క్రీడా సంఘాల సమావేశంలో బాహాబాహీ

రాష్ట్ర క్రీడా సంఘాల ప్రతినిధులపై శాప్‌ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అసభ్యకర పదజాలంతో విరుచుకుపడ్డారు.

Updated : 24 Mar 2023 05:57 IST

అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి
ఒలింపిక్‌ సంఘం ప్రధాన కార్యదర్శిపై తీవ్ర ఆగ్రహం
మంత్రి రోజా సమక్షంలోనే వివాదం

ఈనాడు, అమరావతి - విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: రాష్ట్ర క్రీడా సంఘాల ప్రతినిధులపై శాప్‌ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అసభ్యకర పదజాలంతో విరుచుకుపడ్డారు. క్రీడా సంఘాల స్థితిగతులను తెలుసుకొని, అవసరమైన సౌకర్యాలను సమకూరుస్తామంటూ ఆహ్వానం పంపించి.. సమావేశంలో తిట్లదండకంతో విరుచుకుపడడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి ఆర్‌.కె.రోజా శాప్‌ అధికారులతో విజయవాడలోని ఇందిరాగాంధీ నగరపాలక సంస్థ స్టేడియంలో గురువారం సమావేశం ఏర్పాటు చేశారు. ప్రిన్సిపల్‌ సెక్రటరీ వాణీమోహన్‌, శాప్‌ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ఎండీ కె.హర్షవర్ధన్‌ హాజరయ్యారు. గుర్తింపుతో సంబంధం లేకుండా అన్ని క్రీడా సంఘాల ప్రతినిధులను ఆహ్వానించారు. సమావేశంలో వారు తమ సమస్యలను తెలియజేశారు. మౌలిక సౌకర్యాల కల్పనకు సూచనలు చేశారు. ఇదే సమయంలో రాష్ట్ర ఒలింపిక్‌ సంఘం(175/1969) ప్రధాన కార్యదర్శి కె.పి.రావు మాట్లాడుతూ.. జీవో నంబరు 74ను సవరించాలని కోరారు. శాప్‌లోని కొంతమంది అధికారుల వల్ల క్రీడాకారులకు నష్టం జరుగుతోందని పేర్కొన్నారు. దీనిపై శాప్‌ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘హూ ఆర్‌ యూ’ అంటూ పెద్దగా అరవడంతో క్రీడా సంఘాల ప్రతినిధులు ఉలిక్కి పడ్డారు. ఛైర్మన్‌ అనుచరగణం కె.పి.రావుపైకి దూసుకొచ్చారు. కె.పి.రావు కూడా ఆగ్రహంతో రౌడీయిజం చేస్తే మేం చూస్తూ ఊరుకోం. రాష్ట్రంలో క్రీడలను అభివృద్ధి చేసి మంచి పేరు తెచ్చుకోవాలి. ప్రశ్నించేవారిపైకి దూసుకు రావడం వల్ల ప్రయోజనం ఉండదు. అభివృద్ధి చేయకపోతే చూస్తూ ఊరుకోం. శాప్‌లో అవినీతి జరుగుతుంది. దాన్ని సరిదిద్దుకోవాలి’ అని సూచించారు. దీంతో మరింత ఆగ్రహానికిలోనైన సిద్ధార్థరెడ్డి అసభ్యకరమైన పదజాలం వాడుతూ కె.పి.రావును తిట్టడంతో అందరూ నిర్ఘాంతపోయారు. సిద్థార్థరెడ్డి అనుచరులు కె.పి.రావుపై దాడి చేసేందుకు రావడంతో ఇతర క్రీడా సంఘాల ప్రతినిధులు అడ్డుకున్నారు.

మంత్రి రోజా స్పందిస్తూ.. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రెండు ఒలింపిక్‌ సంఘాల ప్రతినిధులైన ఆర్‌.కె.పురుషోత్తం, కె.పి.రావు సమావేశ మందిరం నుంచి బయటకు వెళ్లాలని సూచించారు. తాము పిలిచినప్పుడే లోపలికి రావాలని సూచించారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని వారిద్దరినీ బయటకు పంపించేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు శాతం క్రీడా కోటా అమలుకు సన్నద్ధమవుతున్నట్లు తెలిపారు. జీవో నంబరు 74ను సవరించి అన్ని క్రీడలకు శాప్‌ గుర్తింపునిచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

ఉక్రోశం తట్టుకోలేక ఉసికొల్పారు: కె.పి.రావు

‘సీఎం జగన్‌, మంత్రి రోజాలను పొగిడి సిద్ధార్థరెడ్డిని వదిలేశాననే ఉక్రోశంతోనే అనుచరులను నాపైకి ఉసిగొల్పారు. సమావేశంలో జరిగిన సంఘటన రికార్డులను ముఖ్యమంత్రి పరిశీలించాలి. ఇన్నేళ్ల నా క్రీడా జీవితంలో ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు’ అని కె.పి.రావు ఆవేదన వ్యక్తంచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని