‘పెట్టింది తినాలి..’ పెట్టకపోతే పస్తులుండాలి!

టోఫెల్‌ శిక్షణ, ట్యాబ్‌లూ, స్మార్ట్‌టీవీలంటూ అరచేతిలో స్వర్గం చూపే జగన్‌ సర్కారు... ట్రిపుల్‌ఐటీ విద్యార్థుల కడుపు మాడ్చుతోంది.

Updated : 08 Dec 2023 09:06 IST

జగన్‌ పాలనలో ట్రిపుల్‌ఐటీ విద్యార్థుల దుస్థితి
ఇంటి నుంచి ఆహారం తెప్పించుకున్న ఒంగోలు పిల్లలు
గతంలో నూజివీడులో భోజనం బాగోలేదని ఆందోళన
జగన్‌ బంధువు అధికారి కావడంతో చర్యలకు భయం
ఈనాడు, అమరావతి

టోఫెల్‌ శిక్షణ, ట్యాబ్‌లూ, స్మార్ట్‌టీవీలంటూ అరచేతిలో స్వర్గం చూపే జగన్‌ సర్కారు... ట్రిపుల్‌ఐటీ విద్యార్థుల కడుపు మాడ్చుతోంది. ‘పెట్టింది తినాలి.. పెట్టకపోతే పస్తులుండాలి.. గొంతెత్తితే మార్కుల్లో కోత’ ఇదీ ప్రస్తుతం ట్రిపుల్‌ఐటీ విద్యార్థుల దుస్థితి. విద్యార్థుల ఆకలి కేకలూ వినిపించుకోని సీఎం జగన్‌.. ప్రతి సభలోనూ వారికి ఏదో గొప్ప మేలు చేస్తున్నట్లు బాకా ఊదుతున్నారు.

ఒంగోలు ట్రిపుల్‌ఐటీలో ఈనెల 5న భోజనం లేక విద్యార్థులు ఆకలితో అలమటించారు. వండిన అన్నం అయిపోయిందని చెప్పడంతో ఆకలికి తట్టుకోలేక తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి, భోజనం పంపించమని అడిగారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ‘నాతోపాటు మరో ఇద్దరు స్నేహితులకు అన్నం, నీళ్ల సీసాలు పంపించే ఏర్పాటు చేయగలరా’ అని ఓ విద్యార్థిని ఫోన్‌ చేసి అడిగిందంటే ఆ తల్లిదండ్రులు ఎంత తల్లడిల్లిపోయి ఉంటారు! కానీ, జగన్‌ ప్రభుత్వానికి ఇవేమీ పట్టవు. జగన్‌ సీఎం అయిన తర్వాత తనకు బంధువయ్యే వ్యక్తిని తీసుకొచ్చి కీలక పదవిలో కూర్చోబెట్టారు. ఇక్కడ ఆయన చెప్పిందే వేదం. దీనిపై ఫిర్యాదులు వచ్చినా చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు హడలెత్తిపోతారు. గత కొంతకాలంగా ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం, ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీల్లో భోజనం, ఇతర సౌకర్యాలపై విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం మొద్దునిద్ర నటిస్తోంది.

వసతికి సమస్యే..

ఒంగోలు ట్రిపుల్‌ఐటీ భవనాల నిర్మాణానికి తెదేపా ప్రభుత్వం 2017లో పామూరు మండలం దూబగుంట వద్ద శంకుస్థాపన చేయగా.. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాణ స్థలాన్ని కనిగిరి మండలం బల్లపల్లికి మార్చేసింది. అంచనా వ్యయం రూ.1,200కోట్లు కాగా.. ఇంతవరకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. దీంతో పీయూసీ 1, 2 విద్యార్థులకు ఇడుపులపాయలో చదువు చెబుతున్నారు. మిగతా 4000 మందిని స్థానికంగా అద్దెకు తీసుకున్న భవనాల్లో ఉంచుతున్నారు. ఇడుపులపాయలో ఎనిమిది వేల మంది ఒకేచోట ఉండాల్సి వస్తోంది. కొందరు విద్యార్థినులను గతేడాది మార్చిలో ఇడుపులపాయలోని పాత క్యాంపస్‌లోకి మార్చడానికి ప్రయత్నించగా.. అక్కడికి వెళ్లబోమని రెండు రోజులపాటు ధర్నా చేశారు. పాత క్యాంపస్‌లో పాములు, తేళ్లు, విష కీటకాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. శాశ్వత భవనాల్లోనే వసతి కల్పించాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థులకు నచ్చచెప్పడంతో అప్పట్లో ఆందోళనలు విరమించారు.

శ్రీకాకుళంలో రూ.66.70కోట్లతో 2020లో అకడమిక్‌ బ్లాక్‌ నిర్మాణం మొదలుపెట్టారు. అది ఇంతవరకు పూర్తి కాలేదు. విద్యార్థులకు సరిపడా భవనాలు లేకపోవడంతో ఈ క్యాంపస్‌కు చెందిన 2వేల మందిని నూజివీడులో ఉంచుతున్నారు. రెండు క్యాంపస్‌లకు చెందిన 8వేల మంది ఒకేచోట ఉండడంతో నూజివీడులోనూ తరగతులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. తాత్కాలిక రేకుల షెడ్లలోనూ తరగతులు నిర్వహిస్తున్నారు.

వీసీ లేకుండానే..

నాలుగున్నరేళ్లుగా ట్రిపుల్‌ఐటీ వర్సిటీ రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ)కి ఉపకులపతినే నియమించలేదు. గతంలో దాదాపు రెండున్నరేళ్లపాటు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డిని ఇన్‌ఛార్జి వీసీగా కొనసాగించారు. ఇప్పుడు జేఎన్‌టీయూ, అనంతపురం ప్రొఫెసర్‌ విజయ్‌కుమార్‌ను ఇన్‌ఛార్జి వీసీగా కొనసాగిస్తున్నారు. ఇటీవల ఏకంగా ప్రైవేటు కళాశాలలకు చెందిన వారిని తీసుకొచ్చి శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ఐటీలకు డైరెక్టర్లుగా నియమించారు.


నీళ్లచారు.. చిమిడిన అన్నం..

చిమిడిన అన్నం.. రుచీపచీ లేని కూరలు.. పప్పులేని నీళ్ల చారు.. వీటిని తినలేక ఆకలితో అలమటిస్తున్నామని నూజివీడు విద్యార్థులు గత అక్టోబరులో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ట్రిపుల్‌ఐటీల్లో చదివేవారిలో ఎక్కువమంది పేద కుటుంబాలకు చెందినవారే. పేదల పక్షమనే సీఎం జగన్‌ ఆ పిల్లలకు నాణ్యమైన భోజనం అందించలేరా? మంచి ఆహారం పెట్టేందుకు నిధులు ఇవ్వలేరా? ప్రభుత్వం వసతి దీవెన కింద రూ.20వేలు చెల్లిస్తోంది. ఇది నాణ్యమైన భోజనం అందించేందుకు సరిపోవడం లేదని విద్యార్థుల నుంచి అదనంగా రూ.7వేల వరకు మెస్‌ ఛార్జీల పేరుతో ట్రిపుల్‌ఐటీలు వసూలు చేస్తున్నాయి. డబ్బులు చెల్లిస్తున్నా పిల్లలకు సరిపడా, నాణ్యమైన భోజనం అందించడం లేదు. వాళ్లు ఆందోళనలు చేసినా పరిస్థితుల్లో మార్పు ఉండడం లేదు. పైగా ఫిర్యాదు చేస్తామంటే అంతర్గత మార్కులు, ప్రాక్టికల్‌ పరీక్షల్లో కోత వేస్తామని భయపెడతారు.

 పెరుగులో పిండి కలుపుతున్నారంటూ గతంలో నూజివీడు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తనిఖీలు చేసిన రోజునే భోజనం బాగుంటుందని, ఆ తర్వాత మళ్లీ మామూలేనని ఆందోళన సమయంలో వెల్లడించారు. సాయంత్రం అందించే అల్పాహారం సైతం సరిపడా పెట్టడం లేదు. ఎదిగే వయసులో పోషకాలు అందకపోతే తీవ్ర అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ల చదువులేమవుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని