ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తే జైలుకే

‘రాష్ట్రంలో మైనార్టీ బుజ్జగింపు రాజకీయాలకు వ్యతిరేకంగా.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని నిద్ర లేపడానికి వచ్చా. దురాగతాలకు పాల్పడి పోలీసుస్టేషన్‌పై దాడి చేసినవారిని వదిలేసి భాజపా కార్యకర్తలపై కేసులు పెట్టాలని ప్రభుత్వం చెప్పడం దుర్మార్గం.

Published : 23 Jan 2022 03:24 IST

వైకాపాకు భాజపా ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ హెచ్చరిక
కర్నూలు ప్రజానిరసన సభలో ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన నేతలు

ఈనాడు డిజిటల్‌, కర్నూలు: ‘రాష్ట్రంలో మైనార్టీ బుజ్జగింపు రాజకీయాలకు వ్యతిరేకంగా.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని నిద్ర లేపడానికి వచ్చా. దురాగతాలకు పాల్పడి పోలీసుస్టేషన్‌పై దాడి చేసినవారిని వదిలేసి భాజపా కార్యకర్తలపై కేసులు పెట్టాలని ప్రభుత్వం చెప్పడం దుర్మార్గం. ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ ఇలాంటి దాడులు చేయడంతో అక్కడి ప్రజలు సమాజ్‌వాదీ పార్టీని 2017 ఎన్నికల్లో ఓడించారు. అది గుర్తుపెట్టుకొని జగన్‌ ప్రభుత్వం గుణపాఠం నేర్చుకోవాలి. లేదంటే ఏపీ ప్రజలు వైకాపా ప్రభుత్వాన్ని పడగొడతారు.. సమాజ్‌వాదీ పార్టీకి పట్టిన గతే పడుతుంది’ అని భాజపా జాతీయ ప్రధానకార్యదర్శి అరుణ్‌సింగ్‌ అన్నారు. కర్నూలు ఎస్టీబీసీ మైదానంలో శనివారం నిర్వహించిన ‘ప్రజా నిరసన సభ’లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ), ఎస్డీపీఐ వంటి సంస్థల దుర్మార్గాలపై రాష్ట్రప్రభుత్వం కఠినచర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. అఖిలేశ్‌ యాదవ్‌ ప్రభుత్వంలో పనిచేసిన ఓ మంత్రి మతకలహాలు సృష్టించిన ముస్లింలపై చర్యలు తీసుకోకుండా ప్రయత్నం చేసి.. చివరకు జైలుకు వెళ్లాల్సి వచ్చిందని గుర్తుచేశారు. ఏపీలో అలాంటి ఓటుబ్యాంకు రాజకీయాలు చేస్తే అదే పరిస్థితి తలెత్తుతుందని హెచ్చరించారు. కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్‌, అసోం, త్రిపురలో సైతం ఇలాంటి ఓటు బ్యాంకు విధానాలను గుర్తించిన ప్రజలు భాజపా వైపు మొగ్గు చూపారన్నారు. ప్రధాని నరేంద్రమోదీ అన్ని మతాలనూ సమానంగా చూస్తున్న విధానాలు చూసి జగన్‌మోహన్‌రెడ్డి మారాలని.. లేదంటే మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.  

భాజపాతో పరాచికాలొద్దు... కొవిడ్‌ లేకుండా ఉంటే వేలాదిగా కార్యకర్తలు హాజరై దురాగతాలను ఎండగట్టేవారని అరుణ్‌సింగ్‌ అన్నారు. మోదీ ప్రభుత్వం పేదలకు అందిస్తున్న బియ్యం, పింఛన్లు, ఇళ్లు వంటి పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్లు వేసుకుంటోందన్నారు. రాష్ట్రంలో అప్పుల పాలన జరుగుతోందని.. ఉద్యోగులకు ఒకటో తేదీకి జీతాలొచ్చే పరిస్థితి లేదని, పింఛనుదారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. విచిత్రంగా పీఆర్సీని తగ్గించారని, అధికారమిచ్చిన వారికి న్యాయం చేయాలని డిమాండు చేశారు. జగన్‌కు సద్బుద్ధి రావాలని, బుడ్డ శ్రీకాంత్‌రెడ్డిపై పెట్టిన కేసులు ఉపసంహరించుకొనేలా, వెంటనే విడుదల చేసేలా అవసరమైతే యజ్ఞాలు చేయాలన్నారు.

ఇది మతతత్వ ప్రభుత్వం: సోము వీర్రాజు

రాష్ట్రప్రభుత్వ వ్యతిరేక వైఖరికి నిరసనగా కర్నూలు నుంచి సమర శంఖం పూరిస్తున్నామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. రాష్ట్రప్రభుత్వ మతతత్వ పోకడలకు నిరసనగా ఈ సభలు 175 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎస్డీపీఐకి చెందినవారు ఆత్మకూరులో బుడ్డా శ్రీకాంత్‌రెడ్డిపై హత్యాయత్నం చేశారన్నారు. ఓటుబ్యాంకు వైఖరితో 24 గంటల్లో మసీదును నిర్మించాలని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ప్రయత్నించారన్నారు. జగన్‌ ప్రభుత్వం మతతత్వ ప్రభుత్వమని, బుడ్డా శ్రీకాంత్‌రెడ్డిపై 12 దొంగకేసులు పెట్టి రౌడీషీట్‌ తెరవడం సిగ్గు చేటన్నారు. అక్రమంగా బనాయించిన కేసులు ఉపసంహరించుకోవాలన్నారు.

బెయిలుపై జగన్‌ స్వేచ్ఛగా తిరుగుతున్నారు

బెయిలుపై ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారని, ఆయన కోర్టుకు వెళ్లడం లేదని భాజపా నేత ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు. భాజపా నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి బెయిలు కూడా ఇవ్వకుండా జైళ్లలో పెట్టడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ‘భాజపా అంటే నిప్పు అని... ఫైర్‌తో పెట్టుకోవద్దంటూ జాతీయకార్యదర్శి సునీల్‌ దేవ్‌ధర్‌ ధ్వజమెత్తారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక దేశంలో ఎక్కడాలేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయాలపై దాడులు జరిగాయని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ అన్నారు.

క్యాసినోపై ఎందుకు స్పందించలేదు

మరో ఎంపీ సీఎం రమేష్‌ మాట్లాడుతూ... గుడివాడలో నిర్వహించిన క్యాసినో గురించి పోలీసు వ్యవస్థ స్పందించలేదు. ఈ ప్రభుత్వం పోలీసులను కార్యకర్తల్లా వాడుతోంది. మేం ఆత్మకూరు వెళుతుంటే 144 సెక్షన్‌ అని పోలీసులు అడ్డుకొన్నారని, మరి ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ ఎలా వెళ్లారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు, ఎమ్మెల్సీ మాధవ్‌, రావెల కిషోర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.


క్యాసినోకు అనుమతులు లేకపోతే చర్యలేవి?: లంక దినకర్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలో క్యాసినో నిర్వహణకు అనుమతి లేకపోతే బాధ్యులపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని భాజపా నాయకుడు లంక దినకర్‌ శనివారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు. ‘ఏసిస్‌ సౌజన్యంతో గుడివాడలో క్యాసినో అన్న ఫేస్‌బుక్‌ ట్యాగ్‌ సంగతేంటి? అనుమతులు లేని సినిమాహాళ్లను మూసివేయించిన ప్రభుత్వం, క్యాసినో నిర్వహించిన ప్రదేశాన్ని ఎందుకు సీజ్‌ చేయదు?’ అని ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని