మద్దతు ధరపై భరోసా ఇస్తేనే ఆక్వా సాగు

రొయ్యలు, మత్స్య ఉత్పత్తులకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి, అదే ధరకు కొనుగోలు చేసేలా పర్యవేక్షించాలని ఆక్వా రైతులు డిమాండు చేశారు.

Published : 02 Dec 2022 04:35 IST

లేదంటే పంట విరామమేనని రైతుల స్పష్టీకరణ
యూనిట్‌ విద్యుత్తు రూ.1.50కే ఇవ్వాలని డిమాండు

ఉండి, న్యూస్‌టుడే: రొయ్యలు, మత్స్య ఉత్పత్తులకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి, అదే ధరకు కొనుగోలు చేసేలా పర్యవేక్షించాలని ఆక్వా రైతులు డిమాండు చేశారు. ఈ విషయంలో స్పష్టత ఇస్తేనే చెరువుల్లో సీడ్‌ వేస్తామని, లేదంటే పంట విరామం ప్రకటిస్తామని హెచ్చరించారు. ‘జోన్లతో సంబంధం లేకుండా ఆక్వా రైతులందరికీ యూనిట్‌ విద్యుత్తును రూ.1.50 చొప్పున ఇవ్వాలి. ప్రతి 15 రోజులకోసారి రొయ్యలకు ధర ప్రకటించాలి. నాణ్యమైన ఫీడ్‌, సీడ్‌ సరఫరా చేయాలి. మేత ధరలు తగ్గించాలి’ అని కోరారు. పశ్చిమగోదావరి జిల్లా రొయ్య రైతుల వెల్ఫేర్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో గురువారం ఉండిలో ‘రొయ్యల సాగు కొనసాగింపు’పై నిర్వహించిన సదస్సుకు ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం, కోనసీమ జిల్లాలకు చెందిన రైతులు, సీడ్‌, ఫీడ్‌ ఉత్పత్తిదారులు, కొనుగోలుదారులు, ప్రభుత్వ ప్రతినిధులు హాజరయ్యారు. రైతులు తమ సమస్యలు ఏకరవు పెడుతూ ‘ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కంటే కిలోకి రూ.40-50 తగ్గించి అమ్ముకుంటున్నాం. మద్దతు ధరపై భరోసా ఇస్తేనే ముందుకెళ్తాం. లేదంటే పంట విరామం దిశగా నిర్ణయం తీసుకుంటామ’ని ప్రకటించారు.

తక్కువ ధరకు కొనేవారిపై చర్యలు

ఆక్వా ఇబ్బందులపై ముఖ్యమంత్రి దృష్టి సారించారని అప్సడా రాష్ట్ర వైస్‌ ఛైర్మన్‌ వడ్డే రఘురాం తెలిపారు. హైపవర్‌ కమిటీ, ఎగుమతిదారులు, ఆక్వా రైతు ప్రతినిధుల బృందం నిర్ణయించినట్లుగా రొయ్యలు కొనుగోలు చేయాల్సిందేనని చెప్పారు. వ్యాపారులు అప్సడా అనుమతులు తీసుకోవాలన్నారు. ‘ఈక్వెడార్‌ను సాకుగా చూపి మద్దతు కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయడం దారుణం. కొందరి ప్రోద్బలంతో తక్కువ ధరకు కొంటున్నవారి చిట్టా మా దగ్గర ఉంది. వారిపై చర్యలు తప్పవు. ఎవరి వద్ద ఎన్ని టన్నుల రొయ్యలున్నాయనే విజిలెన్స్‌ నివేదికలు సిద్ధంగా ఉన్నాయి’ అని హెచ్చరించారు. ప్రభుత్వ ప్రతినిధులు, ప్రాసెసింగ్‌ ప్లాంట్ల యజమానులు, రైతు సంఘాల ప్రతినిధుల బృందాన్ని 10-15 రోజుల్లో దిల్లీకి పంపించాలని సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారని రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్‌రావు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని