Andhra News: గూగుల్‌తో ఒప్పందం గేమ్‌ ఛేంజర్‌.. ఏపీకే కాదు.. దేశానికే గర్వకారణం

Eenadu icon
By Andhra Pradesh News Team Updated : 13 Oct 2025 05:02 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఈనాడు, అమరావతి: విశాఖలో గూగుల్‌ సంస్థ అతిపెద్ద డేటాసెంటర్‌ను ఏర్పాటుచేసే ప్రతిపాదనపై దిల్లీలో మంగళవారం ఎంవోయూ కుదుర్చుకోనున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. 2029 నాటికి డేటాసెంటర్‌ను సంస్థ పూర్తిచేస్తుందని పేర్కొన్నారు. ఇది ఏపీకే కాదు.. దేశానికే గర్వకారణమవుతుందన్నారు. ఆదివారం విలేకరుల సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. ‘గూగుల్‌తో చరిత్రాత్మక ఒప్పందాన్ని కదుర్చుకుంటున్నాం. రాష్ట్రానికి ఇదో గేమ్‌ఛేంజర్‌ అవుతుంది. దేశంలోనే అతిపెద్ద డేటాసెంటర్‌ హబ్‌గా విశాఖ తయారవుతుంది. ఏఐ, హైఎండ్‌ ఉద్యోగాలు యువతకు వస్తాయి. డేటా సెంటర్‌కు సింగపూర్‌ నుంచి సబ్‌మెరైన్‌ కేబుల్‌ను సముద్రమార్గంలో సంస్థ ఏర్పాటుచేస్తుంది.

ఈ ప్రాజెక్టు వచ్చినప్పుడు కలిగిన ఆనందం, అనుభూతి నాకెప్పుడూ కలగలేదు. ఈ 16 నెలల్లో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం. అందులో గూగుల్‌ ఒకటి. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి వచ్చేందుకు ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్, కేంద్ర ఐటీ మంత్రి సానుకూలంగా స్పందించారు’ అని పేర్కొన్నారు. ఇటుక ఇటుకా పేర్చి హైదరాబాద్‌ను మహానగరంగా తీర్చిదిద్దామని.. మైక్రోసాఫ్ట్‌ రావడంతో బ్రాండ్‌ వచ్చిందని పేర్కొన్నారు. విశాఖకు గూగుల్‌ రాకతోనూ అదే పరిస్థితి వస్తుందన్నారు. విశాఖలో నవంబరు 14, 15 తేదీల్లో నిర్వహించే పెట్టుబడుల సదస్సుకు ప్రధాని మోదీని ఆహ్వానించనున్నట్లు తెలిపారు. 

వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందని సీఎం పేర్కొన్నారు. దీనివల్ల రాష్ట్ర బ్రాండ్‌ దెబ్బతిందని అన్నారు. ‘ఇప్పుడిప్పుడే రాష్ట్రం కోలుకుంటోంది. ఆర్సెలార్‌ మిత్తల్‌ సంస్థ విశాఖలో రూ.1.30 లక్షల కోట్ల పెట్టుబడులతో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటుచేయనుంది. రామాయపట్నం పోర్టు దగ్గర బీపీసీఎల్‌ రూ.లక్ష కోట్లతో చమురుశుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటుచేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం, ఎన్టీపీసీతో కలిపి విశాఖలో ఏర్పాటుచేసే గ్రీన్‌హైడ్రోజన్‌ పార్కులో రూ.1.50 లక్షల కోట్ల పెట్టుబడులతో ప్రాజెక్టులు రానున్నాయి. పెట్టుబడుల కోసం మేం ప్రయత్నిస్తుంటే.. సంస్థలకు భూములు ఎందుకు ఇచ్చారంటూ అడ్డుపడే ప్రయత్నం వైకాపా చేస్తోంది. పెట్టుబడులు రాకుండా అడ్డుపడటం.. బ్లాక్‌మెయిల్‌ చేయడం వారికి అలవాటైంది’ అని చంద్రబాబు వివరించారు.

Tags :
Published : 13 Oct 2025 04:55 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని