సాగర్‌ వద్ద సాధారణ పరిస్థితులు

నాగార్జునసాగర్‌ జలాశయం వద్ద పరిస్థితులు యథాస్థితికి వచ్చాయి. నవంబరు 29కి ముందునాటి వాతావరణం నెలకొంది.

Published : 04 Dec 2023 03:55 IST

ముళ్లకంచెను తొలగించిన పోలీసులు
ఏపీ భూభాగంలోకి కేంద్రబలగాలు

ఈనాడు డిజిటల్‌-నరసరావుపేట, న్యూస్‌టుడే-విజయపురిసౌత్‌: నాగార్జునసాగర్‌ జలాశయం వద్ద పరిస్థితులు యథాస్థితికి వచ్చాయి. నవంబరు 29కి ముందునాటి వాతావరణం నెలకొంది. ఆదివారం ఆంధ్రా భూభాగంలోకి కేంద్ర బలగాలు వచ్చి ప్రాజెక్టును తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. 13వ గేటు వరకూ వేసిన ముళ్ల కంచెను, బారికేడ్లను తొలగించారు. ఎన్నెస్పీ అధికారులు, కేంద్ర బలగాలు, ఆంధ్ర, తెలంగాణ పోలీసులు డ్యాంపై సమావేశమై నీటి వాటాలపై చర్చించుకుని బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని నిర్ణయానికి వచ్చారు. దీంతో ఇరువైపులా పోలీసు బలగాలు తిరుగుముఖం పట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ నెల 6వ తేదీన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం దిల్లీలో జరగనుందని, బోర్డు నిర్ణయం మేరకు నడుచుకుందామని ఇరు రాష్ట్రాల సాగర్‌ అధికారులు మాట్లాడుకున్నారు. జలాశయం పరిధిలో కేంద్ర బలగాలే ఉండాలని, పోలీసు బలగాలు వెనక్కి వెళ్లిపోవాలని కేంద్ర హోంశాఖ సూచనలు పాటించాలన్న విషయంపై ఏకాభిప్రాయానికి వచ్చారు. ఏపీ భూభాగంలోని డ్యాం పాయింట్లను పూర్తిగా కేంద్ర బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. కేంద్రం రంగంలోకి దిగడంతో సమస్య తాత్కాలికంగా సద్దుమణిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని