Polavaram: పోలవరంపై కేంద్రం తీవ్ర ఆగ్రహం

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో రాష్ట్రం వ్యవహరిస్తున్న తీరుపై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. వద్దన్నా నీళ్లు నింపుతున్నారని, కాఫర్‌డ్యాం కొట్టుకుపోతే ఎవరు బాధ్యులని నిలదీసింది.

Updated : 06 Dec 2023 09:46 IST

సీపేజీతో కొట్టుకుపోయేలా ఉన్న ఎగువ కాఫర్‌డ్యాం
దీనికెవరు బాధ్యులు?
ప్రాజెక్టు పనులపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
కేంద్ర కార్యదర్శి ఆగ్రహం
ఎగువ కాఫర్‌ డ్యాం మరమ్మతుల డబ్బులివ్వం
కేంద్రమంత్రి సలహాదారు వెదిరె శ్రీరామ్‌
నీళ్లు నమిలిన రాష్ట్ర అధికారులు

ఈనాడు, అమరావతి: పోలవరం(Polavaram) ప్రాజెక్టు నిర్మాణంలో రాష్ట్రం వ్యవహరిస్తున్న తీరుపై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. వద్దన్నా నీళ్లు నింపుతున్నారని, కాఫర్‌డ్యాం కొట్టుకుపోతే ఎవరు బాధ్యులని నిలదీసింది. గైడ్‌బండ్‌ కుంగడానికి బాధ్యత ఎవరిదో ఎందుకు నిర్ధారించలేదని ప్రశ్నించింది. రాష్ట్రప్రభుత్వానికి ఈ ప్రాజెక్టు విషయంలో ఏ మాత్రం సీరియస్‌నెస్‌ లేదని అర్థమవుతోందని వ్యాఖ్యానించింది. మరో 15 రోజుల్లో తిరిగి సమావేశం కావాలని, అప్పటికి నిర్దేశించిన అంశాల్లో కొన్ని పూర్తిచేసుకుని రావాలని ఆదేశించింది. దిల్లీలో మంగళవారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ అంశాలపై కేంద్ర జలశక్తిశాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ, కేంద్ర జలశక్తి మంత్రి సలహాదారు వెదిరె శ్రీరామ్‌ సమావేశం నిర్వహించారు.

👉 Follow EENADU WhatsApp Channel

ఆంధ్రప్రదేశ్‌ నుంచి జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, పోలవరం సీఈ సుధాకర్‌బాబు తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశమంతా చాలా సీరియస్‌గా జరిగిందని తెలిసింది. అనేక అంశాల్లో రాష్ట్ర అధికారుల తీరుతెన్నులపై దేబశ్రీ ముఖర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తిచేయాలన్నది ప్రస్తుత ప్రణాళిక అని ఆమె అడిగారు. 2024 జూన్‌ నాటికి పూర్తిచేయాలని తమ ఉద్దేశమని ఏపీ అధికారులు చెప్పారు. ఇది ఆచరణాత్మక ప్రణాళికేనా అని ఆమె సీరియస్‌ అయ్యారు. ఎన్నో అంశాలు పరిష్కారం కావాల్సి ఉండగా అప్పటికి ప్రాజెక్టు పూర్తిచేయగలమని ఎలా అనుకుంటున్నారని ప్రశ్నించారు.

పోలవరంలో అంశాలపై ఆంధ్రప్రదేశ్‌ అధికారులకు ఎన్నిసార్లు లేఖ రాసినా స్పందన లేదని, కేంద్ర జలశక్తి తమను బాధ్యులను చేస్తోందని పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ శివనందన్‌ కుమార్‌ సమావేశంలో తెలిపారు. ప్రాజెక్టులో నీళ్లు ఖాళీచేయాలని తాము ఎన్నిసార్లు లేఖ రాసినా పట్టించుకోలేదని ఆయన తెలిపారు. దీంతో కేంద్ర కార్యదర్శి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎగువ కాఫర్‌డ్యాం తీవ్ర సీపేజీ సమస్యతో కొట్టుకుపోయేలా ఉందని, నీళ్లు నింపడం ఎంత ప్రమాదమో తెలుసా? అని దేబశ్రీ ప్రశ్నించారు. కాఫర్‌డ్యాం కొట్టుకుపోతే ఎవరు బాధ్యులని ఆమె నిలదీశారు. ఎగువ కాఫర్‌డ్యాం మరమ్మతులకు, నీటిని ఎత్తిపోస్తున్న ఖర్చుల్ని కేంద్రం చెల్లించబోదని తేల్చిచెప్పారు.

అధ్యయనానికి వెళ్తే.. గేలిచేసినట్లు వ్యవహరిస్తున్న అధికారులు

ప్రైమ్‌ ఆఫ్‌ వీర సాఫ్ట్‌వేర్‌ వినియోగించాలని రెండేళ్లుగా చెబుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని కేంద్ర కార్యదర్శి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సాఫ్ట్‌వేర్‌ అప్‌లోడ్‌ చేశామని, తేదీలు మాత్రమే అనుసంధానం చేయలేదని రాష్ట్ర అధికారులు చెప్పారు. తేదీలతో అనుసంధానం చేయకపోతే ఆ సాఫ్ట్‌వేర్‌ వల్ల ప్రయోజనం ఏమిటని ఆమె ప్రశ్నించగా అధికారులు సమాధానం చెప్పలేకపోయారు. మరో 15 రోజుల్లో ఆ ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించారు. ఎగువ కాఫర్‌ డ్యాం సీపేజీ సమస్యపై అధ్యయనానికి తాము వెళ్లినప్పుడు అక్కడ అధికారులు గేలి చేస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నారని సీఎస్‌ఎంఆర్‌ఎస్‌ డైరెక్టర్‌ కేంద్ర కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. దీంతో దేబశ్రీ మరింత ఆగ్రహానికి గురయ్యారు.

ఎన్ని సీజన్లు నష్టపోయామో తెలుసా?

కేంద్ర జలశక్తి మంత్రి సలహాదారు వెదిరె శ్రీరామ్‌ సైతం పోలవరం పనుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాజెక్టు త్వరగా పూర్తికావాలన్న ఉద్దేశంతోనే ఇలా మాట్లాడవలసి వస్తోందని ఆయన అన్నారు. ఇప్పటివరకు పనులు చేయకుండా ఎన్ని సీజన్లు వెళ్లిపోయాయో గుర్తించారా అని ఆయన నిలదీయగా, అధికారులెవరూ స్పందించలేదు. నాలుగు సీజన్లు నష్టపోయామని ఆయనే వెల్లడించారు.

గైడ్‌బండ్‌ కుంగడానికి బాధ్యత ఎవరిది?

సీపేజీ గురించి తాము ముందే హెచ్చరించినా ఎందుకు పట్టించుకోలేదని శ్రీరామ్‌ ప్రశ్నించారు. గైడ్‌బండ్‌ కుంగిపోవడానికి బాధ్యత ఎవరిదో ఇంకా నిర్ధారించలేదని ప్రస్తావించారు. ఇప్పుడు సీపేజీ సమస్య తలెత్తిందన్నారు. పోలవరంలో ఎంఓయూ కుదుర్చుకోకపోవడం వల్లే ఈ సమస్య పెరుగుతుందని కేంద్రపెద్దలు పేర్కొన్నారు.

తొలి దశ నిధులపై

పోలవరం ప్రాజెక్టుకు తొలిదశలో మొత్తం రూ.31,625 కోట్లకు కేంద్ర జలసంఘం ఇచ్చిన సిఫార్సులను రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీ పది రోజుల్లో పరిశీలించి తేల్చి నివేదిక ఇవ్వాలని కేంద్ర కార్యదర్శి ఆదేశించారు. అక్కడి నుంచి సిఫార్సు వచ్చాక ప్రధాని అధ్యక్షతన ఉన్న పెట్టుబడి అనుమతి కమిటీకి పంపిస్తామని తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని