అధికార పార్టీకే అడిగినన్ని.. మహానాడుకు మాత్రం తాత్సారం!

రాజమహేంద్రవరంలో తెలుగుదేశం పార్టీ ఈ నెల 27, 28వ తేదీల్లో నిర్వహిస్తున్న ‘మహానాడు’కు ఆర్టీసీ బస్సులను ఇవ్వకుండా ఆ సంస్థ యాజమాన్యం దోబూచులాడుతోంది.

Updated : 26 May 2023 08:06 IST

ఆర్టీసీ తీరుపై సర్వత్రా విమర్శలు
వైకాపా ప్లీనరీకి 1,812 ఆర్టీసీ బస్సులు.. తెదేపా మహానాడుకి ఒక్కటీ ఇవ్వకుండా   దోబూచులాట
విద్యా సంస్థల   బస్సుల వినియోగంపైనా ఆంక్షలు

‘ఏ పార్టీ అయినా, సంస్థ అయినా, వ్యక్తులైనా.. తమ సొంత కార్యక్రమాలు, వేడుకలు, సభలు, సమావేశాలకు ఆర్టీసీ బస్సులు కావాలంటే వాటికి నిర్దేశిత అడ్వాన్స్‌ను ముందే చెల్లించి, బుక్‌చేసుకుని తీసుకోవచ్చు. ఇలా ఎన్ని బస్సులు అయినా సమకూరుస్తాం. దీనివల్ల ఆర్టీసీకి ఆదాయం వస్తుంది. వైకాపా ప్లీనరీకి ఆ పార్టీ అడ్వాన్స్‌ చెల్లించి బస్సులు బుక్‌చేసుకుంది. వాళ్లు కోరిన చోటికి వాటిని పంపాం’..  

గత ఏడాది వైకాపా ప్లీనరీకి 1,812 ఆర్టీసీ బస్సులను పంపడంపై ఆ సంస్థ అధికారులు ఇచ్చిన వివరణ.


* ఇపుడు తెదేపా రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న మహానాడుకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులను తీసుకెళ్లేందుకు వీలుగా ఆర్టీసీ బస్సులు కావాలంటూ ఆ పార్టీ నేతలు వివిధ డిపోల మేనేజర్లను కొద్దిరోజులుగా కోరుతున్నారు. అడ్వాన్స్‌ కింద ఎంత మొత్తం ఇవ్వాలో చెప్పాలని అడుగుతున్నారు. అయినా అధికారులు స్పష్టత ఇవ్వకుండా, ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావాల్సి ఉందని చెబుతూ దాటవేతధోరణి అవలంబిస్తున్నారు.


ఈనాడు, అమరావతి, కాకినాడ:  రాజమహేంద్రవరంలో తెలుగుదేశం పార్టీ ఈ నెల 27, 28వ తేదీల్లో నిర్వహిస్తున్న ‘మహానాడు’కు ఆర్టీసీ బస్సులను ఇవ్వకుండా ఆ సంస్థ యాజమాన్యం దోబూచులాడుతోంది. ప్రతిపక్ష పార్టీ కార్యక్రమానికి ఒక్క బస్సు కూడా బుక్‌ చేసుకోవడానికి వీల్లేకుండా ఉద్దేశపూర్వకంగా తాత్సారం చేస్తోంది. ఆఖర్లో వేసవి రద్దీ, పెళ్లిళ్ల సందడి నేపథ్యంలో బస్సులు సమకూర్చలేమని తెదేపా నేతలకు, ఆర్టీసీ అధికారులు చెప్పాలని భావిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బుధవారం ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావుకు లేఖ రాశారు. అయినాసరే ఆర్టీసీ అధికారుల్లో ఏమాత్రం చలనం లేదని తెలుస్తోంది.

వైకాపా ప్లీనరీకి అడిగిందే తడువుగా..

గతేడాది జులైలో గుంటూరుజిల్లా నాగార్జున విశ్వవిద్యాలయానికి సమీపంలో నిర్వహించిన వైకాపా ప్లీనరీకి.. ఏకంగా 2 వేల బస్సులను బుక్‌చేసుకున్నారు. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు కూడా బస్సులు సిద్ధంచేశారు. ఇందులో 1,812 బస్సులను వైకాపా నేతలు వినియోగించుకున్నారు. ప్రయాణికుల అవస్థలను ఏమాత్రం పట్టించుకోకుండా బస్సులన్నీ ప్లీనరీకి పంపారు. అధికార పార్టీకి ఆర్టీసీ అధికారులు దాసోహం అయ్యారు. ఇపుడు తెదేపా నిర్వహిస్తున్న మహానాడుకు బస్సులు ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. గత ఏడాది ఒంగోలులో నిర్వహించిన మహానాడుకు సైతం ఆర్టీసీ బస్సులను బుక్‌చేసుకోనివ్వలేదు. కొన్ని డిపోల మేనేజర్లు అడ్వాన్స్‌గా డబ్బులు తీసుకొని, బస్సులు పంపేందుకు సిద్ధమైనా, ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలతో అలా కట్టిన సొమ్మును వెనక్కి ఇచ్చేశారు.

సీఎం సభకు దండిగా బస్సులు

రాజధాని ప్రాంతం అమరావతిలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం శుక్రవారం (26న) జరగనుంది. ఈ సందర్భంగా జరిగే సీఎం సభ కోసం వివిధ జిల్లాల నుంచి మొత్తంగా 780 బస్సులను ఆర్టీసీ ఏర్పాటుచేసింది.

* ఈనెల 24న కొవ్వూరులో సీఎం పాల్గొన్న విద్యాదీవెన సభ కోసం.. కాకినాడ, తూర్పుగోదావరి, బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లా ల నుంచి 195 ఆర్టీసీ బస్సులు పంపారు. కానీ రాజమహేంద్రవరంలోని తెదేపా మహానాడుకు మాత్రం ఒక్క ఆర్టీసీ బస్సు కూడా ఇవ్వకుండా అధికారులు ముఖం చాటేస్తున్నారు.

ప్రైవేటు విద్యా సంస్థల బస్సులపైనా ఆంక్షలే

వివిధ ప్రైవేటు విద్యా సంస్థలు, కళాశాలలు, పాఠశాలలకు చెందిన బస్సుల పైనా రవాణాశాఖ అధికారులు ఆంక్షలు పెడుతున్నారు. వేసవి సెలవుల్లో విద్యార్థుల బస్సులను ఎలా బయటకు తీస్తారని, ఫిట్‌నెస్‌ పేరిట వాటికి తనిఖీలు జరిపి, భారీగా జరిమానాలు విధించేలా చూస్తామని హెచ్చరిస్తున్నారు. వైకాపా ప్లీనరీకి, ప్రభుత్వ కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో ప్రైవేటు సంస్థల బస్సులను వినియోగించినప్పుడు లేని నిబంధనలు ఇప్పుడే గుర్తుకురావడంపై విమర్శలు వస్తున్నాయి. మహానాడుకు ఆర్టీసీ బస్సులు అడిగితే ఇవ్వడంలేదని, ప్రైవేటు విద్యాసంస్థల బస్సులను వినియోగిద్దామంటే వారినీ బెదిరిస్తున్నారని తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా అభిమానులు ఆగరని, సొంత ఏర్పాట్లతో తరలి వస్తారని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని