, వన్‌ప్లస్‌, షావోమీ... తదితర కంపెనీలతో కలిసి పాత ఫోన్ల కొనుగోళ్ల వ్యాపారంలో భాగమవుతున్నారు. ఈ విభాగంలో క్యాషిఫైనే అతిపెద్ద సంస్థ. ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.800 కోట్ల టర్నోవర్‌ సాధించిందీ సంస్థ. 2022లో న్యూక్వెస్ట్‌ క్యాపిటల్‌ పార్ట్‌నర్స్‌ నుంచి రూ.700కోట్లు పెట్టుబడులు సంపాదించింది.


బ్యాటరీ... ఎప్పుడైనా ఎక్కడైనా!

పుల్కిత్‌ ఖురానా, సిద్ధార్థ్‌ సిక్కా... ఐఐటీ కాన్పూర్‌ పూర్వ విద్యార్థులు. గతంలో ఇంధన, రవాణా రంగ సంస్థల్లో పనిచేసిన అనుభవం వీరి సొంతం. రవాణాలో ఎలక్ట్రిక్‌ వాహనాలు పెరగడం చూసి అక్కడ మార్కెట్‌లో బ్యాటరీల సమస్యని పరిష్కరించాలనుకున్నారు. వీళ్లు ప్రారంభించిన ‘బ్యాటరీ స్మార్ట్‌’ సంస్థ బైకులూ, ఆటోరిక్షాలకు బ్యాటరీల్ని మార్పిడిచేసే సదుపాయాన్ని కల్పిస్తోంది. దేశంలోని 17 ప్రధాన నగరాల్లో 500 బ్యాటరీ మార్పిడి కేంద్రాలలో లిథియం అయాన్‌ బ్యాటరీల్ని వీరు అందిస్తారు. వీరికి 17వేల మంది వినియోగదారులున్నారు. టాటా పవర్‌ లాంటి సంస్థలతో వీరికి భాగస్వామ్యం ఉంది. ప్రస్తుతం రూ.200 కోట్ల విలువైన 50 వేల బ్యాటరీల్ని మార్కెట్‌లో ఉంచారు. ఈ ఏడాది చివరికల్లా 40 నగరాలకు విస్తరించాలన్నది వీరి లక్ష్యం. కొత్త విభాగం కావడంతో ప్రారంభంలో అనేక సవాళ్లనీ ఎదుర్కొంది. గత మూడేళ్లలో 10 లక్షల బ్యాటరీల్ని మార్పిడి చేసింది. కేవలం రెండు నిమిషాల్లో బ్యాటరీని మార్చడం వీరి ప్రత్యేకత.  టైగర్‌ గ్లోబల్‌ లాంటి సంస్థల పెట్టుబడులున్న ‘బ్యాటరీ స్మార్ట్‌’ విలువ సుమారు రూ.వెయ్యి కోట్లు.


ఉపగ్రహ చిత్రం... సుస్పష్టం!

భారత్‌ నుంచి తొలి ప్రైవేటు కమర్షియల్‌ ఇమేజింగ్‌ ఉపగ్రహం ‘శకుంతల’ని అభివృద్ధి చేసింది పిక్సెల్‌. 2022 ఏప్రిల్‌లో ఈ హైపర్‌స్పెక్ట్రల్‌ ఇమేజింగ్‌ ఉపగ్రహాన్ని అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. బెంగళూరు కేంద్రంగా పనిచేసే పిక్సెల్‌ వ్యవస్థాపకులు అవాయిస్‌ అహ్మద్‌, క్షితిజ్‌ ఖండేల్వాల్‌. బిట్స్‌ పిలానీ పూర్వ విద్యార్థులైన వీరికి అంతరిక్ష రంగం అంటే ఆసక్తి. బిట్స్‌లో ‘స్టూడెంట్‌ శాటిలైట్‌ బృందం’లో సభ్యులు. అప్పట్లో స్పేస్‌ ఎక్స్‌ సంస్థ నిర్వహించిన ‘హైపర్‌లూప్‌ పాడ్‌’ పోటీలో ‘టీమ్‌ హైపర్‌లూప్‌ ఇండియా’ బృందంలోనూ ఉన్నారు. అమెరికాకు చెందిన ‘టెక్‌స్టార్స్‌ స్టార్‌బరస్ట్‌ స్పేస్‌ యాక్సలిరేటర్‌’ పోటీ- 2019లో ఆసియా నుంచి ఎంపికైన ఏకైక సంస్థ పిక్సెల్‌. ‘శకుంతల’ ప్రయోగానికి కొద్ది నెలల ముందు రూ.200 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వివిధ రంగాల్లో మెరుగైన ప్రణాళికకు ఉపగ్రహ చిత్రాల అవసరం పెరిగింది. ప్రతి 24 గంటలకూ భూమిమీద ఫొటోల్ని తీసి పంపుతుంది ‘శకుంతల’. నాసా, ఇస్రో చిత్రాలకంటే 33 శాతం అధిక నాణ్యతతో ఉంటాయివి. ఈ చిత్రాలు అడవుల పర్యవేక్షణకూ, రోడ్ల నిర్మాణంలో, ప్రకృతి వైపరీత్యాలప్పుడు నష్టతీవ్రత అంచనా వేయడానికి, సహజ వాయువులూ, ఆయిల్‌ పైప్‌లైన్ల పర్యవేక్షణకూ, పడవల ట్రాకింగ్‌కీ... ఇలా అన్నింటా సాయపడతాయి.   అమెరికాకు చెందిన ‘నేషనల్‌ రికానైజెన్స్‌’ సంస్థ ఉపగ్రహ చిత్రాలు పొందేందుకు పిక్సెల్‌తో అయిదేళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. త్వరలో మరిన్ని ఉపగ్రహాల్నీ అంతరిక్షంలో ప్రవేశపెట్టనుంది పిక్సెల్‌.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..