ఆ తీర్పును తెలుగు చేసి పోలీసులకు పంపండి

లలితకుమారి వర్సెస్‌ ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రతిని రాష్ట్రంలోని పోలీసు అధికారులకు మరోసారి పంపాలని రాష్ట్ర డీజీపీని హైకోర్టు ఆదేశించింది.

Updated : 29 Nov 2023 05:56 IST

రాష్ట్ర డీజీపీకి హైకోర్టు ఆదేశం

ఈనాడు, అమరావతి: లలితకుమారి వర్సెస్‌ ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రతిని రాష్ట్రంలోని పోలీసు అధికారులకు మరోసారి పంపాలని రాష్ట్ర డీజీపీని హైకోర్టు ఆదేశించింది. అందరికీ అర్థమయ్యేలా తీర్పును తెలుగులోకి తర్జుమా చేయాలని స్పష్టం చేసింది. తీర్పులోని అంశాలపై పూర్తి అవగాహన చేసుకొని, వాటిని సరైన స్ఫూర్తితో అమలు చేసేలా చూడాలంది. పౌరుల నుంచి అందిన ఫిర్యాదులపై ప్రాథమిక విచారణ అవసరమని భావించి, 24 గంటల్లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోతే.. సదరు ఫిర్యాదుపై విచారణ ఏ దశలో ఉందనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఫిర్యాదుదారుకు అందించేలా యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ఆదేశించారు.

తాను ఫిర్యాదు చేసినా విశాఖపట్నంలోని మహారాణిపేట పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవడాన్ని సవాల్‌ చేస్తూ కె.రామారావు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మరో ఠాణాలోనూ పోలీసులు కేసు నమోదు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ ఇంకో వ్యాజ్యం దాఖలైంది. ఈ రెండింటిపై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది పీవీజీ ఉమేశ్‌చంద్ర వాదనలు వినిపించారు. పలు తీర్పులను ఉదహరించడంతో న్యాయస్థానం వాటిని పరిగణనలోకి తీసుకుంది. కాగ్నిజబుల్‌ నేరాలు చోటుచేసుకున్నప్పుడు ప్రాథమిక విచారణ అవసరం లేకుండానే పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సి ఉంటుందని తదితర అంశాలపై స్పష్టత ఇస్తూ లలితకుమారి కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇచ్చిందని గుర్తుచేసింది.

ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోతే జిల్లా ఎస్పీకి పోస్టు ద్వారా రాతపూర్వకంగా సమాచారం ఇవ్వొచ్చనీ తెలిపింది. అప్పటికీ నమోదు చేయకపోతే ఆయా పరిధిలోని మెజిస్ట్రేట్‌ కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేయవచ్చని స్పష్టం చేసింది. పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవడంపై హైకోర్టులో ఇటీవల పలు వ్యాజ్యాలు దాఖలవుతున్నాయి. ఈ నేపథ్యంలో లలితకుమారి కేసు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను మరోసారి పోలీసు అధికారులకు పంపించి, ఆ ప్రకారం నడుచుకునేలా చూడాలని రాష్ట్ర డీజీపీని ఆదేశిస్తున్నట్లు పేర్కొంది. సీఆర్‌పీసీ నిబంధనల ప్రకారం పిటిషనర్లు తగిన ఫోరాన్ని ఆశ్రయించేందుకు స్వేచ్ఛనిచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని