ఇద్దరు ఐఏఎస్‌ అధికారులకు జైలు

కోర్టు ధిక్కరణకు పాల్పడిన ఇద్దరు ఉన్నతాధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి శ్యామలరావు, కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ పోలా భాస్కర్‌కు నెల రోజుల సాధారణ జైలు శిక్ష, రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించింది.

Published : 29 Nov 2023 05:31 IST

శ్యామలరావు, పోలా భాస్కర్‌కు శిక్ష, జరిమానా విధించిన హైకోర్టు
కోర్టు ధిక్కరణ కేసులో తీర్పు

 ఈనాడు, అమరావతి: కోర్టు ధిక్కరణకు పాల్పడిన ఇద్దరు ఉన్నతాధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి శ్యామలరావు, కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ పోలా భాస్కర్‌కు నెల రోజుల సాధారణ జైలు శిక్ష, రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించింది. జైలు శిక్ష అనుభవించేందుకు హైకోర్టు రిజిస్ట్రార్‌ జ్యుడీషియల్‌ వద్ద డిసెంబరు 8లోపు లొంగిపోవాలని ఆదేశించింది. నిబంధనల మేరకు వారిని జైలుకు పంపేందుకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రీకి సూచించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.మన్మథరావు మంగళవారం తీర్పు వెలువరించారు. అన్‌ఎయిడెడ్‌ లెక్చరర్లను ఎయిడెడ్‌ కళాశాలల్లోకి తీసుకోవాలని కళాశాల విద్యాశాఖ కమిషనర్‌, డైరెక్టరేట్‌ను ఆదేశిస్తూ గతేడాది జులై 26న హైకోర్టు ఆదేశించింది. ఆ తీర్పును సంబంధిత శాఖ అధికారులు అమలు చేయకపోవడంతో సబ్బవరపు సూరిబాబుతోపాటు మరికొందరు అన్‌ఎయిడెడ్‌ లెక్చరర్లు హైకోర్టులో కోర్టు ధిక్కరణ వ్యాజ్యాలు దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది గంగయ్యనాయుడు తదితరులు వాదనలు వినిపించారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఆదేశాలను అధికారులు అమలు చేయలేదని తేల్చారు. దాంతో సంబంధిత అధికారులకు జైలు శిక్షతోపాటు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని