Nirmala Sitharaman: ఏపీ ఆర్థిక పరిస్థితులపై ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నాం

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ఏపీ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు, హెచ్చరికలు జారీచేస్తున్నామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ తెలిపారు. లోక్‌సభలో సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎంపీ రామ్మోహన్‌నాయుడు అడిగిన ప్రశ్నకు నిర్మలా సీతారామన్‌ ఈ సమాధానమిచ్చారు.

Updated : 06 Feb 2024 13:16 IST

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడి
ఎంపీ రామ్మోహన్‌నాయుడి ప్రశ్నకు సమాధానం

ఈనాడు, దిల్లీ: రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ఏపీ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు, హెచ్చరికలు జారీచేస్తున్నామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ తెలిపారు. లోక్‌సభలో సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎంపీ రామ్మోహన్‌నాయుడు అడిగిన ప్రశ్నకు నిర్మలా సీతారామన్‌ ఈ సమాధానమిచ్చారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 293 అవకాశం కల్పించిందన్నారు. ఎంపీ రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ.. ‘ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేస్తున్న ఆర్థిక దుర్వినియోగం వల్ల నాలుగేళ్లుగా రాష్ట్రం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించడంలేదు. రహదారుల నిర్మాణం లాంటి మౌలిక వసతుల కల్పన కోసం పైసా ఖర్చుచేయలేదు. అంతేకాకుండా ప్రభుత్వరంగ కార్పొరేషన్లను అడ్డంపెట్టుకొని అప్పులు తీసుకుంటోంది. ఇలా ఒకవైపు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తోస్తూ మరోవైపు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితుల నుంచి తప్పించుకొనే ప్రయత్నం చేస్తోంది.

మద్య నిషేధం చేస్తామని చెప్పి.. మరోవైపు అదే మద్యం కార్పొరేషన్‌ ఆదాయాన్ని తాకట్టుపెట్టి రాష్ట్ర ప్రభుత్వం రుణం తీసుకుంది. ఒకవేళ రాష్ట్రం ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోతే కేంద్ర ప్రభుత్వ బాధ్యత ఏమిటి? రాష్ట్రాన్ని ఆర్థిక క్రమశిక్షణలో పెట్టడానికి ఏం చర్యలు తీసుకుంటారు’ అని  ప్రశ్నించారు. ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటికీ ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌ ఎఫ్‌ఆర్‌బీఎం యాక్ట్‌ గురించి అసెంబ్లీ చూసుకుంటుంది. ఆ చట్టానికి అనుగుణంగా అక్కడ చర్చలు చేపడతారు. కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగం కల్పించిన అధికారం మేరకు రాష్ట్రాలకు మేము ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు, హెచ్చరికలు జారీ చేస్తున్నాం. తగిన చర్యలు తీసుకుంటున్నాం’ అని నిర్మలా సీతారామన్‌ వివరించారు.

జీఎస్‌టీ వృద్ధిరేటు ఇటీవల కాలంలో మందగించిన నేపథ్యంలో దానిపై ఆధారపడిన ఆంధ్రప్రదేశ్‌ లాంటి రాష్ట్రాల ఆర్థిక స్థిరత్వానికి కేంద్ర ప్రభుత్వం ఏదైనా అదనపు చర్యలు తీసుకుంటోందా అని వైకాపా ఎంపీ మిథున్‌రెడ్డి లిఖితపూర్వకంగా అడిగిన ప్రశ్నకు ఆర్థికమంత్రి బదులిస్తూ జీఎస్‌టీ ద్వారా ఆదాయం క్రమంగా పెరుగుతోందే తప్ప తగ్గడం లేదన్నారు. ప్రస్తుత ఆర్థికసంవత్సరం తొలి 10నెలల్లోనే 11.6% వృద్ధిరేటును నమోదు చేసినట్లు గుర్తుచేశారు. ఏపీ ప్రభుత్వానికి 2017 జులై నుంచి 2022 జూన్‌ వరకు జీఎస్‌టీ పరిహారం కింద రూ.19,021 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని