సార్‌ వస్తున్నారు.. ఎక్కడి చేపలు అక్కడే గప్‌చుప్‌!

ముఖ్యమంత్రి జగన్‌ గాలిలో వెళ్తుంటేనే నేల మీద ఆంక్షలు విధించే అధికారులు ఇప్పుడు ఆయనే వస్తున్నాంటే ఊరుకుంటారా! విశాఖలోని రుషికొండ ప్రాంతాన్ని దాదాపుగా ఖాళీ చేయిస్తున్నారు.

Updated : 02 Dec 2023 07:02 IST

రుషికొండ నుంచి చేపల వేట బంద్‌
బ్లూ ఫ్లాగ్‌ బీచ్‌కు మూసివేత గండం!
సీఎం క్యాంపు కార్యాలయం పేరుతో రెండు కిలోమీటర్ల పరిధిలో ఆంక్షలు
జల క్రీడల నిర్మాణాల కూల్చివేత
పర్యాటక నిర్మాణాల తొలగింపు

ఈనాడు, విశాఖపట్నం: ముఖ్యమంత్రి జగన్‌ గాలిలో వెళ్తుంటేనే నేల మీద ఆంక్షలు విధించే అధికారులు ఇప్పుడు ఆయనే వస్తున్నాంటే ఊరుకుంటారా! విశాఖలోని రుషికొండ ప్రాంతాన్ని దాదాపుగా ఖాళీ చేయిస్తున్నారు. సీఎం ప్యాలెస్‌ కోసం రుషికొండను బోడిగుండు చేయగా.. ఇప్పుడు దాన్ని ఆనుకొని సముద్ర తీరంలోని పలు నిర్మాణాలను ధ్వంసం చేస్తున్నారు. స్థానిక మత్స్యకారులు రుషికొండ వైపు నుంచి చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరించినట్లు సమాచారం. డిసెంబరు రెండో వారంలో సీఎం జగన్‌ విశాఖకు వస్తారనే చర్చ సాగుతోంది. రుషికొండ మీద భవనాలను సీఎం క్యాంపు కార్యాలయంగా వినియోగించనున్న నేపథ్యంలో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేపట్టారు. ప్రఖ్యాతిగాంచిన, బ్లూ ఫ్లాగ్‌ గుర్తింపు కలిగిన రుషికొండ బీచ్‌ను మూసేస్తారనే ప్రచారం సాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులకు అనుకూలమైన బీచ్‌లకు స్వీడన్‌ ఈ రేటింగ్‌ ఇస్తుంది. బ్లూఫ్లాగ్‌ గుర్తింపు ఉంటే విదేశీ పర్యాటకులు ఎక్కువగా సందర్శిస్తుంటారు. కేంద్రం గతంలో ఇక్కడ రూ. 7 కోట్లతో వసతులు కల్పించింది. మరో రూ. 3 కోట్లతో వాటిని మరింత మెరుగుపరిచారు. సీఎం వ్యక్తిగత భద్రత చూసే అధికారులు రెండు కి.మీ. పరిధిలో ఎటువంటి కార్యకలాపాలు ఉండకూడదని ఆదేశించడంతో ప్రస్తుతం జిల్లా యంత్రాంగం ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. బీచ్‌లోని పిల్లల ఉద్యానవనం, మరుగుదొడ్లు, మంచినీటి శుద్ధి కేంద్రాన్ని మరో ప్రాంతానికి తరలిస్తారని సమాచారం.

జల క్రీడల నిర్మాణాలు కూల్చేసి

రుషికొండ కేంద్రంగా జల క్రీడల విన్యాసాలను ప్రోత్సహించేలా గతంలో ఏర్పాట్లు జరిగాయి. ఇప్పుడు వాటిని తొలగించేశారు. దీంతో క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం విశాఖ విమానాశ్రయం నుంచి రుషికొండకు హెలికాప్టర్‌ ద్వారా చేరుకునేందుకు బీచ్‌లోని హెలిప్యాడ్‌ను వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. హెలిటూరిజం కోసం గతంలో నిర్మించిన దాన్ని ప్రస్తుతం ఆధునికీకరిస్తున్నారు. హెలికాప్టర్‌ దిగడానికి అడ్డంగా ఉన్నాయని జల క్రీడల విన్యాసాల పడవలను భద్రపరిచిన షెడ్లు కూల్చేశారు. మొత్తం పరిసరాలను భారీ యంత్రాలతో చదును చేస్తున్నారు. పర్యాటకుల కోసం నిర్మించిన మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదుల పైకప్పులను గురువారం తొలగించారు. ఒకటి, రెండు రోజుల తర్వాత వాటినీ పూర్తిగా తీసేస్తారంటున్నారు.

కొండ చుట్టూ పనులు

హెలిప్యాడ్‌ నుంచి గతంలో కొండ పక్కన నిర్మించిన కొత్త రోడ్డులోకి వెళ్లేందుకు అనుసంధాన మార్గం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే విశాఖ- భీమిలి మార్గం నుంచి బీచ్‌లోకి వెళ్లే రోడ్డును కొత్తగా పునరుద్ధరించారు. బీచ్‌లోని శివాలయాన్ని ఆనుకొని ఉన్న మరో రోడ్డుకు కొత్త హంగులు అద్దారు. కొండ మీదికి  24 గంటల నీటి సరఫరా నిమిత్తం కొండ వెనుక పంపుహౌస్‌ నిర్మిస్తున్నారు.


ఉపాధిపై ప్రభావం

పేదలు.. పెత్తందారులు అని మాట్లాడే జగన్‌ రుషికొండలో క్యాంపు కార్యాలయం భద్రత పేరుతో పేదల ఉపాధికి గండికొట్టేలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. సుమారు వంద కుటుంబాలకు చెందిన మత్స్యకారులు రుషికొండ బీచ్‌ నుంచే నిత్యం వేట సాగిస్తుంటారు. అక్కడే వలలు అల్లుకుంటారు. పడవలకు మరమ్మతులు చేస్తుంటారు. బ్లూఫ్లాగ్‌ బీచ్‌ను అభివృద్ధి చేసిన సమయంలోనూ వారికి ఎలాంటి ఇబ్బందీ కలగలేదు. ప్రస్తుతం వారి వేట స్థావరం మార్చుకోవాలని, రుషికొండ సమీపం నుంచి వేటకు వెళ్లకూడదనే హెచ్చరికలు చేసినట్లు సమాచారం. స్థానిక దుకాణదారుల వ్యాపారాల పైనా పలు ఆంక్షలు విధించినట్లు సమాచారం.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని