Telangana: విద్యుత్‌ సంస్థల అప్పులు రూ.81,516 కోట్లు

రాష్ట్రంలోని 4 విద్యుత్‌ సంస్థల అప్పులు, నష్టాలపై ఆ శాఖ ఉన్నతాధికారులు శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి జరిపిన అంతర్గత సమీక్షలో పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు.

Updated : 09 Dec 2023 07:57 IST

రెండు డిస్కంల నష్టాలు రూ.50,275 కోట్లు
సీఎంకు ప్రజంటేషన్‌ ఇచ్చిన విద్యుత్‌శాఖ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 4 విద్యుత్‌ సంస్థల అప్పులు, నష్టాలపై ఆ శాఖ ఉన్నతాధికారులు శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy) జరిపిన అంతర్గత సమీక్షలో పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం... రాష్ట్రంలోని రెండు విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు, విద్యుత్‌ సరఫరా సంస్థ (ట్రాన్స్‌కో)(Tstransco), విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో)(TSGENCO)తో కలిపి మొత్తం 4 సంస్థలకున్న అప్పులు తెలంగాణ ఏర్పడిన 2014-15 నాటికి రూ.22,423 కోట్లుంటే ఇప్పుడు రూ.81,516 కోట్లకు చేరాయి. వీటిలో విద్యుత్‌ కొనుగోలు చేసినందుకు బిల్లుల చెల్లింపుల కోసం డిస్కంలు తీసుకున్న స్వల్పకాలిక రుణాలే రూ.30,406 కోట్లున్నాయి. ఈ స్వల్పకాలిక రుణాల వల్ల నెలకు వడ్డీల రూపేణా రూ.1000 కోట్ల అదనపు భారం పడుతోంది. ప్రస్తుత డిసెంబరు నుంచి వచ్చే 2024 మే నెలాఖరుకు రాబోయే ఆరు నెలల్లో కరెంటు బిల్లులు వసూలు, ప్రభుత్వం నెలనెలా ఇచ్చే రాయితీతో కలిపి మొత్తం ఆదాయం రూ.22,781 కోట్లు ఉంటుంది. కానీ ఇదే ఆరు నెలల్లో ఖర్చులు రూ.33,839 కోట్ల వరకు ఉంటాయని డిస్కంల అంచనా. ఆదాయ, వ్యయాల మధ్య లోటు రూ.11,058 కోట్లు ఉంటుందని తేలింది. ఇప్పటికే రెండు డిస్కంల నష్టాలు రూ.50,275 కోట్లకు చేరాయి.

వ్యవసాయ విద్యుత్‌ వినియోగం లెక్కలే లేవు

వ్యవసాయానికి పూర్తి ఉచితంగా కరెంటు సరఫరా చేస్తున్నా.. వాస్తవంగా ఎన్ని యూనిట్లు వాడుతున్నారనే లెక్కలేమీ లేవని విద్యుత్‌ సంస్థలు ప్రభుత్వానికి తెలిపాయి. రాష్ట్రంలో మొత్తం 27.99 లక్షల వ్యవసాయ బోర్లకు కరెంటు కనెక్షన్లున్నాయి. రాష్ట్రం మొత్తం వినియోగంలో 40 శాతం వ్యవసాయానికి ఉండవచ్చనే అంచనా వేసి ప్రభుత్వం రాయితీ సొమ్ము ఇస్తోంది. రాష్ట్రంలో మొత్తం 1.82 కోట్ల కరెంటు కనెక్షన్లు ఉన్నాయి. తలసరి వార్షిక వినియోగం 2,349 యూనిట్లు.

నిరంతర సరఫరా చేయాలి

అన్ని వర్గాల వారికి నిరంతరం (24 గంటలూ) కరెంటు సరఫరా చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి డిస్కంలను ఆదేశించారు. ఎక్కడా రాజీ పడవద్దని స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీ హామీల అమల్లో భాగంగా ప్రతి ఇంటికీ నెలకు 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా సరఫరా చేయాల్సి ఉందని, దీనికి ఎంత వ్యయమవుతుందో శాస్త్రీయంగా అంచనాలు తయారు చేయాలని ఆయన ఆదేశించారు. అందరికీ 200 యూనిట్లు ఇస్తే ఏడాదికి దాదాపు రూ.4 వేల కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు చెల్లించాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్‌, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇటీవల రాజీనామా చేసిన ఉత్తర డిస్కం సీఎండీ గోపాలరావు, దక్షిణ డిస్కం సీఎండీ రఘుమారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇటీవల రాజీనామా చేసిన ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు ఈ సమీక్ష సమావేశానికి హాజరు కాలేదు. దీనిపై ప్రభాకరరావును ‘ఈనాడు’ ఫోన్‌లో సంప్రదించగా.. ప్రభుత్వం తనను రమ్మని పిలవలేదని.. పిలిస్తే సమావేశానికి వెళ్లేవాడినని ఆయన తెలిపారు.


ఎందుకీ అప్పులు, నష్టాలు...

  • ప్రధానంగా నిరంతర (24 గంటలూ) సరఫరాకు అవసరమైనంత విద్యుత్‌ రాష్ట్రానికి సొంతంగా లేదు. బయటి నుంచి ఎక్కువగా కొనాల్సి వస్తోంది. ఉదాహరణకు భారత ఇంధన ఎక్స్ఛేంజి (ఐఈఎక్స్‌)లో అధిక ధరలకు ఏ రోజుకారోజు కొనడం కోసం డిస్కంలు నెలకు రూ.500 కోట్లు వెచ్చిస్తున్నాయి. వీటికితోడు గత తొమ్మిదేళ్లలో రాష్ట్రంలో కొత్తగా ఉత్పత్తి ప్రారంభించిన కొత్తగూడెం 7వ దశ, భద్రాద్రి, ఎన్టీపీసీ ప్లాంటు నుంచి కరెంటు కొనడానికి అధికంగా వెచ్చించాల్సి వస్తోంది.
  • అన్నివర్గాల వారు వాడే కరెంటుకు నెలనెలా చెల్లించే బిల్లుల రూపంలో రూ.2,800 కోట్ల ఆదాయం మాత్రమే డిస్కంలకు వస్తోంది. వ్యవసాయానికి, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పూర్తి ఉచితంగా, మరికొన్ని వర్గాలకు తక్కువ ధరలకు ప్రభుత్వం కరెంటును సరఫరా చేస్తోంది. ఈ రాయితీల కోసం రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు ప్రతి నెలా మొదటివారంలో రూ.958 కోట్లు విడుదల చేస్తోంది. ఈ రెండూ కలిపితే మొత్తం నెలవారీ ఆదాయం రూ.3,758 కోట్లు అని తేలింది.
  • కరెంటు కొన్నందుకు డిస్కంలు నెలనెలా విద్యుదుత్పత్తి సంస్థలకు రూ.3,305 కోట్లు చెల్లించాలి. ఇవి కాకుండా గతంలో తీసుకున్న అప్పులు, వడ్డీల వాయిదాలకు నెలకు రూ.1,457 కోట్లు కట్టాలి. ఈ రెండూ కలిపితే ఖర్చులు రూ.4762 కోట్లు అవుతోంది. ఇవికాకుండా అప్పుడప్పుడు అనూహ్యంగా కరెంటు డిమాండు పెరిగితే అదనపు వ్యయం తప్పదు.
  • థర్మల్‌ కేంద్రాలకు అవసరమైన బొగ్గును రోజూ దాదాపు 50 వేల టన్నుల వరకు కొంటున్నారు. టన్నుకు సగటున రూ.4,750 చొప్పున ధర చెల్లించి కొంటుండగా.. దాన్ని బొగ్గు గనుల నుంచి థర్మల్‌ కేంద్రంవద్దకు చేర్చడానికి టన్నుకు రూ.240 చొప్పున అదనంగా రవాణా వ్యయం భారం పడుతోంది.
  • సింగరేణి గనుల నుంచి బొగ్గును కొంటున్నా ఆ సంస్థకు ఎప్పటికప్పుడు సొమ్ము చెల్లించడం లేదు. రాష్ట్ర జెన్‌కో కొన్న బొగ్గుకు సింగరేణికి చెల్లించాల్సిన బకాయిలు రూ.6,800 కోట్లకు చేరాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని