మరిన్ని అప్పుల కోసం అన్వేషణ!

రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని అప్పుల కోసం అన్వేషిస్తోంది. వచ్చే మంగళవారం రిజర్వుబ్యాంకు నిర్వహించే వేలంలో పాల్గొని రూ. 1,557 కోట్ల రుణం తీసుకోనుంది.

Updated : 28 Jan 2023 05:31 IST

రూ. 1,557 కోట్ల కోసం వెతుకులాట
‘అనుమతి మేరకు’ అప్పులు సంపూర్ణం
వచ్చే రెండు నెలలూ ఎలా?  
అనుమతుల కోసం కేంద్రంతో మంతనాలు

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని అప్పుల కోసం అన్వేషిస్తోంది. వచ్చే మంగళవారం రిజర్వుబ్యాంకు నిర్వహించే వేలంలో పాల్గొని రూ. 1,557 కోట్ల రుణం తీసుకోనుంది. రూ.వెయ్యి కోట్లు 13 ఏళ్ల కాలపరిమితితో, మరో రూ. 557 కోట్లు 9 ఏళ్ల కాలపరిమితితో తీర్చేలా తీసుకోబోతోంది. కేంద్రం జనవరి మొదటి వారంలో ఇచ్చిన బహిరంగ మార్కెట్‌ రుణాల మొత్తం అనుమతి దీంతో సంపూర్ణమవుతుంది. 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలల్లో రూ. 4,557 కోట్ల రుణం మాత్రమే తీసుకునేందుకు వెసులుబాటు ఉందని కేంద్ర ఆర్థికశాఖ స్పష్టం చేసింది. ఆ అనుమతి వచ్చిన నాలుగు వారాల్లోనే మొత్తం రూ. 4,557 కోట్ల రుణం రాష్ట్ర ప్రభుత్వం సమీకరించేస్తోంది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం అనుమతి ఇచ్చిన రూ. 49,860 కోట్ల రుణం మొత్తం తీసేసుకున్నట్లవుతుంది. 12 నెలల అప్పు 10 నెలల్లోనే పూర్తి చేసేశారు. ఈ పరిస్థితుల్లో ఫిబ్రవరి, మార్చి నెలల్లో అవసరాలకు రుణాలు ఎలా తీసుకురావాలా అని ఆర్థికశాఖ అధికారులు అన్వేషణ ప్రారంభించినట్లు సమాచారం. ఒకవైపు గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్‌ నుంచి తీసుకున్న రుణంలో కొంతమొత్తం వారికి బాకీ కింద నెలాఖరులోపు చెల్లించాల్సి ఉంది. తాజాగా తెచ్చే రుణం రూ. 1,557 కోట్లు ఫిబ్రవరి ఒకటిన ఖజానాకు చేరే ఆస్కారం ఉంది. మరోవైపు సకాలంలో ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు చెల్లించాలన్నా రుణ సమీకరణ తప్పనిసరి అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి మళ్లీ బహిరంగ మార్కెట్‌ రుణం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలిసింది. కేంద్ర ఆర్థికశాఖ పెద్దలు, దిల్లీ పెద్దలతో సంప్రదింపులు జరిపి రుణాలు తీసుకువచ్చే యత్నాలు సాగిస్తున్నట్లు తెలిసింది. ఇవి కాకుండా ప్రభుత్వ కార్పొరేషన్ల నుంచి కూడా ఇతరత్రా మరిన్ని రుణాల కోసం ప్రయత్నాలు సాగుతున్నట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని