అనాథ విద్యార్థులకు అన్నీ తామై!
పిల్లలూ మొక్కల్లాంటివారే. కుటుంబమనే పాదులో... ఆరోగ్యమనే నారువేసి... ప్రేమ అనే నీరు పోయాల్సినవారు. విద్య అనే సూర్యరశ్మిని పొందాల్సినవారు.
పిల్లలూ మొక్కల్లాంటివారే. కుటుంబమనే పాదులో... ఆరోగ్యమనే నారువేసి... ప్రేమ అనే నీరు పోయాల్సినవారు. విద్య అనే సూర్యరశ్మిని పొందాల్సినవారు. పేదరికమో తల్లిదండ్రుల మరణమో... కారణం ఏదైనా సరే... కొందరు పిల్లలకి ఆ పాదూ, నారూ, నీరూ, వెలుగూ దక్కవు. అలాంటివాళ్ళకి మేమున్నామంటూ ముందుకొస్తున్నారు తెలుగురాష్ట్రాలకి చెందిన ఈ వితరణశీలులు.
అమ్మ స్ఫూర్తితో...
కొవిడ్ లాక్డౌన్ కాలం అది. చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోయి ప్రభుత్వ హాస్టల్లో తలదాచుకుంటున్న సంతోష్ని... నిర్వాహకులు వెళ్ళిపొమ్మన్నారు. అతనికి ఆశ్రయమిచ్చి ఇంతముద్ద పెట్టడానికి బంధువులూ ముందుకు రాలేదు. ఎటు పోవాలో పాలుపోని పరిస్థితిలో- కరీంనగర్లోని ‘బాలగోకులం’ గురించి తెలిసింది సంతోష్కి. ఫోన్ చేసిందే తడవుగా అతణ్ణి అక్కున చేర్చుకున్నారు ఆ సంస్థ నిర్వాహకులు. మూడేళ్ళకిందట ఇక్కడికొచ్చిన సంతోష్ ప్రస్తుతం సివిల్స్ సిద్ధం అవుతున్నాడు. ఇలా గత పదేళ్ళలో ఎంతోమంది అనాథల్ని చేరదీసి ప్రయోజకుల్ని చేసింది బాలగోకులం. ఈ ఏడాది 40 మంది విద్యార్థులు ఆశ్రయం పొందుతున్నారు. 10 ఏళ్ళు పైబడ్డ అనాథలు ఎవరైనా ఇక్కడికి వచ్చి, ఉద్యోగం సాధించేవరకూ ఏ బాదరబందీ లేకుండా ఉండొచ్చు. పిల్లలకి ఇష్టమైన వంటలే చేయాలన్న నిబంధన ఉంది ఇక్కడ. వాళ్ళు బడికో కాలేజీకో వెళ్ళి వచ్చాక ఉదయం సాయంత్రం కోచింగ్ తరగతులూ నిర్వహిస్తారు. కరీంనగర్కి చెందిన గంపా వెంకటేశ్ అనే వ్యాపారి ఈ బాలగోకులాన్ని ఏర్పాటుచేశారు. జీవించినంత కాలం అనాథలకీ అభాగ్యులకీ సాయపడుతూనే ఉన్న తన తల్లి స్ఫూర్తితో ఈ ఆశ్రమాన్ని నెలకొల్పినట్లు చెబుతారాయన. ‘వెంకట్ ఫౌండేషన్’ పేరుతో నెలకి లక్షన్నర రూపాయల ఖర్చుతో ఈ అనాథాశ్రమాన్ని నిర్వహిస్తున్నారు.
అరుణమల్లిక్, న్యూస్టుడే, కరీంనగర్(సాంస్కృతికం)
ఇదో నిశ్శబ్ద విప్లవం...
కడప జిల్లా పులివెందులకి చెందిన మొమ్మెల రాజు... ధనవంతుడేమీ కాదు. స్థానిక బ్లడ్ బ్యాంకులో పనిచేసే మామూలు ఉద్యోగి. అయితేనేం- సమాజాన్ని బాగా ఎరిగినవాడు. నిరుపేదలూ, అనాథలైన పిల్లలు జీవితంలో పైకి వచ్చే అవకాశాలు ఏమేం ఉన్నాయో తెలిసినవాడు. ముఖ్యంగా ‘ఏపీ ఆర్జేసీ- సెట్’లో చదివితే ఎంతటి పేద విద్యార్థి అయినా మంచి ప్రమాణాలతో కూడిన ఇంటర్ విద్య అందుకోవచ్చని గ్రహించాడు. ‘పాలి-సెట్’లో విజయాన్ని అందుకుంటే వృత్తి నిపుణులుగా ఓస్థాయికి ఎదగొచ్చని నమ్మాడు. ఆ రెండింటి కోసం పూర్తి ఉచితంగా కోచింగ్ ఇచ్చేందుకు ‘స్నేహిత అమృత హస్తం’ అన్న సంస్థని ఏర్పాటుచేశాడు.
పద్నాలుగేళ్ళకిందట ఒక్క టీచర్, పాతికమంది విద్యార్థులతో కేవలం తన జీతంతో ఈ సంస్థని స్థాపించాడు రాజు. ఇప్పటిదాకా సుమారు ఐదువేల మంది విద్యార్థులకి శిక్షణ ఇచ్చి ప్రవేశపరీక్షలని రాయించాడు. వందలాదిమందికి చక్కటి విద్యాసంస్థల్లో చదివేందుకు మార్గం చూపాడు. ఇప్పటికీ ఏటా 250 మందికి శిక్షణ ఇస్తున్నాడు. ఈ బృహత్కార్య నిర్వహణకు తమ వంతు సాయంగా- ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న 35 మంది శిక్షకులు ఇక్కడి కొచ్చి ఉచితంగా శిక్షణ అందించడం విశేషం.
కొలిపాక వెంకటసాయి, ఈనాడు జర్నలిజం స్కూలు
ఇంజినీరింగ్, మెడిసిన్ అయినా...
కర్నూలు జిల్లాలో ఏ ప్రమాదాలవల్లో తీవ్ర అనారోగ్యం వల్లో ఎవరైనా చనిపోయారన్న వార్తలు వస్తే - వెంటనే వాటి ‘కటింగ్స్’ని తీసిపెట్టుకుంటారు ‘స్కంధాన్షి ఫౌండేషన్’ సభ్యులు. మృతుల పిల్లలు ఏమయ్యారా అని అరాతీయడం మొదలుపెడతారు. తల్లిదండ్రులిద్దరూ చనిపోతేనో, ఒక్కరే మిగిలి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంటేనో ఆ చిన్నారుల్ని అక్కున చేర్చుకుంటారు. కర్నూలు బిర్లా సర్కిల్లోని తమ ఆశ్రమానికి తీసుకొచ్చి ఎంతదాకైనా చదివిస్తారు. పేరున్న కార్పొరేట్ బడుల్లోనూ చేర్పిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో పిల్లల్ని చదివించలేని పేద తల్లిదండ్రులకీ కావాల్సిన ధన సహాయం చేస్తున్నారు. ప్రతిభ ఉన్న పిల్లల్ని ఇంజినీరింగ్, మెడిసిన్ దాకా ఉచితంగానే చదివిస్తున్నారు. వీటన్నింటి కోసం నెలనెలా రూ.70 లక్షల దాకా ఖర్చుచేస్తోంది స్కంధాన్షి ఫౌండేషన్. కె.సురేశ్కుమార్రెడ్డి ఈ సంస్థ వ్యవస్థాపకుడు. కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలోని ప్యాలకుర్తి ఆయన స్వస్థలం. అక్కడి నుంచి ఒక్కో మెట్టే ఎదుగుతూ కర్నూలులోనూ బెంగళూరులోనూ స్థిరాస్తి వ్యాపారిగా మంచి పేరుతెచ్చుకున్నాడు. ఈ క్రమంలో విద్యే సమాజాన్ని మార్చే ఆయుధమన్న విషయాన్ని అర్థం చేసుకున్నాడు. ఆ విద్యని అందుకోలేని అనాథలూ అభాగ్యుల్ని ఆదుకోవాలన్న లక్ష్యంతోనే 2020లో స్కంధాన్షి ఫౌండేషన్ను ఏర్పాటుచేశారు. కనీసం 300 మందికైనా ఆశ్రయం కల్పించడమే తన ఆశయమని చెబుతారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్