ఉపాధ్యాయులపై తనిఖీల ఒత్తిడి

ప్రభుత్వ పాఠశాలల తనిఖీలను పాఠశాల విద్యాశాఖ ముమ్మరం చేసింది. ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలను సందర్శిస్తూ అక్కడ గుర్తించిన అంశాలపై జిల్లా విద్యాధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు.

Published : 25 Jan 2023 05:33 IST

పాఠశాలల్లో 27 అంశాలను  పరిశీలించాలంటూ ముఖ్య కార్యదర్శి ఆదేశాలు

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల తనిఖీలను పాఠశాల విద్యాశాఖ ముమ్మరం చేసింది. ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలను సందర్శిస్తూ అక్కడ గుర్తించిన అంశాలపై జిల్లా విద్యాధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. క్షేత్రస్థాయి అధికారులు ప్రతి పాఠశాలను కనీసం ఒక్కసారైన సందర్శించి, కార్యక్రమాలు జరిగే తీరును తనిఖీ పుస్తకంలో నమోదు చేయాలని ఇప్పటికే ఆదేశించారు. తనిఖీలకు వెళ్లే క్రమంలో మొదట మారుమూల బడులకు ఆ తర్వాత మండల కేంద్రాలు, పట్టణాల్లోని పాఠశాలలను సందర్శించాలని ఆయన సూచించారు. దీంతో జిల్లా, డివిజన్‌, మండల విద్యాధికారులు పాఠశాలల తనిఖీలు ముమ్మరం చేశారు. ముఖ్య కార్యదర్శి ఆదేశాల మేరకు 27అంశాలను పరిశీలిస్తున్నారు. మధ్యాహ్న భోజనం నుంచి విద్యార్థులు ఏకరూపదుస్తులు, బూట్లు ధరించడం, ఉపాధ్యాయుల పాఠాల ప్రణాళిక వరకు ఇలా అనేక అంశాలను తనిఖీలు చేయాల్సి ఉంది. తనిఖీల సమయంలో గుర్తించిన అంశాలపై జిల్లా స్థాయిలో నివేదికలు రూపొందిస్తారు.

హడావుడిగా ప్రత్యేక డ్రైవ్‌..

ప్రభుత్వ బడుల్లో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించేందుకు అధికారులు అభ్యసన మెరుగు కార్యక్రమం(లిప్‌)ను తీసుకొచ్చారు. ప్రథమ్‌ సంస్థ ఆధ్వర్యంలో బేస్‌లైన్‌ పరీక్ష నిర్వహించి, విద్యార్థుల సామర్థ్యాలను గుర్తించారు. వీరి కోసం డిసెంబరులో ప్రత్యేక పుస్తకాలను అందించారు. ఆ తర్వాత దీని అమలును మూలకుపడేశారు. ఇటీవల సీఎం జగన్‌ నిర్వహించిన సమీక్షలో లిప్‌ చర్చకు రావడంతో ఇప్పుడు హడావుడి చేస్తున్నారు. ఉపాధ్యాయులను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారు. విజయనగరం, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కడప, అన్నమయ్య, అనంతరం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. వెనుకబడిన విద్యార్థులకు డిసెంబరులో రెండు పరీక్షలు, జనవరిలో ఒక పరీక్ష నిర్వహించాలని ఒక్కో విద్యార్థికి సంబంధించిన ప్రత్యేక కేస్‌స్టడీలను రూపొందించాలని ఇప్పుడు ఆదేశాలు ఇచ్చారు. జనవరి నెలలో 3 నుంచి 10 వరకు సమ్మెటివ్‌ పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత 19 వరకు సెలవులు ఇచ్చారు. పాఠశాలల పునఃప్రారంభమైన నాటి నుంచి సమ్మెటివ్‌ ప్రశ్నపత్రాల మూల్యాంకనం, మార్కుల పోస్టింగ్‌ చేయాలని ఆదేశించారు. మరి విద్యార్థులకు పరీక్ష పెట్టే అవకాశమే లభించలేదు. ఇప్పుడు 25లోపు పరీక్ష పూర్తి చేయాల్సిందేనని హుకుం జారీ చేశారు. మొదట ప్రకటించిన అకడమిక్‌ కేలండర్‌ ప్రకారం డిసెంబరులోనే సమ్మెటివ్‌ పెట్టాలి. కానీ, పరీక్షను వెనక్కి జరిపి, ఇప్పుడు ఉపాధ్యాయులను ఒత్తిడి చేస్తున్నారు. ప్రతి ఉపాధ్యాయుడూ 10మందిని దత్తత చేసుకొని, వారి అభ్యసన స్థాయిలపై ప్రత్యేక కేస్‌స్టడీ నిర్వహించాలని ఆదేశిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తి చేసేదాన్ని బట్టి ఉపాధ్యాయులకు ర్యాంకులు ఇస్తామని పేర్కొంటున్నారు. గుడ్‌, పూర్‌, వెరీ పూర్‌గా ర్యాంకులు ఇచ్చి, వెరీ పూర్‌గా ఉన్నవారిపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో ఈ జిల్లాలోని ఉపాధ్యాయులు ఆందోళనకు గురవుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు