Andhra News: ఇంటి ముంగిటకే.. చేపలు, రొయ్యలు

రేషన్‌ బియ్యమే కాదు.. చేపలు, రొయ్యలు, పీతలు, వాటి ఆధారిత ఉత్పత్తులు కూడా త్వరలో ఇళ్ల ముంగిటకే రానున్నాయి. మత్స్య ఉత్పత్తుల వినియోగాన్ని రాష్ట్రంలో పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం....

Updated : 20 Feb 2022 08:02 IST

త్వరలో రోడ్డెక్కనున్న‘ఫిష్‌ ఆంధ్ర’ వాహనాలు
వినియోగం పెంచేందుకు ప్రభుత్వం చర్యలు

రేషన్‌ బియ్యమే కాదు.. చేపలు, రొయ్యలు, పీతలు, వాటి ఆధారిత ఉత్పత్తులు కూడా త్వరలో ఇళ్ల ముంగిటకే రానున్నాయి. మత్స్య ఉత్పత్తుల వినియోగాన్ని రాష్ట్రంలో పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ‘ఫిష్‌ ఆంధ్ర’ పేరుతో హబ్‌లు, రిటైల్‌ ఔట్‌లెట్లు, ప్రత్యేక వాహనాలను అందుబాటులోకి తెస్తోంది. వీటికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. త్వరలోనే చేపలు, పీతలు, రొయ్యల వాహనాలు రోడ్డెక్కనున్నాయి. చేపలు, రొయ్యల సాగు, ఉత్పత్తి ఆంధ్రప్రదేశ్‌లోనే అధికం. చేపలను ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. అయితే అక్కడ కూడా సాగు పెరుగుతోంది. రొయ్యల ఎగుమతి విదేశాలకు అధికంగా ఉంటుంది. కానీ ధరలు పడిపోయినప్పుడు రైతులు నష్టపోతున్నారు. ఈ పరిస్థితుల్ని అధిగమించేందుకు రాష్ట్రంలోనే వినియోగం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. వినియోగదారుల ఇంటి వద్దకే తీసుకెళ్లి అందించే విధంగా మత్స్యశాఖ ఆధ్వర్యంలో ‘ఫిష్‌ ఆంధ్ర’ బ్రాండ్‌ పేరుతో ప్రాజెక్టు అమలు చేస్తున్నారు.

* తాజా చేపలు, రొయ్యలనే కాకుండా.. ఎండు, వండడానికి సిద్ధంగా ఉండే చేపలు, రొయ్యలు(ప్రాసెస్‌ చేసిన), మసాలా పట్టించిన ఉత్పత్తులు, వండిన, ఫ్రై చేసిన వంటకాలు, పచ్చళ్లు తదితరాలను రిటైల్‌ ఔట్‌లెట్ల ద్వారా విక్రయించనున్నారు.  
* రాష్ట్రవ్యాప్తంగా 70 హబ్‌ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించింది. ఒక్కో హబ్‌కు అనుబంధంగా మత్స్య ఉత్పత్తులకు అదనపు విలువ జోడించే యూనిట్లతో పాటు 14వేల వరకు రిటైల్‌ అవుట్‌లెట్లు, రిటైల్‌ వెండింగ్‌ ఫుడ్‌కోర్ట్‌, మొబైల్‌ యూనిట్లు ఉంటాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 56 హబ్‌లు సిద్ధం చేశారు. వీటి పరిధిలో దుకాణాలను కూడా అందుబాటులోకి తెస్తున్నారు. ఈ కామర్స్‌ యాప్‌ ద్వారా కూడా వీటిని అందించనున్నారు.
* మొబైల్‌ వాహనాల ద్వారా లైవ్‌ ఫిష్‌, ఇతర ఉత్పత్తులను విక్రయించనున్నారు. లబ్ధిదారుల ఎంపిక ఇప్పటికే పూర్తయింది. వాహనాలు కూడా సిద్ధం చేశారు. త్వరలో వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు మత్స్యశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఒక్కో జిల్లాకు కనీసం 10 నుంచి 15 వాహనాల వరకు అందిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని