AP Elections 2024: ఏపీ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. రాత్రి 8-9 గంటల మధ్య తుది ఫలితాలు

ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని, జూన్‌ 4న రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు ప్రకటిస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్‌కుమార్‌ మీనా తెలిపారు.

Updated : 30 May 2024 07:48 IST

4న ఓట్ల లెక్కింపునకు  ఏర్పాట్లు పూర్తి 
సీనియర్‌ డిప్యూటీ ఎలక్షన్‌  కమిషనర్‌కు తెలిపిన సీఈఓ 

ఈనాడు డిజిటల్, అమరావతి: ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని, జూన్‌ 4న రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు ప్రకటిస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్‌కుమార్‌ మీనా తెలిపారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 111 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 2 గంటలకు, 61 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు, మిగతా మూడు నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల్లోపు లెక్కింపు ప్రక్రియ పూర్తిచేస్తామని వెల్లడించారు. దిల్లీలోని నిర్వాచన్‌ సదన్‌ నుంచి సీనియర్‌ డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ నితీష్‌వ్యాస్‌ దృశ్యమాధ్యమం ద్వారా రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా సీఈఓ మీనా మాట్లాడుతూ.. ‘సమస్యాత్మక జిల్లాల్లో లెక్కింపు రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144 సెక్షన్‌ను అమలుచేసి, సీనియర్‌ పోలీసు అధికారులను నియమిస్తాం. పోలింగ్‌ అనంతరం హింసాత్మక ఘటనలు జరిగిన జిల్లాల్లో ప్రత్యేకదృష్టి పెడతాం. పల్నాడు జిల్లాలో రాష్ట్ర డీజీపీతో కలిసి పర్యటించి అక్కడి పరిస్థితులను పరిశీలించాం. అధికారులను అప్రమత్తం చేశాం’ అని తెలిపారు.

మొత్తం 175 నియోజకవర్గాలకు...

  • 111 నియోజకవర్గాల్లో 20 రౌండ్లు
  • 61 నియోజకవర్గాల్లో 21 నుంచి 24 రౌండ్లు
  • మిగిలిన 3 నియోజకవర్గాల్లో 25కు పైగా రౌండ్లలో ఓట్ల లెక్కింపు ఉంటుందని మీనా పేర్కొన్నారు. 

సీపీ, ఎస్పీలను అప్రమత్తం చేశాం 

లాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు కమిషనర్లు, జిల్లా ఎస్పీలను అప్రమత్తం చేశామని రాష్ట్ర పోలీసు నోడల్‌ అధికారి శంఖబ్రత బాగ్చి పేర్కొన్నారు. నితీష్‌వ్యాస్‌ మాట్లడుతూ.. లెక్కింపు రోజు ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా చూడాలన్నారు. ఓట్ల లెక్కింపు పూర్తికాగానే ఫలితాల ప్రకటనకు సంబంధించిన ఫాం-21సి, ఫాం-21ఇలను అదే రోజు కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీకి) పంపాలని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని