జీ హుజూర్‌ అంటూ ఆర్టీసీ పరుగులు

ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాల్సిన ఏపీఎస్‌ఆర్టీసీ.. అధికార వైకాపా సేవలో తరిస్తోంది. ఆ పార్టీ అడిగిందే తడవుగా వందల బస్సులను కేటాయించి ప్రయాణికులను రోడ్డుపాలు చేసింది.

Updated : 07 Dec 2022 05:32 IST

వైకాపా అడగ్గానే బీసీ సభకు 1,630 బస్సుల కేటాయింపు
సర్వీసుల రద్దుతో ప్రయాణికుల అవస్థలు

ఈనాడు, అమరావతి: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాల్సిన ఏపీఎస్‌ఆర్టీసీ.. అధికార వైకాపా సేవలో తరిస్తోంది. ఆ పార్టీ అడిగిందే తడవుగా వందల బస్సులను కేటాయించి ప్రయాణికులను రోడ్డుపాలు చేసింది. మిగిలిన బస్సులతోనే మీ పాట్లు మీరు పడండి అనేలా వదిలేసింది. పోనీ బస్సులు తగినంత ఉండవని ముందుగా చెప్పే ప్రయత్నమూ చేయలేదు. అసలే సంస్థలో ప్రస్తుతం అత్యధికంగా డొక్కు బస్సులుంటే, కొన్నింటి కండిషనే బాగుంది. ఇలా బాగున్న బస్సులన్నీ సదస్సులకు పంపేసి.. కాలం చెల్లిన డొక్కు బస్సులను ప్రయాణికులకు వదిలేశారు. జులైలో జరిగిన వైకాపా ప్లీనరీకి 2,200 బస్సులు పంపించి తమ స్వామి భక్తిని చాటుకున్న ఆర్టీసీ యాజమాన్యం.. తాజాగా విజయవాడలో బుధవారం నాటి జయహో బీసీ సభకు 1,630 బస్సులు పంపించి విధేయతను చూపించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పూర్తిస్థాయిలో బస్సులు లేక ప్రయాణికులు మంగళవారం నుంచి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
మూడు రోజులు పార్టీ సేవలో.. ఉత్తరాంధ్ర జిల్లాలన్నీ కలిపి 500, రాయలసీమలో 400-500 బస్సులు మంగళవారం నుంచి మూడు రోజులపాటు అందుబాటులో ఉండట్లేదు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల నుంచి వెళ్లిన బస్సులు గురువారం వరకు అందుబాటులోకి రావు.

15 శాతం బస్సులు బీసీల సభకే: ఆర్టీసీలో 11,214 బస్సులు ఉండగా.. వీటిలో నిత్యం 10,374 బస్సులు వివిధ మార్గాల్లో తిరుగుతుంటాయి. ఇందులో 1,630 బస్సులను వైకాపా బీసీ సభకు పంపడంతో.. నిత్యం తిరిగే బస్సుల్లో 15% అటే వెళ్లిపోయినట్లు అయింది. వెళ్లినవాటిలో ఎక్కువగా ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌, సూపర్‌లగ్జరీ సర్వీసులు ఉన్నాయి. ఇవన్నీ బీసీ సభకు వెళ్లడంతో మూడు రోజులపాటు ఆయా ట్రిప్పులు అన్నీ రద్దయినట్లే అయింది.

మీడియా పరిశీలిస్తుంది జాగ్రత్త: వైకాపా బీసీ సభకు బస్సులు పంపుతున్న నేపథ్యంలో ఏయే జాగ్రత్తలు తీసుకోవాలంటూ పేర్కొంటూ అన్ని జిల్లాల ఆర్టీసీ అధికారులకు.. చీఫ్‌ మెకానికల్‌ ఇంజినీర్‌ ఓ సర్క్యులర్‌ పంపారు. బస్సులన్నీ కండిషన్‌లో ఉండాలని, దారిలో ఆగిపోడానికి వీల్లేదని తెలిపారు. ఒకవేళ ఆగిపోతే అతి తక్కువ సమయంలోనే మరమ్మతులు పూర్తిచేసుకొని వెళ్లాలని తెలిపారు. మీడియా పరిశీలిస్తోందని.. బస్సులు ఆగకుండా చూడాలని పేర్కొన్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే బస్సులు.. మధ్యలో ఏయే డిపోల్లో డీజిల్‌ను నింపించుకోవాలో స్పష్టం చేశారు. ప్రతి జిల్లాలో మెకానిక్‌, అసిస్టెంట్‌ మెకానిక్‌, ఎలక్ట్రీషియన్‌తో కూడిన బృందాలను ఏర్పాటుచేసి టూల్‌కిట్స్‌తో వారిని అందుబాటులో ఉంచాలని, విజయవాడలోని బస్సులు పార్కింగ్‌ చేసే ఒక్కో ప్రాంతంలో ఒక్కో బృందాన్ని అందుబాటులో ఉంచాలని సర్క్యులర్‌లో పేర్కొన్నారు. ఇలా వైకాపా సభకు ఆర్టీసీ తనవంతుగా పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.


పర్యాటక కేంద్రమైన అరకుకి విశాఖపట్నం, ఎస్‌.కోటల నుంచి నిత్యం 30 బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. వీటిలో ఎక్కువగా డీలక్స్‌, ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులే. అయితే మంగళవారం మాత్రం అరకు వచ్చిన బస్సులు నాలుగే! ఈ మార్గంలో తిరగాల్సిన బస్సులను విజయవాడలో బుధవారం వైకాపా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జయహో బీసీ సభ కోసం అధికారులు మళ్లించారు. దీంతో పర్యాటకులు అధిక ధర పెట్టి ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు.

కడప కొత్త బస్టాండు నుంచి తిరుపతికి అరగంటకో బస్సు ఉంటుంది. మంగళవారం గంటకొకటి రావడం కూడా గగనమైంది. ఇదేంటని ప్రయాణికులు బస్టాండులోని కంట్రోలర్‌ను అడిగితే.. విజయవాడకు వెళ్లాయని, రెండు రోజులు ఇలాగే ఉంటుందని బదులిచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని