AP CID: కిలారు విషయంలో పొరపాటు జరిగింది

తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కిలారు రాజేష్‌ పేరును వెబ్‌సైట్లో పొరపాటున నిందితుడిగా పేర్కొన్నట్లు సీఐడీ తరఫు ప్రత్యేక పీపీ వివేకానంద హైకోర్టుకు నివేదించారు.

Updated : 11 Nov 2023 09:52 IST

వెబ్‌సైట్లో రాజేష్‌ను నిందితుడిగా పేర్కొన్నాం
తొలగించాలని అధికారులకు తెలిపాం
హైకోర్టుకు నివేదించిన సీఐడీ న్యాయవాది

ఈనాడు, అమరావతి: తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కిలారు రాజేష్‌ పేరును వెబ్‌సైట్లో పొరపాటున నిందితుడిగా పేర్కొన్నట్లు సీఐడీ తరఫు ప్రత్యేక పీపీ వివేకానంద హైకోర్టుకు నివేదించారు. ఆ పేరును తొలగించాలని అధికారులకు సూచించానని తెలిపారు. కౌంటర్‌ వేసేందుకు సమయం కావాలని ఆయన కోరడంతో విచారణను ఈ నెల 17కు వాయిదా వేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బీఎస్‌ భానుమతి శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో తనను సీఆర్‌పీసీ సెక్షన్‌ 160 కింద సాక్షిగా హాజరు కావాలని సీఐడీ నోటీసులు జారీ చేస్తూ మరోవైపు వెబ్‌సైట్లో తనను నిందితుడిగా చూపుతోందని, లుకౌట్‌ నోటీసులు జారీచేసిందంటూ కిలారు రాజేష్‌ శుక్రవారం అత్యవసరంగా పిటిషన్‌ దాఖలు చేశారు. సీఐడీ నోటీసులను రద్దు చేయాలని కోరారు. తనను విచారించేందుకు ఇంటెలిజెన్స్‌ డీజీ, మరికొందరిని అనుమతించడాన్ని చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించాలన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ, సీమెన్స్‌ సంస్థతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.

వ్యాజ్యంలో పేర్కొన్న అంశాలివి..

‘విచారణ నిమిత్తం ఈ ఏడాది అక్టోబర్‌ 16న సీఐడీ ముందు హాజరు కాగా.. మోహన్‌, సుదర్శన్‌ అనే వ్యక్తులు సుమారు 50 నిమిషాలు ప్రశ్నించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు, సీమెన్స్‌, డిజైన్‌ టెక్‌ సంస్థలకు చెందినవారి గురించి అడిగారు. మధ్యాహ్నం తర్వాతా మళ్లీ ప్రశ్నించారు. ‘డీజీ నిన్ను రమ్మన్నారు’ అని సీఐడీ డీఎస్పీ చెప్పడంతో డీజీ ఛాంబర్‌కు వెళ్లాను. ఇంటిలిజెన్స్‌ డీజీ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, సీఐడీ డీఐజీ రఘురామిరెడ్డి అక్కడ ఉన్నారు. ఆంజనేయులు నన్ను బెదిరించారు. నాపై కేసు పెట్టడానికి సాక్ష్యాధారాలు ఉన్నాయని, తమకు సహకరించకపోతే ఉపేక్షించబోమని కేసు దర్యాప్తుతో సంబంధం లేకున్నా ఆయన హెచ్చరించారు. తర్వాత సిబ్బంది సెక్షన్‌ 160, 91 నోటీసులు ఇచ్చి, మరుసటి రోజు (17న) మళ్లీ రావాలని చెప్పారు. మూడేళ్ల కిందటి దస్త్రాలను తీసుకురావాలని చెప్పడంతో మర్నాడు రావడం సాధ్యం కాదని చెప్పాను. దీనిపై సీఐడీ డీఎస్పీకి 17న సమాచారం ఇచ్చాను. రాజకీయ అభిప్రాయాలను వ్యక్తపరచకుండా అణచివేయడం కోసం, తెదేపా కార్యకలాపాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నానన్న ఉద్దేశంతో నన్ను వేధిస్తున్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని నోటీసులు ఇవ్వకుండా సీఐడీని నిలువరించండి’ అని రాజేష్‌ తన పిటిషన్లో కోరారు.

సీఐడీ స్వేచ్ఛను హరిస్తోంది: న్యాయవాది ఆదినారాయణరావు

పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. ‘పిటిషనర్‌కు ఓ వైపు సాక్షిగా విచారణకు హాజరుకావాలని నోటీసు ఇస్తూ.. మరోవైపు నిందితుడిగా పేర్కొన్నారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న రాజేష్‌పై నిఘా పెట్టారు. బెదిరిస్తున్నారు. ఇంటిలిజెన్స్‌ వారు వెంబడిస్తున్నారు. దీనిపై తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశాం. ఆ వ్యక్తి ఏపీ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌కు చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌గా తేలింది. మొదటి నోటీసును గౌరవించి ఆయన సీఐడీ ముందు హాజరయ్యారు. నేరానికి పాల్పడినట్లు అంగీకరించాలని బెదిరించారు. తెలంగాణలో నివసించే ఆయనకు నోటీసిచ్చి తమ ముందు హాజరుకావాలని కోరే పరిధి ఏపీ సీఐడీకి లేదు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకుని సీఐడీని నిలువరించండి’ అని కోరారు. సీఐడీ తరఫున వివేకానంద వాదనలు వినిపిస్తూ.. వ్యాజ్యానికి విచారణ అర్హత లేదన్నారు. పిటిషనర్‌ పేరును వెబ్‌సైట్లో నిందితునిగా పేర్కొనడంలో పొరపాటు జరిగిందన్నారు. తొలగించాలని అధికారులకు మౌఖికంగా తెలిపానన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు