YSRCP: వైకాపా వారి.. రేషన్ మాఫియా
వైకాపా అధికారంలోకి వచ్చాక.. రేషన్ మాఫియా చెలరేగిపోతోంది. నిత్యావసరాల పంపిణీని గాల్లో దీపంలా మార్చేసి, చౌక బియ్యాన్ని పెద్ద ఎత్తున నల్లబజారుకు తరలిస్తున్నారు.
ఎక్కడ పట్టుబడ్డా కేరాఫ్ కాకినాడే
కార్డుదారుకు చేరక ముందే దోపిడీ మొదలు
డీలర్లకు తూకం తగ్గించి సరఫరా
ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ.4 వేల కోట్ల నష్టం
అధికారపార్టీ నేతలు, అనుచరుల దోపిడీ
ఈనాడు - అమరావతి
ఈనాడు, న్యూస్టుడే యంత్రాంగం
వైకాపా అధికారంలోకి వచ్చాక.. రేషన్ మాఫియా చెలరేగిపోతోంది. నిత్యావసరాల పంపిణీని గాల్లో దీపంలా మార్చేసి, చౌక బియ్యాన్ని పెద్ద ఎత్తున నల్లబజారుకు తరలిస్తున్నారు. వైకాపా నేతల భాషలోనే చెప్పాలంటే.. పందికొక్కుల్లా బొక్కేస్తున్నారు. రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో చౌక బియ్యం స్వాధీనం అని వార్తలు వస్తుండటమే దీనికి నిదర్శనం. మిల్లుల్లోనూ వందల టన్నుల్లో రేషను బియ్యం బయటపడుతున్నాయి. రాష్ట్రంలో నెలకు 2.12 లక్షల టన్నుల బియ్యం పంపిణీ చేస్తుంటే అందులో 40% వరకు పక్కదారి పడుతున్నాయంటే దోపిడీ ఎంత భారీ స్థాయిలో సాగుతుందో తెలుస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు సేకరించేది వేర్వేరు ప్రాంతాల్లో అయినా అధిక శాతం అక్రమ రవాణా వాహనాల గమ్యస్థానం మాత్రం కాకినాడలోని కొన్ని మిల్లులే. కొన్ని కృష్ణపట్నం వెళుతున్నాయి. అక్కడ నుంచి నౌకల్లో విదేశాలకు చేరిపోతున్నాయి.
బాస్మతియేతర బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించడంతో.. అక్రమ వ్యాపారుల గొంతులో వెలక్కాయ పడినట్లయింది. అయినా కొనుగోలు మాత్రం ఆపలేదు. క్షేత్రస్థాయిలో బియ్యం సేకరించడం మాత్రం ఆగలేదు. నౌకల ద్వారా ఎగుమతులకు అవకాశం లేకపోవడంతో.. వాటిని మిల్లుల్లో నిల్వ చేస్తున్నారు. మొత్తంగా అధికార పార్టీ నేతల అండతో ఈ అక్రమ రవాణా మూడు వ్యాన్లు.. ఆరు లారీల్లా సాగిపోతోంది. పేదలకు ఉచితంగా ఇస్తున్న బియ్యాన్ని అక్రమంగా కొని తరలించడంతోపాటు.. తూకంలో తరుగు రూపంలో భారీగా గోదాముల నుంచి మాయం చేస్తున్నారు. కొన్నిచోట్ల పేదలకు నెలల తరబడి పంపిణీ కూడా జరగడం లేదు. మొత్తంగా ఏడాదికి రూ.4 వేల కోట్ల విలువైన బియ్యాన్ని వైకాపా నేతలు మింగేస్తున్నారు.
ఇంటింటికీ రేషన్ పేరుతో ఇష్టారాజ్యంగా దోపిడీ
రాష్ట్రంలోని రేషను కార్డుదారులకు గత నాలుగేళ్లుగా ఏ నెలలోనూ బియ్యం సరిగా అందుతాయనే భరోసా దక్కలేదు. కొన్ని గ్రామాలు, పట్టణాల్లో బియ్యం ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు పంపిణీ చేస్తారో తెలియని పరిస్థితి. రేషన్ బండ్ల (ఎండీయూ) ద్వారా పంపిణీ చేస్తారో, డీలర్ల ద్వారా ఇప్పిస్తారో కూడా అంతుపట్టదు. వచ్చినప్పుడు తీసుకోవడమే అన్నట్లుగా తయారైంది. ఎండీయూ ద్వారా బియ్యం వచ్చినా కొన్నిచోట్ల 20 కిలోలకు బదులు.. 10, 15 కిలోలే ఇస్తున్నారు. మిగిలిన బియ్యం లేవంటున్నారు. మొత్తంగా ఇంటింటికీ రేషన్ పంపిణీ పేరుతో అవకతవకలు మరింత పెచ్చుమీరాయి. అక్రమ రవాణా భారీగా పెరిగింది. అయినా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ముచ్చటపడి ప్రారంభించిన ఇంటింటికీ రేషన్ పథకం కావడంతో, అధికారులూ చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. అక్రమాలు బయటపడినా, చర్యలు తీసుకుంటే ప్రభుత్వానికి చెడ్డపేరొస్తుందనే భయంతో మిన్నకుంటున్నారు. అందులోనూ ముఖ్యమంత్రికి సన్నిహితుడైన కాకినాడ జిల్లాకు చెందిన నేత కుటుంబమే చక్రం తిప్పుతుండటంతో ఎక్కడ ఏం జరుగుతున్నా చోద్యం చూస్తున్నారు. ఒకటి రెండుచోట్ల మొక్కుబడి తనిఖీలతో సరిపెట్టేస్తున్నారు. దీంతో అక్రమార్కులు పట్టపగలే కార్డుదారుల నుంచి కిలోల లెక్కన బియ్యం కొనేసి, బాహాటంగానే తరలిస్తున్నారు. చౌకబియ్యం అక్రమాల నిగ్గు తేలుస్తామంటూ పౌరసరఫరాలశాఖ.. రైస్ ఏజ్ టెస్టింగ్ యంత్రాలను ఏర్పాటుచేసినా ప్రయోజనం సున్నా.
- రాష్ట్రంలో జాతీయ ఆహార భద్రతా పథకం, రాష్ట్ర ప్రభుత్వ కార్డుల కింద ఏటా 25 లక్షల టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వాలు ఒక్కో కిలో బియ్యంపై రాయితీగా రూ.39.35 చొప్పున ఖర్చు చేస్తున్నాయి. అయితే ఇందులో 40% బియ్యం నల్లబజారుకు, అక్కడ నుంచి వివిధ రూపాల్లో మార్కెట్కు, విదేశాలకు చేరుతున్నాయి.
రాష్ట్రమంతా అదే తీరు
- విశాఖపట్నం జిల్లాలో ఎండీయూ వాహనాల ద్వారా ఇచ్చే బియ్యంలో కోత పెడుతున్నారు. పెందుర్తి మండలం సుజాతనగర్ సీ-2 జోన్ పార్క్ ఏరియాలోని రేషన్ బండి వద్ద అధిక శాతం కార్డుదారులకు.. ఇవ్వాల్సిన బియ్యం కన్నా తక్కువలో తక్కువ పది కేజీల వరకు కోత విధించారు. వాటికి బదులుగా డిజిటల్ రూపంలో నగదు చెల్లించారు. కొందరు వాచ్మన్లు తమకు బియ్యం కావాలన్నా ఇవ్వలేదు. అగనంపూడి 85వ వార్డు తలారివానిపాలెంలో ఈ నెల 9న చాలామందికి కిలోన్నర నుంచి రెండు కేజీల వరకు తగ్గించి ఇచ్చారు. దీనిపై కార్డుదారులు ప్రశ్నించగా ‘అధికారులు అంతే ఇమ్మన్నారు.. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి’ అని సమాధానం ఇచ్చారు. వంశీ అనే కార్డుదారుకు 15 కేజీల బియ్యానికి 13.50 కేజీలే ఇచ్చారు. మరికొందరికి 20 కేజీలకు 18.30, 19.30 కేజీలే దక్కాయి. అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఎండీయూ నిర్వాహకుణ్ని సస్పెండ్ చేశారు.
- అనకాపల్లి జిల్లా రావికమతం మండలంలోని ఏజెన్సీ ప్రాంతంలో జీసీసీ డిపో సేల్స్మన్, ఎండీయూ ఆపరేటర్ కలిసి.. 3.65 టన్నుల బియ్యం, 305 కేజీల పంచదార, 339 కేజీల కందిపప్పును పక్కదారి పట్టించారు. గ్రామాలకు వస్తే సిగ్నల్ సరిగ్గా ఉండదంటూ గిరిజనులను నమ్మించి ముందే వేలిముద్రలు తీసుకున్నారు. వ్యవహారం వెలుగులోకి రావడంతో సేల్స్మన్ను సస్పెండ్ చేసిన అధికారులు.. ఎండీయూ ఆపరేటర్పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు ఎన్నో.
- ప్రకాశం జిల్లాలో అధికార పార్టీ నేతలే అక్రమ బియ్యం వ్యాపారానికి సూత్రధారులు. మద్దిపాడు మండలం గుండ్లాపల్లి గ్రోత్సెంటర్ కేంద్రంగా.. మూతపడిన మిల్లులో దందా జరుగుతోంది. చౌక బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి, తెల్లసంచుల్లో నింపి బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం పేరుతో విక్రయిస్తున్నారు. పెళ్లూరు ప్రాంతంలోనూ వైకాపా నేత ఆధ్వర్యంలో చౌకబియ్యం వ్యాపారం జరుగుతోంది. బాపట్ల జిల్లాలోని చీరాల, అద్దంకి ప్రాంతాలతోపాటు ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడు, యర్రగొండపాలెం, కొండపి, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల పరిధిలోని డీలర్ల నుంచి సేకరించిన బియ్యాన్ని రాత్రి సమయంలో కొన్ని మిల్లులకు తరలిస్తున్నారు. అక్కడ తేలికపాటి పాలిష్ చేసి తెల్ల సంచుల్లోకి మారుస్తున్నారు. ఒంగోలుకు చెందిన అధికార పార్టీ కార్పొరేటర్ భర్త మరికొందరితో కలిసి నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో నిర్వహించే మిల్లులో ఇటీవల విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మూడుసార్లు తనిఖీలు చేసి, 2వేల బస్తాలకు పైగా అక్రమ నిల్వలు గుర్తించారు. రాజకీయ ఒత్తిళ్లు రావడంతో కేవలం వంద బస్తాలే పట్టుబడ్డాయని తేల్చారు. ఒంగోలులో ఒక మహిళా ప్రజాప్రతినిధి కూడా స్నేహితురాలితో కలిసి డీలర్ల నుంచి బియ్యం సేకరించి వ్యాపారం చేస్తున్నారు.
- ఎన్టీఆర్ జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే కుటుంబం బియ్యం వ్యాపారంలో ఆరితేరారు. ఆయన భార్య ఆధ్వర్యంలోనే పెద్ద ఎత్తున రేషన్ బియ్యాన్ని కాకినాడకు తరలిస్తున్నారు. గుడివాడలో ఇటీవల ధాన్యం మిల్లు నుంచి కాకినాడ తరలించేందుకు సిద్ధం చేసిన 380 క్వింటాళ్ల బియ్యం పట్టుబడ్డాయి. మిల్లు లైసెన్సు సస్పెండ్ చేసి, 6ఏ కేసు పెట్టారు.
- తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఏడాది 118 కేసులు నమోదవగా పీడీఎస్ బియ్యం 3,117 క్వింటాళ్లు, కందిపప్పు 19 క్వింటాళ్లు, పంచదార 16 కింటాళ్లు పట్టుబడింది. కాకినాడ జిల్లాలో ఇప్పటి వరకు 82 కేసులు కట్టి.. 2,314 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. మే 5న రాజమహేంద్రవరం నుంచి కాకినాడకు తరలిస్తున్న 16.25 టన్నుల బియ్యాన్ని స్వాధీనపరుచుకుని, 6ఏ కేసు నమోదు చేశారు. గత నెల 29న రాజమహేంద్రవరం విజిలెన్స్ అధికారులు కొవ్వూరు హైవే కూడలి వద్ద రూ.17.08 లక్షల విలువైన సుమారు 23.70 టన్నుల బియ్యాన్ని సీజ్ చేశారు. ఈ నెల 10న రాజమహేంద్రవరం రోడ్డు రైలు వంతెన వద్ద సుమారు రూ.9 లక్షల విలువైన బియ్యాన్ని పట్టుకున్నారు.
- డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలో ఈ ఏడాది ఇప్పటి వరకు 22 కేసులు నమోదు చేసి 1,350 క్వింటాళ్ల బియ్యం స్వాధీనపరుచుకున్నారు.
- కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డ పురపాలక సంఘం కౌన్సిలర్ 144 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తరలిస్తూ పట్టుబడ్డారు. ఈయనపై నిత్యావసర వస్తువుల చట్టం 6(ఏ) కేసు నమోదైంది. ఉమ్మడి జిల్లాలో ఏటా అక్రమంగా తరలించే రేషన్ బియ్యానికి సంబంధించి రెండొందల 6(ఏ) కేసులు నమోదవుతున్నాయి. రెండు జిల్లాల్లో పౌరసరఫరాల గోదాముల్లో 3 వేల టన్నులకు పైగా పట్టుబడిన రేషన్ బియ్యం నిల్వలు ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
- విజయనగరంలోని బాలాజీనగర్ -నాగోజిపేట ప్రాంతంలో ఇటీవల ఎండీయూ వాహనాన్ని ఆహార సలహా కమిటీ సభ్యుడు బి.కాంతారావు తనిఖీ చేశారు. బియ్యం పంపిణీలో అవకతవకలు గుర్తించి 6ఏ కేసు నమోదు చేయడం అక్రమాలకు అద్దం పడుతోంది.
సరఫరాలోనే టన్నుకు 80 కిలోల దోపిడీ
మండల స్థాయి నిల్వ కేంద్రాలకు, అక్కడి నుంచి రేషన్ దుకాణాలకు పంపే బియ్యం తూకంలోనే భారీ తేడాలు కనిపిస్తున్నాయి. ఒక్కో బస్తాకు 3 నుంచి 5 కిలోల వరకు బియ్యం తగ్గుతున్నాయి. సగటున 4 కిలోల లెక్కన చూసినా.. టన్నుకు 80 కిలోలు అక్కడే వెనకేసుకుంటున్నారు. అంటే రాష్ట్రవ్యాప్తంగా నెలకు సుమారు 17 టన్నుల బియ్యాన్ని.. డీలర్లకు చేరక ముందే మింగేస్తున్నారు.
- మిల్లుల నుంచి గోదాములకు చేరే బియ్యంలో కొంత తరుగు ఉంటోంది. గోదాముల నుంచి డీలర్లకు చేరేసరికి ఇది మరింత పెరుగుతోంది. ఇలా మిగిలే బియ్యాన్ని నేరుగా గోదాముల నుంచే అక్రమ వ్యాపారుల మిల్లులకు చేరుస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గోదాముల నుంచి డీలర్లకు బియ్యం సరఫరా చేసే వాహన కాంట్రాక్టులకు భారీ డిమాండు ఉండటానికి ఇదే ప్రధాన కారణం. వీరికి బియ్యం అక్రమ రవాణా రూపంలో రూ.కోట్లు మిగులుతున్నాయి.
- బియ్యం బస్తా 50 కిలోలు ఉండటం లేదని డీలర్లు, ఎండీయూలు గగ్గోలు పెడుతున్నా.. పరిశీలిస్తామనే మాటలకే అధికారులు పరిమితమవుతున్నారు. దీంతో కొన్నిచోట్ల ఎండీయూ ఆపరేటర్లు కార్డుదారులకు ఇచ్చే బియ్యాన్ని తగ్గించి ఇస్తున్నారు. తిలా పాపం తలా పిడికెడు చందాన అందరికీ వాటాలు ఉండటమే దీనికి ప్రధాన కారణం.
- రేషన్ డీలర్లకు ఇకపై తూకం వేయించి బియ్యం ఇప్పించేలా చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు రెండు రోజుల కిందట హామీ ఇవ్వడం గమనార్హం.
జిల్లాల వారీగా రీసైక్లింగ్
కార్డుదారుల నుంచి సేకరించిన బియ్యాన్ని.. బస్తాలు మార్చి మిల్లులకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి లారీల ద్వారా కాకినాడ, కృష్ణపట్నం పోర్టులకు చేరవేస్తున్నారు. బియ్యం తరలింపులో ప్రతి నియోజకవర్గంలోనూ అధికార పార్టీ నేతల పాత్ర స్పష్టమవుతోంది. ప్రతి జిల్లాలోనూ కొందరు వైకాపా నేతలకు చెందిన మిల్లుల్లోనే రీసైక్లింగ్ జరుగుతోందని ఇటీవల బియ్యం పట్టుబడిన సందర్భాల్లో వెల్లడైంది. మూతపడిన మిల్లులను అద్దెకు తీసుకుని యథేచ్ఛగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. తరలింపు సమయంలో ఒక్కో లారీకి రూ.లక్ష వరకు ముట్టచెబుతున్నారు. వాహనం రోడ్డెక్కిన దగ్గర నుంచి మిల్లుకు, అక్కడ నుంచి పోర్టు సమీపంలోని మిల్లుకు చేరే వరకు.. అంతా అధికారపార్టీ నేతల కనుసన్నల్లోనే జరుగుతోంది.
పట్టపగలే కొనుగోలు.. యథేచ్ఛగా రవాణా
ఎండీయూ వాహనాలు లేక ముందు రేషన్ దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ చేసేవారు. కార్డుదారుల నుంచి కొన్నవి, ఇవ్వకుండా మిగుల్చుకున్న బియ్యాన్ని రాత్రి సమయాల్లో నల్లబజారుకు తరలించి విక్రయించేవారు. పోలీసు, రెవెన్యూ అధికారుల నిఘా ఉండేది. విజిలెన్స్ బృందాలు ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తుండేవి. ఎండీయూ వ్యవస్థ ఏర్పాటయ్యాక.. వాటి ఆపరేటర్లే కొన్నిచోట్ల బియ్యం వ్యాపారం చేస్తున్నారు. చాలాచోట్ల కార్డుదారుల నుంచి నేరుగా వారే కిలో రూ.10 నుంచి రూ.15 వరకు ఇచ్చి కొంటున్నారు. అవే వాహనాల్లో అక్రమ వ్యాపారులకు చేరవేస్తున్నారు. బియ్యం వాహనాలే కావడంతో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయని తనిఖీ చేయడం దాదాపుగా జరగదు. ఇదే వారికి మరింత కలిసొస్తోంది. కార్డుదారుల నుంచి బియ్యం కొనుగోలుపై ‘ఈనాడు’ క్షేత్రస్థాయిలో పరిశీలించగా.. సగటున ఒక్కో వాహనదారు రోజువారీ పంపిణీ చేసే బియ్యంలో 30% నుంచి 40% వరకు కార్డుదారుల నుంచి తిరిగి కొంటున్నట్లు వెల్లడైంది. కొన్నిచోట్ల రోజుకు 30 క్వింటాళ్లు పంపిణీ చేస్తే అందులో 12 క్వింటాళ్ల వరకు కొనేస్తున్నారు.
కేరాఫ్ కాకినాడే!
రాష్ట్రంలో ఏ మూలన రేషన్ బియ్యం పట్టుబడినా.. వాటి గమ్యస్థానం కాకినాడే అని బయటపడుతోంది. అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి చేరాయి. కొన్నేళ్లుగా విదేశాలకు పెరుగుతున్న బియ్యం ఎగుమతుల లెక్కలే దీనికి నిదర్శనం. మండల తహసీల్దారు నుంచి ప్రభుత్వ పెద్దల వరకు ఈ విషయం తెలిసినా అక్రమార్కులకే వత్తాసు పలుకుతున్నారు. తమ పార్టీలోని కొందరు నేతలే అక్రమ బియ్యం సేకరణ, ఎగుమతుల్లో సూత్రధారులుగా ఉన్నారని.. వైకాపా కార్యకర్తలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రంలో బియ్యం వ్యాపారం మొత్తం వారి చేతుల్లోనే నడుస్తోంది. ఇతర దేశాలకు ఎగుమతులు, అవసరమైన గోదాములు కూడా వారే నిర్వహిస్తున్నారు. ఇటీవలి వరకు జోరుగా సాగిన ఎగుమతులు.. కేంద్రం నిషేధం విధించడంతో తాత్కాలికంగా నిలిచాయి. అక్రమ బియ్యాన్ని సేకరించి ఎక్కడికక్కడే నిల్వలు చేసి, నిషేధం తొలగిన తర్వాత పంపే ప్రయత్నాల్లో ఉన్నారు. కొన్నిచోట్ల రీసైక్లింగ్ చేసి మళ్లీ పౌరసరఫరాలశాఖ ద్వారా కార్డులకు పంపే ప్రయత్నాలు సాగిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాయ్ రాజా కాయ్.. గెలిచేది కూటమేనోయ్!
రాష్ట్రంలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి? అధికారంలోకి వచ్చేదెవరు? ఉత్కంఠ రేకెత్తిస్తోన్న ఎన్నికల ఫలితాలపై భీమవరం బెట్టింగ్ బాబులు కూటమికే మొగ్గు చూపుతున్నారు. అధిక శాతం సీట్లలో తెదేపా, జనసేన, భాజపా కూటమి అభ్యర్థులు విజయం సాధించబోతున్నారంటూ భారీగా పందేలు కాస్తున్నారు. -
ఐదేళ్లలో ఒకటో తేదీన జీతం అందుకున్న దాఖలాల్లేవు: సూర్యనారాయణ
ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏ, పీఆర్సీ బకాయిలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని.. ఈ ఐదేళ్లలో ఒకటో తేదీన జీతం, పెన్షన్ అందని పరిస్థితులు నెలకొన్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక ఛైర్మన్ సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. -
నేడు 13 జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రాబోయే అయిదు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. -
అతివలు మెచ్చేలా.. అందరూ వచ్చేలా: మహిళా మోడల్ పోలింగ్ బూత్ ఏర్పాటు
పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల కమిషన్ మోడల్ పోలింగ్ కేంద్రాలను సుందరంగా తయారు చేస్తోంది. ఇందులో భాగంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని లయోల కళాశాలలో 56వ పోలింగ్ కేంద్రాన్ని మహిళా (పింక్) పోలింగ్ కేంద్రంగా తయారు చేశారు. -
జగన్ సభలకేనా బస్సులు.. ఓటేసే వారికి ఉండవా!
జగన్ సిద్ధం సభలకు వేల సంఖ్యలో బస్సులు సమకూర్చి స్వామిభక్తి చాటుకున్న ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు.. ఓటేసేందుకు సొంతూళ్లకు వచ్చే సామాన్య ప్రజలకు అవసరమైనన్ని బస్సులు ఏర్పాటు చేయకుండా వాళ్లచావు వాళ్లు చావని అనేలా వదిలేశారు. -
ఐదేళ్ల పాలన.. 50 ఏళ్ల విధ్వంసం
విభజనకు గురైన రాష్ట్రం అడుగులు ముందుకేస్తోంది... ఆంధ్రుల దశాదిశా మార్చే రాజధాని నిర్మాణానికి రంగం సిద్ధమై ఉంది... విశాఖ, అనంతపురం వంటివి పారిశ్రామికాభివృద్ధిలో పెద్ద అంగలు వేస్తున్నాయి... ఈ దశలో ఒక్క ఛాన్స్ అంటూ జగన్ వచ్చారు... రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో పురోగమింపజేసే అద్భుత అవకాశం... కానీ జగన్ విధ్వంసం... విద్వేషం... వంచనలతో భ్రష్ట పాలనకు తెరతీశారు. -
దారుణాలు ఆయనవే.. దండనా ఆయనదే..
జగన్ అయిదేళ్ల పాలన వెనుదిరిగి చూస్తే ఏమున్నది గర్వకారణం? ఆయన పాలన మొత్తం ప్రజాపీడన పరాయణత్వం.. సామాన్య పౌరుడికీ స్వేచ్ఛ లేదు. సామాజిక మాధ్యమాల్లో స్పందించే వాక్ స్వాతంత్య్రం లేదు. ఆఖరికి మాజీ ముఖ్యమంత్రికీ, ఒక పార్టీ అధినేతగా ఉన్న లక్షల మంది ఆరాధ్య నటుడికీ జనాలను కలవనివ్వని వైకాపా పోలీసు గ్యాంగ్. -
పదే పదే పునాది రాళ్లు!
శంకుస్థాపనలే.. అభివృద్ధి లేదు.. ధ్వంస రచనే.. బడ్జెట్ కేటాయింపుల్లేవు.. ప్రపంచస్థాయి పెట్టుబడులను ఆకర్షించే సత్తా లేదు.. అభివృద్ధిపై సమగ్ర ప్రణాళిక లేదు.. పనులు గతప్రభుత్వ హయాంలో మొదలయ్యాయా..? వాటి ఆనవాళ్లు లేకుండా చేయడమే..! మచిలీపట్నం... రామాయపట్నం... -
పెత్తందారు ఎవరు జగన్?
‘ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే’... అంటే దొంగే తనను పట్టుకున్న పోలీసును దొంగ అని అరిచాడని అర్థం..! ఐదేళ్లుగా ముఖ్యమంత్రి జగన్ చేస్తోంది అదే..! అణువణువునా పెత్తందారీ, భూస్వామ్య, ఫ్యాక్షన్ లక్షణాలతో చెలరేగిపోతూ, పైగా ఇతరులపై పెత్తందారులని ముద్రవేస్తూ గొంతు చించుకోవడం ఆయనకే చెల్లింది..! ప్రజల్ని అమాయకుల్ని చేసి... -
గుంతలు ప్రకృతి పుణ్యమట!
వర్షాల కారణంగా రోడ్లు పాడైతే ఏ ప్రభుత్వమైనా ఏం చేయాలి? మళ్లీ మరమ్మతులు చేసి బాగుచేయించాలి.. అలాకాకుండా ‘మేం రోడ్లు వేశాం.. కానీ వర్షాల వల్ల పాడయ్యాయి’ అని చేతులు దులుపుకొని.. నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తే? అలాంటి ప్రభుత్వాలను ఏమనాలి? ‘చేతగాని ప్రభుత్వాలు’ అనే కదా...! -
ఓటు పాశుపతాస్త్రం.. సక్రమంగా వినియోగించుకుందాం
ఓటు అమూల్యం.. ఆ హక్కును సక్రమంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. మన దేశం, మన రాష్ట్రం, మన సమాజం, వ్యక్తిగత జీవితాలు బాగుపడాలన్నా, భవిష్యత్తు ఉజ్వలంగా మారాలన్నా మనం వేసే ఓటే కీలకం. ప్రస్తుతం మన రాష్ట్ర భవితను నిర్దేశించే అత్యంత కీలక ఎన్నికలు జరుగుతున్నవి. -
పెద్దల మాట
-
కొత్త ప్రభుత్వం వచ్చాకే రిజిస్ట్రేషన్లలో కదలిక!
జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ-స్టాంపింగ్ పేపర్ల (జిరాక్స్ పత్రాల మాదిరి)పై రిజిస్ట్రేషన్ ప్రక్రియ పట్ల సర్వత్రా విముఖత వ్యక్తమవుతోంది. ఎన్నికల అనంతరం రాష్ట్రంలో అధికార మార్పిడికి అవకాశాలున్నాయన్న కారణాలతోనూ రాష్ట్రంలో ఆస్తుల క్రయవిక్రయాలు తగ్గాయి. నాన్జ్యుడీషియల్ స్టాంపు పేపర్లపై ఏళ్ల తరబడి సాగుతున్న రిజిస్ట్రేషన్ వ్యవస్థను వైకాపా ప్రభుత్వం అస్తవ్యస్తం చేసింది. -
రైతులంటే లెక్కలేనితనం..
ఒక్క ఏడాదే 47.77 లక్షల ఎకరాల్లో (2023-24 ఖరీఫ్, రబీ) పంటలు వేయలేదంటే అది తీవ్ర కరవు కాదా? వర్షాలు అనుకూలిస్తే రైతులు విత్తనం వేయకుండా ఉంటారా? వానల్లేక, సాగునీరందక 23లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నా, అధికశాతం ఎండిపోయినా.. అది కరవు కాదట.. ఆయనకెక్కడా కరవే కన్పించలేదట. -
‘వన్టైం’ పదోన్నతుల పేరుతో వైద్య బోధకులకు ఎర
కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు వైద్య బోధకుల నియామకాల విషయంలో వైకాపా ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తోంది. కళాశాలల ఏర్పాటుకు తగ్గట్టుగా నియామకాలను ముందుగా చేపట్టకుండా.. జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) తనిఖీలకు వచ్చే సమయంలో హడావుడి చేస్తోంది. -
తీరంలో గంజాయి కంపు
ఐటీ కంపెనీలు రావాల్సిన చోట.. మత్తులో బ్లేడ్బ్యాచ్లు వీరంగం వేస్తున్నాయి. ఇప్పటి వరకూ ఎన్నడూ చూడని ఘటనలు... ఊహకు అందని దారుణాలు స్థానికుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. -
సీఎం జగన్.. నలుగురు సామంతులు
ఒక రాజు.. నలుగురు సామంతులు.. ఇదీ ఈ ఐదేళ్లలో రాష్ట్రంలో సాగిన పాలన తీరు. సీఎం హోదాలో జగన్.. ఆయనకు సామంతులుగా నలుగురు వ్యవహరించారు. ఈ ఐదేళ్ల జగన్ పాలనలో చీకటి కోణాలకు ప్రతినిధులుగా ఈ నలుగురూ నిలిచారు. -
అత్యవసర సిబ్బందికీ వేతనాలివ్వరా?
జగన్ ప్రభుత్వం అత్యవసర వైద్య సేవల సిబ్బందికీ చుక్కలు చూపిస్తోంది. -
పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులు ఏమయ్యాయి?
పంచాయతీలకు కేంద్రం మంజూరు చేసిన 15వ ఆర్థిక సంఘ నిధులు రూ.998.84 కోట్లు ఏమయ్యాయని అఖిల భారత పంచాయతీ పరిషత్తు జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు ప్రశ్నించారు. -
ఓటుకు బయలెల్లిన నగరం
ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్ నుంచి తెలంగాణ జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్కు శనివారం భారీగా ప్రజలు సొంతూరి బాట పట్టారు. -
దళిత యువకుడిపై సినీ రచయిత కోన వెంకట్ దాడి
ఎన్నికల ముందు వైకాపాను వీడి తెదేపాలో చేరారనే కక్షతో బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం గణపవరానికి చెందిన దళిత యువకుడు కత్తి రాజేష్పై వైకాపా బాపట్ల అసెంబ్లీ అభ్యర్థి ఎమ్మెల్యే కోన రఘుపతి బంధువు, కర్లపాలెం మండలం వైకాపా ఇన్ఛార్జి, సినీ రచయిత కోన వెంకట్ తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
‘త్రినయని’ సీరియల్ నటి పవిత్రా జయరాం కన్నుమూత
-
రూ.58, రూ.59తో బీఎస్ఎన్ఎల్లో 2 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు
-
తొలిసారిగా పంది కిడ్నీ మార్పిడి చేయించుకున్న వ్యక్తి మృతి
-
పంత్ లేకపోవడం వారికి నష్టమే.. మమ్మల్ని దిల్లీ ఓడించడం కష్టమే: బెంగళూరు కోచ్
-
విరాట్ కోహ్లీపై విమర్శలు వద్దు.. మరింత ప్రమాదకరంగా మారతాడు: హేడెన్
-
112 ఏళ్ల నుంచి తప్పనిసరి ఓటింగ్..!