ఆకర్షణీయ నగరాల్లో రూ.7,854 కోట్ల విలువైన ప్రాజెక్టులు

ఆకర్షణీయ నగరాల పథకంలో ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి, కాకినాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లో రూ.7,854.30 కోట్ల విలువైన 281 ప్రాజెక్టులు చేపట్టినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్‌ కిషోర్‌ తెలిపారు.

Updated : 28 Mar 2023 05:30 IST

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కౌశల్‌ కిషోర్‌

ఈనాడు, దిల్లీ: ఆకర్షణీయ నగరాల పథకంలో ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి, కాకినాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లో రూ.7,854.30 కోట్ల విలువైన 281 ప్రాజెక్టులు చేపట్టినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్‌ కిషోర్‌ తెలిపారు. భాజపా రాజ్యసభ సభ్యుడు జి.వి.ఎల్‌.నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 281 ప్రాజెక్టుల్లో 90 ప్రాజెక్టుల పనులు పూర్తికాగా 191 ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

కరీంనగర్‌, ఖమ్మం ఏపీ జాబితాలో..

విశ్రాంత సైనికోద్యోగుల ఆరోగ్య పథకం (ఈసీహెచ్‌ఎస్‌) జాబితాలో ఆంధ్రప్రదేశ్‌లో 67 ఆసుపత్రులు ఉన్నాయని రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్‌ భట్‌ తెలిపారు. వైకాపా రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. మంత్రి ఇచ్చిన సమాధానంలో కరీంనగర్‌, ఖమ్మం (ఒక్కో ఆసుపత్రి చొప్పున ఉన్నాయి) జిల్లాలను ఆంధ్రప్రదేశ్‌ జాబితాలో చూపారు.

* విశాఖపట్నం లైట్‌ మెట్రో ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తమకు ఎటువంటి ప్రతిపాదనలు పంపలేదని కేంద్ర పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్‌ కిషోర్‌ తెలిపారు. వైకాపా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వక సమాధానమిచ్చారు.

* ఖాదీ విలేజ్‌ ఇండస్ట్రీస్‌ కమిషన్‌ (కేవీఐసీ), అది ధ్రువీకరించిన సంస్థల్లో విక్రయించే ఖాదీ దుస్తులపై జీఎస్టీని మినహాయిస్తూ జీఎస్టీ మండలి ఆమోదించిందని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి భానుప్రతాప్‌ సింగ్‌ వర్మ తెలిపారు. వైకాపా రాజ్యసభ సభ్యుడు ఆర్‌. కృష్ణయ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

* బేగంపేట విమానాశ్రయంలో 2022లో ఎయిర్‌ నావిగేషన్‌ పరికరాలను మార్చగా, 2021లో కడప విమానాశ్రయంలో కొత్తవి ఏర్పాటు చేసినట్లు పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్‌ తెలిపారు. వైకాపా రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

* మహిళా కొబ్బరిపీచు యోజన కింద ఆంధ్రప్రదేశ్‌లో 2009 నుంచి ఇప్పటి వరకు 5,757 మంది మహిళలకు శిక్షణ ఇప్పించినట్లు కేంద్ర సూక్ష్మ,చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి భానుప్రతాప్‌ సింగ్‌ వర్మ తెలిపారు. వైకాపా రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

*  ఆకాంక్షిత జిల్లాల్లో ఆకాంక్షిత బ్లాక్‌ (మండలం) కింద ఆంధ్రప్రదేశ్‌లో చిప్పగిరి, మద్దికెర, హోళగుంద (కర్నూలు) వై.రామవరం, మారేడుమిల్లి, గంగవరం (అల్లూరి సీతారామరాజు), యర్రగొండపాలెం (ప్రకాశం), ఇబ్రహీంపట్నం, పెనుగంచిప్రోలు (ఎన్టీఆర్‌), కురబలకోట, లక్కిరెడ్డిపల్లె, కోడూరు (అన్నమయ్య), చింతకొమ్మదిన్నె, జమ్మలమడుగు (వైయస్‌ఆర్‌), భామిని (పార్వతీపురం మన్యం)లను ఎంపిక చేసినట్లు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ సహాయ మంత్రి రావ్‌ ఇంద్రజిత్‌ సింగ్‌ తెలిపారు. వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

*  2000 సంవత్సరం నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 576 మంది క్రీడాకారులకు ఉద్యోగాలిచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కరాడ్‌ తెలిపారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లోక్‌సభలో సోమవారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని