Digital transactions: ఏపీ మద్యం దుకాణాల్లో డిజిటల్‌ లావాదేవీలు

ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఐదేళ్లుగా నగదునే తీసుకుంటూ డిజిటల్‌ చెల్లింపులకు ఆస్కారమే లేకుండా చేసేసిన వైకాపా ప్రభుత్వం.. ఎన్నికల తర్వాత ఇప్పుడు డిజిటల్‌ పద్ధతుల్లో స్వీకరించాలని లక్ష్యాల్ని విధించి మరీ విక్రయాలు చేయిస్తోంది.

Updated : 28 May 2024 07:37 IST

నగదు తీసుకోవద్దని తాజాగా ఆదేశాలు  
డిజిటల్‌ పద్ధతుల్లో స్వీకరణకు లక్ష్యాలు 

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఐదేళ్లుగా నగదునే తీసుకుంటూ డిజిటల్‌ చెల్లింపులకు ఆస్కారమే లేకుండా చేసేసిన వైకాపా ప్రభుత్వం.. ఎన్నికల తర్వాత ఇప్పుడు డిజిటల్‌ పద్ధతుల్లో స్వీకరించాలని లక్ష్యాల్ని విధించి మరీ విక్రయాలు చేయిస్తోంది. కొన్ని జిల్లాల్లోని దుకాణాల్లో ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ చేపట్టే మద్యం విక్రయాలకు డిజిటల్‌ చెల్లింపులనే తీసుకోవాలని మౌఖికంగా ఆదేశాలిచ్చింది. మరికొన్ని జిల్లాల్లో 70-80 శాతం లావాదేవీలకు డిజిటల్‌ చెల్లింపులే స్వీకరించాలని, సాధ్యమైనంత వరకూ నగదు తీసుకోవద్దని ఆదేశించింది. ఏపీఎస్‌బీసీఎల్‌ ఎండీగా పనిచేసిన వైకాపా వీర విధేయ అధికారి వాసుదేవరెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసి, ఆ స్థానంలో కొన్నిరోజుల కిందట టీఎస్‌ చేతన్‌ను నియమించింది. ఆయన బాధ్యతలు చేపట్టాక సేల్స్‌మెన్, సూపర్‌వైజర్లకు లక్ష్యాలు విధించి మరీ డిజిటల్‌ లావాదేవీలు చేయాలని చెబుతున్నారు. 

వినియోగదారులపై ఒత్తిడి

ఫోన్‌పే, గూగుల్‌ పే, పేటీఎం లేదా కార్డు స్వైపింగ్‌ వంటి ఏదో ఒక డిజిటల్‌ పద్ధతిలో చెల్లింపులు చేయాల్సిందేనంటూ రెండు రోజులుగా వినియోగదారులపై సేల్స్‌మెన్‌ ఒత్తిడి తీసుకొస్తున్నారు. నగదు రూపంలో చెల్లింపులు వద్దని చెబుతున్నారు. దీంతో దుకాణాల వద్ద వినియోగదారులతో ఘర్షణలు, వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. డిజిటల్‌ పద్ధతుల్లో చెల్లింపులు స్వీకరించాలని లక్ష్యాలు విధిస్తున్న ఏపీఎస్‌బీసీఎల్‌... ఆ రూపంలో చెల్లించే వినియోగదారులపై అదనపు భారం వేస్తోంది. ఒక సీసా కొంటే చాలు దాని ఎమ్మార్పీపై అదనంగా రూ. 1.18 వసూలు చేస్తోంది. మద్యం సీసాను స్కాన్‌ చేసి డిజిటల్‌ చెల్లింపుల ఆప్షన్‌ ఎంపిక చేస్తే చాలు... దానిపై అదనపు ధర పడిపోతోంది. ఈ భారం ఏపీఎస్‌బీసీఎల్‌ మోయకుండా వినియోగదారులపైనే వేస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని