‘ఎవడ్రా నువ్వు.. తమాషాలు చేస్తున్నావా’.. ఎంపీడీవోపై ముత్తంశెట్టి చిందులు

గెజిటెడ్‌ అధికారి అయిన ఓ ఎంపీడీవోపై మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు బహిరంగ వేదికపై దుర్భాషలాడారు.

Updated : 02 Dec 2023 10:45 IST

బహిరంగ సభలో ఎంపీడీవోపై మాజీ మంత్రి ముత్తంశెట్టి చిందులు

ఈనాడు, విశాఖపట్నం: గెజిటెడ్‌ అధికారి అయిన ఓ ఎంపీడీవోపై మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు(Muttamsetti Srinivasa Rao) బహిరంగ వేదికపై దుర్భాషలాడారు. ‘ఎవడ్రా నువ్వు.. ఏం తమాషాలు చేస్తున్నావా.. ఏం మాట్లాడుతున్నావు..’ అని మండిపడ్డారు. ఇదీ అయ్యప్ప మాలలో ఉండి కూడా ఆయన ఇలా చిందులు తొక్కడం తీవ్ర చర్చనీయాంశమైంది. విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం రేవిడి గ్రామంలో శుక్రవారం సాయంత్రం ‘ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు’ కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల కృష్ణాపురం, పాండ్రంగి తదితర గ్రామాల్లో జరిగిన ఈ కార్యక్రమాల ఫొటోలు ఎందుకు అప్‌లోడ్‌ చేయలేదంటూ మండల వైకాపా అధ్యక్షుడు కోరాడ లక్ష్మణరావు ఎంపీడీవో విజయ్‌కుమార్‌ను ప్రశ్నించారు. ఆ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొనకపోవడంతో వాటికి సంబంధించినవి అప్‌లోడ్‌ చేయలేదని ఎంపీడీవో సమాధానమిచ్చారు.

దాంతో ఎమ్మెల్యే బహిరంగ సభ అని కూడా చూడకుండా అందరి ముందూ ఎంపీడీవోను నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఒక దశలో ఎంపీడీవోపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా జిల్లా పరిషత్‌ ఉపాధ్యక్షుడు సుంకర గిరిబాబు వారించారు. ఈ విషయమై ఎంపీడీవో విజయ్‌కుమార్‌ను వివరణ కోరగా.. ఇటీవల పాండ్రంగిలో కార్యక్రమం రసాభాస కావడంతో సంక్షేమ పథకాల బోర్డు ఆవిష్కరించకుండానే ఎమ్మెల్యే వెనుదిరిగారన్నారు. తర్వాత సర్పంచి దాన్ని ఆవిష్కరించడంతో ఆ ఫొటోను సిటిజన్‌ అవుట్‌ రీచ్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేశామని, ఆ విషయం సభలో వివరిస్తుండగా ఒక్కసారిగా ఎమ్మెల్యే ఆగ్రహించారని చెప్పారు. ఎమ్మెల్యే ముత్తంశెట్టిని సంప్రదించేందుకు ఫోనులో ప్రయత్నించగా ఆయన స్పందించలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని