Andra pradesh Debt: రెండు నెలల్లో రూ.21వేల కోట్ల అప్పు

కొత్త ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రభుత్వం కనీవినీ ఎరగని రీతిలో అప్పులు చేస్తోంది. గత ఆర్థిక సంవత్సరం బకాయిలనూ కొత్త ఏడాది చెల్లించేలా ఆర్థికశాఖ అధికారులు ప్రణాళిక రచించడంతో తొలి రెండు నెలల్లోనే విచ్చలవిడి అప్పులకు పచ్చజెండా ఊపేశారు.

Updated : 26 May 2024 07:30 IST

బహిరంగ మార్కెట్‌ నుంచి తెచ్చిన ప్రభుత్వం
ఇలా అయితే ఏడాదికి రూ.లక్ష కోట్లు దాటిపోయినట్లే
ఈనాడు - అమరావతి

కొత్త ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రభుత్వం కనీవినీ ఎరగని రీతిలో అప్పులు చేస్తోంది. గత ఆర్థిక సంవత్సరం బకాయిలనూ కొత్త ఏడాది చెల్లించేలా ఆర్థికశాఖ అధికారులు ప్రణాళిక రచించడంతో తొలి రెండు నెలల్లోనే విచ్చలవిడి అప్పులకు పచ్చజెండా ఊపేశారు. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లోనే బహిరంగ మార్కెట్‌ రుణం మొత్తం రూ.21వేల కోట్లకు చేరిపోయింది. ఈ స్థాయిలో రిజర్వుబ్యాంకు నుంచి రుణాలు తీసుకోవడం చర్చనీయాంశమవుతోంది. గతంలో సగటున నెలకు రూ.5,000 కోట్లకు మించి రుణాలు తీసుకున్న సందర్భాలు ఉండేవి కావు. జగన్‌ సర్కార్‌లో నెలకు అవి రూ.7,000 కోట్లకు చేరి రికార్డు సృష్టించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా నెలకు రూ.10వేల కోట్ల రుణాలు సమీకరించడం గమనార్హం. ఏప్రిల్‌లో రూ.10వేల కోట్లే రికార్డు అనుకుంటే మే నెలలో దాన్ని రూ.11వేల కోట్లకు చేర్చారు. ఇలా అయితే ఏడాది మొత్తానికి ఒక్క బహిరంగ మార్కెట్‌ రుణమే రూ.లక్ష కోట్లకు మించిపోనుంది.

మార్చి నెలాఖరులో రాష్ట్ర ప్రభుత్వం రిజర్వు బ్యాంకుకు ఇండికేటివ్‌ క్యాలెండర్‌ పంపింది. తొలి మూడు నెలల్లో ఏ వారం ఎంత రుణం తీసుకోనున్నారో తెలియజేసింది. ఏప్రిల్‌లో రూ.13వేల కోట్లు, మే నెలలో రూ.5,000 కోట్లు రుణం తీసుకుంటామని రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనలే విస్మయం కలిగించాయి. కానీ వాస్తవానికి రూ.21వేల కోట్ల మేర అప్పులు పుట్టిస్తున్నారు. ఈ నెలలో చివరి మంగళవారం మే 28న మరో రూ.2వేల కోట్ల రుణం కావాలని ఆర్‌బీఐకి ప్రభుత్వం వర్తమానం పంపింది. అదీ కలిపితే ఈ ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో అప్పు రూ.21 వేల కోట్లకు చేరిపోతుంది.

ఆరు నెలలకు రూ.47 వేల కోట్లకే అనుమతి

కేంద్రం ప్రతి ఆర్థిక సంవత్సరంలోనూ తొలి తొమ్మిది నెలలకు రుణపరిమితి నిర్ణయిస్తుంది. ఈసారి తొలి ఆరు నెలలకే అనుమతులు ఇచ్చింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి అంచనాల ఆధారంగా ఈ అప్పుల మొత్తం తేలుస్తారు. స్థూల ఉత్పత్తి మొత్తాన్ని పెంచి చూపి, అదనపు అప్పులకు అనుమతులు సంపాదిస్తున్న ఉదంతాలూ ఉన్నాయి. కిందటి ఆర్థిక సంవత్సరం చెల్లింపులను చాలావరకు జగన్‌ ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచేసింది. కొత్త ఏడాది అప్పులతో వాటిని చెల్లించవచ్చనే ప్రణాళికే ఇందులో భాగం. వివిధ డీబీటీ పథకాలకు రూ.14వేల కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇవ్వాలనే ప్రణాళిక రూపొందించినట్లు ప్రభుత్వమే అంగీకరించింది. కేంద్రం ఆరు నెలల్లో రూ.47 వేల కోట్ల రుణ అనుమతులు ఇచ్చింది. ఆ లెక్కన నెలకు సగటున రూ.8వేల కోట్ల వరకు రుణం తీసుకునే అవకాశం ఉంది. అంతకుమించి పోయి మరీ అప్పులు తెస్తుండటం గమనార్హం.


పన్నుల రాబడిని మించి అప్పులా?

2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి సొంత పన్నుల రూపంలో వచ్చిన రాబడి రూ.1.30 లక్షల కోట్ల వరకు ఉంది. అంటే సగటున నెలకు రూ.10,800 కోట్లు. పన్నుల రాబడికి మించిపోయి మరీ అప్పులు తెస్తే వాటిని తీర్చే నాథుడు ఎవరు?

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని