మీ ఓటు నమోదు చేసుకోండిలా..

ఒక్క ఓటు తేడాతో గెలుపోటములు తారుమారు కావచ్చు. అందునా రాబోయేవి రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే అత్యంత కీలకమైన ఎన్నికలు. ఈ పరిస్థితుల్లో ప్రతి ఓటూ కీలకమే.

Updated : 08 Dec 2023 05:08 IST

ప్రత్యేక సమగ్ర సవరణలో రేపటి వరకూ అవకాశం
తుది జాబితా విడుదలైన తర్వాత కూడా దరఖాస్తుకు వీలు

ఈనాడు, అమరావతి: ఒక్క ఓటు తేడాతో గెలుపోటములు తారుమారు కావచ్చు. అందునా రాబోయేవి రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే అత్యంత కీలకమైన ఎన్నికలు. ఈ పరిస్థితుల్లో ప్రతి ఓటూ కీలకమే. ఈ నేపథ్యంలో రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించే ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో తమ పేరుందా? లేదా? వెంటనే చూసుకోండి. లేకుంటే వెంటనే ఓటరు నమోదు కోసం దరఖాస్తు చేసుకోండి. కేంద్ర ఎన్నికల సంఘం ఏటా నిర్వహించే ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఇప్పటికే ముసాయిదా జాబితా విడుదలైంది.

దీనిపై అభ్యంతరాలు, క్లెయిమ్‌ల స్వీకరణకు ఈ నెల 9వ తేదీ వరకూ గడువు ఉంది. అప్పటిలోగా కొత్తగా ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవచ్చు. 10వ తేదీ నుంచి వీటి పరిష్కార ప్రక్రియ ప్రారంభమవుతుంది. అన్ని రకాలుగా అర్హతలుంటే జనవరి 5న విడుదలయ్యే తుది జాబితాలో మీ పేరు ఉంటుంది. మీరు దరఖాస్తు చేసుకున్నా తుది జాబితాలో మీ పేరు రాకపోయినా ఆందోళన అక్కర్లేదు. ఓటరుగా నమోదవటానికి ఆ తర్వాత కూడా అవకాశం ఉంటుంది.

నామినేషన్ల స్వీకరణ గడువు చివరి రోజు వరకూ దరఖాస్తు 

సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత నామినేషన్ల స్వీకరణ గడువు చివరి రోజూ వరకూ కొత్తగా ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవటానికి వీలుంది. ఓటు నమోదు కోసం వచ్చే దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఎన్నికల సంఘం వారికి ఓటు హక్కు కల్పిస్తుంది. తుది జాబితాకు అనుబంధంగా ఈ జాబితాను జత చేస్తారు. వారందరూ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.


ఏ దరఖాస్తు ఎందుకోసం?

ఫాం-6: కొత్తగా ఓటు నమోదు చేసుకోవటానికి

ఫాం-6ఏ: భారత పౌరసత్వం కలిగిన ప్రవాసులు ఓటరుగా చేరటం కోసం

ఫాం-7: ఓటర్ల జాబితాలో ప్రతిపాదిత చేర్పులపైన, ఇప్పటికే ఉన్న అనర్హుల పేర్లపైన అభ్యంతరం తెలిపేందుకు

ఫాం-8: ఇంటి చిరునామా మార్పు, ఓటర్ల జాబితాలో పేరు, ఫొటో, వయసు, ఓటరు గుర్తింపు కార్డు సంఖ్య, చిరునామా తదితర వాటిలో మార్పులు, సవరణల కోసం, దివ్యాంగ ఓటరుగా నమోదు చేసుకోవటం కోసం.


ఆన్‌లైన్‌ ద్వారా

విధానం-1:www.nvsp.in వెబ్‌సైట్‌లో మీ ఫోన్‌ నంబర్‌తో రిజిస్టర్‌ చేసుకుని లాగిన్‌ కావాలి. ‘రిజిస్టర్‌ యాజ్‌ ఏ న్యూ ఓటర్‌’ అనే విభాగంపై క్లిక్‌ చేస్తే ‘ఫాం-6: అప్లికేషన్‌ ఫాం ఫర్‌ న్యూ ఓటర్స్‌’ అనే ఉప విభాగం కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేస్తే ఆన్‌లైన్‌ దరఖాస్తు వస్తుంది. అందులో పేర్కొన్న వివరాలన్నీ నింపి సబ్మిట్‌ చేయాలి. ఆ తర్వాత మీ ఫోన్‌ నంబర్‌కు రిఫరెన్స్‌ ఐడీ నంబరు వస్తుంది. దాని ఆధారంగా ఇదే వెబ్‌సైట్‌లో ఆ దరఖాస్తు ఏ దశలో ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తులోని వివరాల ఆధారంగా బూత్‌ స్థాయి అధికారి మీ చిరునామాకు వచ్చి పరిశీలిస్తారు. అన్ని వివరాలు సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత ఓటరు జాబితాలో మీ పేరు చేరుస్తారు.

విధానం-2: https://voterportal.eci.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి తొలుత మీ ఫోన్‌ నంబర్‌తో రిజిస్టర్‌ చేసుకోవాలి. లాగిన్‌ అయ్యి వెబ్‌సైట్‌లోకి ప్రవేశించిన వెంటనే ‘న్యూ ఓటర్‌ రిజిస్ట్రేషన్‌’ అనే విభాగం ఉంటుంది. దానిపై క్లిక్‌ చేసుకుంటూ వెళ్లి.. దరఖాస్తులో అడిగిన వివరాలన్నీ నింపి సబ్మిట్‌ చేయొచ్చు.

విధానం-3: ప్లే స్టోర్‌లో భారత ఎన్నికల సంఘానికి సంబంధించిన VoterHelpline  మొబైల్‌ యాప్‌ ఉంటుంది. దాన్ని డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత మీ ఫోన్‌ నంబర్‌, వివరాలు పొందుపరిచి రిజిస్టర్‌ చేసుకోవాలి. వాటి ఆధారంగా లాగిన్‌ కావాలి. ‘ఓటరు రిజిస్ట్రేషన్‌’ విభాగంలోకి వెళితే ‘న్యూ ఓటర్‌ రిజిస్ట్రేషన్‌’ అనే ఆప్షన్‌ వస్తుంది. దానిపై క్లిక్‌ చేసుకుంటూ వెళ్లి.. అందులో అడిగిన వివరాలన్నీ నింపి దరఖాస్తు సబ్మిట్‌ చేయాలి.
విధానం-4: https://ceoandhra.nic.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి కూడా ఎన్‌వీఎస్‌పీ, ఓటర్‌ పోర్టల్‌ వెబ్‌సైట్‌ లింకుల్లోకి వెళ్లొచ్చు. ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.


ఆఫ్‌లైన్‌ ద్వారా

విధానం-1: బూత్‌ స్థాయి అధికారులకు (బీఎల్వోలకు) నేరుగా ఫాం-6 దరఖాస్తులు సమర్పించవచ్చు.

విధానం-2: ప్రతి నియోజకవర్గానికి డివిజన్‌ స్థాయి అధికారిని ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులు (ఈఆర్వో)గా ఎన్నికల సంఘం నియమించింది. వారి కార్యాలయాల్లోనూ దరఖాస్తులు సమర్పించొచ్చు. ప్రతి మండలంలోనూ స్థానిక తహసీల్దార్‌ లేదా డిప్యూటీ తహసీల్దార్‌ను అసిస్టెంట్‌ ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులు (ఏఈఆర్వోలు)గా నియమించింది. ఆ కార్యాలయాల్లోనూ దరఖాస్తులు ఇవ్వొచ్చు. వాటిపై విచారించి ఓటు హక్కు కల్పిస్తారు. 

 ఓటు హక్కు నమోదు సహా ఇతరత్రా ఏవైనా సందేహాలుంటే: 1950 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల మధ్య కాల్‌ చేయొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని