Jawahar Reddy: ఏం చెప్పినా.. తందానతాన!

కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర కీలక స్థానాల్లో అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవారిని ఏరికోరి నియమించిందీ ఆయనే..! కొన్ని జిల్లాల్లో వివాదాస్పద అధికారులున్నారని, వారు ఎన్నికల వేళ అధికార పార్టీతో అంటకాగుతున్నారన్న విపక్షాల ఫిర్యాదుల్ని పట్టించుకోకుండా చోద్యం చూసిందీ ఆయనే..! తీరా ఎన్నికల సంఘం కన్నెర్ర చేస్తే..

Updated : 19 May 2024 06:43 IST

ఆయన పైనే ఆరోపణలు.. ఆయన్నుంచే కీలక నివేదికలు
సూచించిన వారికి పోస్టింగ్‌లు.. చెప్పిన వారిపై సస్పెన్షన్లు
పూర్తిగా సీఎస్‌పైనే ఆధారపడుతున్న ఎన్నికల సంఘం
ఈనాడు - అమరావతి

కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర కీలక స్థానాల్లో అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవారిని ఏరికోరి నియమించిందీ ఆయనే..! కొన్ని జిల్లాల్లో వివాదాస్పద అధికారులున్నారని, వారు ఎన్నికల వేళ అధికార పార్టీతో అంటకాగుతున్నారన్న విపక్షాల ఫిర్యాదుల్ని పట్టించుకోకుండా చోద్యం చూసిందీ ఆయనే..! తీరా ఎన్నికల సంఘం కన్నెర్ర చేస్తే.. ఫలానా అధికారులు తప్పు చేశారని నివేదిక పంపిందీ ఆయనే..! వారి స్థానంలో ఎవర్ని నియమించాలో సూచించిందీ ఆయనే..! పోలింగ్‌ సందర్భంగా హింసాకాండ చెలరేగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోనిదీ ఆయనే..! తీరా హింసాత్మక ఘటనలు జరిగాక.. దానికి ముగ్గురు ఎస్పీల్ని, ఒక కలెక్టర్‌ను బాధ్యుల్ని చేస్తూ.. వారిపై చర్యలకు సిఫారసు చేసిందీ ఆయనే..! అసలు రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక అన్ని వివాదాలకూ కేంద్ర బిందువుగా నిలిచిందీ ఆయనే..! ఇంతకీ ఆ అధికారి ఎవరనుకుంటున్నారా..? ఇంకెవరు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డే!

సీఎస్‌ తీరు అలా ఉంటే.. కేంద్ర ఎన్నికల సంఘం వైఖరి ఇంకా విచిత్రంగా ఉంది. అధికార పార్టీకి సీఎస్‌ కొమ్ము కాస్తున్నారని.. ఎన్నికల్లో ఆ పార్టీకి మేలు చేసేలా అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఆయన్ను మార్చాలని విపక్షాలు నెత్తీనోరూ కొట్టుకున్నా, అనేక ఫిర్యాదులు చేసినా ఈసీ పట్టించుకోలేదు. సీఎస్‌ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాల వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నా, అవి అధికార పార్టీకి రాజకీయ ప్రయోజనం చేకూర్చేలా ఉంటున్నా.. ఈసీ చూసీచూడనట్టే ఉంది. ఇలా ప్రతి విషయానికీ సీఎస్‌పైనే ఈసీ ఆధారపడటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీంతో ఈసీ పరిధిలో సీఎస్‌ పని చేస్తున్నారా? సీఎస్‌ నియంత్రణలో ఈసీ పని చేస్తోందా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చాక.. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఎన్నికల సంఘం నియంత్రణలోకి వెళుతుంది. సీఎస్‌ సహా ఏ ప్రభుత్వ అధికారైనా.. ఏకపక్షంగా, ఒక పార్టీకి కొమ్ము కాసేలా వ్యవహరించినా, వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నా.. ఈసీ తక్షణం చర్యలు తీసుకోవాలి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో దానికి పూర్తి విరుద్ధంగా జరుగుతోందన్న అభిప్రాయం ఉంది. 

వివాదాస్పద అధికారిపై ఎలా ఆధారపడతారు?

సీఎస్‌పై ఎన్ని విమర్శలు వచ్చినా ఈసీ పూర్తిగా ఆయనపైనే ఆధారపడింది. వృద్ధుల్ని మండుటెండల్లో గ్రామ/వార్డు సచివాలయాలకు వెళ్లి పింఛన్లు తీసుకోవాలని వెలువరించిన నిర్ణయంతో 32 మంది బలైపోయినా సీఎస్‌పై చర్యల్లేవు. లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా మే నెల పింఛన్లు పంపిణీ చేయాలని ఈసీ ఒక సూచన చేసిందే తప్ప, ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేయాలని నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేయలేదు. వివాదాస్పద అధికారులపై చర్యలకు ఉపక్రమించిన సందర్భంలో.. రోజువారీ పాలనా వ్యవహారాల్లో ఎన్నికల కోడ్‌కి అనుగుణంగా ఇవ్వాల్సిన అనుమతులకు సంబంధించి సీఎస్‌ పంపిన నివేదికపైనే పూర్తిగా ఆధారపడింది. సీఎస్‌పై అన్ని ఆరోపణలు వస్తున్నప్పుడు.. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న సిఫారసులు హేతుబద్ధంగా ఉంటున్నాయా.. ఒక పార్టీకి మేలు చేసేలా ఉంటున్నాయా.. స్క్రీనింగ్‌ కమిటీల ఆమోదంతో ఈసీ అనుమతి కోసం పంపిస్తున్న అంశాల్లో మతలబు ఉందన్న విషయాల్ని ఈసీ తరచి చూడలేదన్న విమర్శలున్నాయి. సీఎస్‌పైనే అన్ని ఆరోపణలున్నప్పుడు.. వివాదాస్పద అధికారులుగా ముద్రపడటంతో తొలగించిన కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారుల స్థానంలో ఎవర్ని నియమించాలన్న దానిపై ఆయన్నుంచే నివేదిక రప్పించుకోవడమేంటి? ఆయన పంపిన జాబితాలోని అధికారుల్నే నియమించడమేంటి? పోలింగ్‌ సందర్భంగా చెలరేగిన హింసాకాండపై నివేదిక పంపాలని సీఎస్‌నే అడగడమేంటి? ఇద్దరు ఎస్పీల్ని సస్పెండ్‌ చేయాలని, ఒక కలెక్టర్, మరో ఎస్పీని బదిలీ చేయాలని సీఎస్‌ ఇచ్చిన నివేదికపై ఆధారపడి ఈసీ చర్యలు తీసుకోవడమేంటి? పెద్దఎత్తున హింసాకాండ చెలరేగినా సీఎస్‌ను బాధ్యుడిని చేయకపోవడమేంటి? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


అధికార పార్టీకి వీర విధేయత

రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి సారథిగా నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన జవహర్‌రెడ్డి.. వైకాపాకు వీర విధేయత ప్రదర్శిస్తూ, ఎన్నికల్లో ఆ పార్టీని గెలిపించడమే లక్ష్యంగా అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారన్న అప్రదిష్ట మూటగట్టుకున్నారు. ఎన్నికల వేళ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పర్యవేక్షించాల్సిన సీఎస్‌ ఆ బాధ్యతను విస్మరించి.. కొన్నిచోట్ల తీవ్ర హింసాకాండ చెలరేగేసరికి.. తనకేమీ సంబంధం లేదన్నట్టు ఆ నెపాన్ని అక్కడి ఎస్పీలు, కలెక్టర్‌పై నెట్టేసి వారిని బలి తీసుకున్నారన్న విమర్శలు వచ్చాయి. సీఎస్‌పై విపక్షాలు ఈసీకి అనేక ఫిర్యాదులు చేశాయి. సీఎం జగన్‌కు జవహర్‌రెడ్డి నమ్మిన బంటని, ఆయన సీఎస్‌గా ఉంటే ఎన్నికలు నిష్పాక్షికంగా జరగవని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సహా అనేకమంది ఈసీకి ఫిర్యాదు చేశారు. కానీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. 


 అన్నీ వివాదాస్పద నిర్ణయాలే..!

  • వివాదాస్పద అధికారులుగా పేరుపొందిన మూడు జిల్లాల కలెక్టర్లు, ఆరు జిల్లాల ఎస్పీల్ని ఏప్రిల్‌ మొదటి వారంలో ఈసీ బదిలీ చేసింది. వారి స్థానంలో నియమించేందుకు సీఎస్‌ కొందరు అధికారుల జాబితాలను ఈసీకి పంపించారు. వారిలో మళ్లీ కొందరు వివాదాస్పద అధికారులే ఉండడం గమనార్హం. 
  • వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాల పంపిణీ చేయవద్దని ఈసీ ఆదేశిస్తే.. ఏప్రిల్‌లో ఇంటింటికీ పింఛను పంపిణీని నిలిపేసి, అందరూ గ్రామ/వార్డు సచివాలయాలకు వచ్చి పింఛన్లు తీసుకోవాలని చెప్పారు. ఆ నెపాన్ని తెదేపాపై నెట్టేసి... వైకాపాకి రాజకీయ లబ్ధి చేకూర్చడం కోసమే సీఎస్‌ ఆ నిర్ణయం తీసుకున్నారన్న విమర్శలున్నాయి. మే నెల వచ్చేసరికి.. ఏకంగా బ్యాంకులకు వెళ్లి డబ్బులు తెచ్చుకోమని ఆదేశించారు. దీంతో వృద్ధులు అనేక అవస్ధలు పడ్డారు. 
  • రైతులతో పాటు వివిధ పథకాల లబ్ధిదారులకు చెల్లింపులు చేయకుండా.. ఫిబ్రవరి, మార్చి నెలల్లో తమకు కావాల్సిన గుత్తేదారులకు దాదాపు రూ.13 వేల కోట్ల మేర బిల్లులు చెల్లించడంలో సీఎస్‌ కీలక పాత్ర నిర్వహించారని, ముందు వచ్చినవారికి ముందు చెల్లింపు (ఫిఫో) విధానాన్ని పక్కన పెట్టారన్న విమర్శలున్నాయి.  
  • జనవరి నుంచి మే మొదటి వారం వరకు సంక్షేమ పథకాల సొమ్ములను లబ్ధిదారులకు చెల్లించకుండా ఆపి, సరిగ్గా పోలింగ్‌ తేదీకి నాలుగైదు రోజుల ముందు రూ.14,165 కోట్ల నిధుల్ని వారి ఖాతాల్లో వేసి, అధికార పార్టీకి అనుకూలంగా వారిని ప్రభావితం చేసేందుకు వ్యూహం పన్నారు. దిల్లీ నుంచి ఈసీ అధికారులు తీవ్రస్థాయిలో తలంటడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. తీరా పోలింగ్‌ ప్రక్రియ ముగిశాక ఆ మొత్తం నిధుల్ని లబ్ధిదారుల ఖాతాల్లో వేశారా? అంటే అదీ లేదు. ఇప్పుడు ఆ నిధుల్ని లబ్ధిదారుల ఖాతాల్లో విడతలుగా వేస్తూ, మిగతా నిధుల్ని అస్మదీయ గుత్తేదారులకు సర్దుబాటు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
  • డీజీ ర్యాంక్‌ కలిగిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్‌ చెల్లదని, ఆయనను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (క్యాట్‌) పది రోజుల క్రితం ఆదేశించినా... సీఎస్‌ ఆయనకు పోస్టింగ్‌ ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని