అభినవ అప్పుల అప్పారావులు!

ప్రతిపక్షంలో ఉండి ఎన్నెన్నో అన్నారు! అప్పు ముప్పన్నారు.. తప్పుతప్పన్నారు! అభినవ ఆర్థిక వేత్తలుగా మారిపోయారు!! అధికారమిస్తే ఎన్నెన్నో చేస్తామన్నారు! ప్రజా శ్రేయోభిలాషుల్లా పోజులిచ్చారు.

Updated : 22 Feb 2024 07:59 IST

నాడు ఆర్థిక సంస్కర్తలుగా గొప్పలు
ఇప్పుడు ఇష్టారీతిన అప్పులు
జవాబుదారీతనం కనిపించని చేతలు
ప్రశ్నించే వారిపై అక్కసు

నాడు!!

ప్రతిపక్షంలో ఉండి ఎన్నెన్నో అన్నారు!
అప్పు ముప్పన్నారు.. తప్పుతప్పన్నారు!
అభినవ ఆర్థిక వేత్తలుగా మారిపోయారు!!
అధికారమిస్తే ఎన్నెన్నో చేస్తామన్నారు!
ప్రజా శ్రేయోభిలాషుల్లా పోజులిచ్చారు..

నేడు!

అధికారంలోకి వచ్చాక అన్నీ మరచిపోయారు!
లెక్కకు మిక్కిలి అప్పులు చేస్తున్నారు!
కొత్తదారుల్లో రుణాలు పుట్టిస్తున్నారు!
జీతాలు, పింఛన్లు ఇష్టమొచ్చినప్పుడు ఇస్తున్నారు!
అనుయాయుల బిల్లులే చెల్లిస్తున్నారు!!

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలను గత పది సంవత్సరాలుగా పరిశీలిస్తున్న వారిని ఎవరినైనా... అప్పుడు ఒకలా చెప్పి, ఇప్పుడు మరోలా ప్రవర్తిస్తున్నది ఎవరని అడిగితే ఠక్కున సమాధానం చెప్పేస్తారు. ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నానా  కష్టాల్లో ఉన్న రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా జగన్‌, ప్రజాపద్దుల కమిటీ అధ్యక్షుడిగా బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి... ఇద్దరూ రాష్ట్ర ఖజానాకు తామే రక్షకులమన్నట్లు ఎన్నో సుద్దులు చెప్పారు. నాడు వీరిద్దరూ ఆర్థికవేత్తల పాత్రలను పోషిస్తూ... అప్పటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చేయని విశ్లేషణ లేదు... చెప్పని మాట లేదు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోందని, అంతా రహస్య పాలన సాగుతోందని, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి దాటిపోయి మరీ ఆంధ్రప్రదేశ్‌ అప్పులు చేస్తోందని నానాయాగీ చేశారు. చంద్రబాబు సర్కారును కాగ్‌ తీవ్రంగా ఆక్షేపిస్తోందనీ విమర్శలు కురిపించారు. తాము అధికారంలోకొస్తే ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితిని అద్భుతంగా మారుస్తామని, అప్పులు చేయకుండానే రాష్ట్రాన్ని పాలిస్తామనే స్థాయిలో ప్రజలను విజయవంతంగా నమ్మించారు. తర్వాత... జగన్‌ ముఖ్యమంత్రి అయ్యారు. బుగ్గన ఆర్థిక మంత్రి అయ్యారు. అంతే, నాటి అభినవ ఆర్థికవేత్తలిద్దరూ కొత్త ఆర్థిక పాఠాలు చెప్పడం ప్రారంభించారు. రాష్ట్రంపై అప్పుల భారాన్ని మోపడంలో జగన్‌ రికార్డు సృష్టించారు. బుగ్గన ఏకంగా... ‘‘అప్పు చేస్తే తప్పేముందండీ’’ అని ప్రశ్నించసాగారు. ‘‘ఉద్యోగుల జీతాలకు, పింఛన్లకు తొందరేమొచ్చింది. నెలలో ఎప్పుడో అప్పుడు ఇస్తున్నాం కదా. పెండింగు బిల్లులనూ ఈ సర్కారులోనో, వచ్చే సర్కారులోనో ఇస్తాం కదా’’ అన్నట్లుగా మాట్లాడేస్తున్నారు. దివాలా తీసిన కంపెనీని అప్పులోళ్లు చుట్టుముట్టినట్లు... ఆర్థిక శాఖ అధికారుల చుట్టూ కాంట్రాక్టర్లు తిరుగుతుంటే, బకాయిలపై నిలదీస్తుంటే పోలీసుభద్రత మధ్య ముఖం చాటే సుకుని తిరుగు తున్నారు.


ఆర్థిక మంత్రి బుగ్గనదీ అదే శైలి!

వైకాపా 2014-19 మధ్య ప్రతిపక్షంలో ఉండగా బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అనేక సందర్భాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై మాట్లాడేవారు. ‘‘రాష్ట్ర అప్పు పరిస్థితి ఎక్కడికి పోతోంది? మీరసలు ఇంత అప్పును ఎందుకు చేస్తున్నారు? వాటిని కట్టేది ఎవరండీ? పన్నులు చెల్లిస్తున్న మనందరమే కదా. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి  తీసుకువెళ్లిపోయి అదేదో గొప్ప పని చేసినట్లుగా చెబుతున్నారు. ఇది పద్ధతి కాదు. విపరీతమైన అప్పులు చేయడం మానుకోండి...’’ అని నాటి తెదేపా సర్కారును ఉద్దేశించి విమర్శలు చేసేవారు.


రుణం తేవడం తప్పే కాదట!!

‘‘ప్రజల కోసమే అప్పులు చేస్తున్నాం. అప్పు చేస్తే తప్పేముంది. డబ్బు అవసరం వచ్చినందుకు అప్పులు చేశామని గర్వంగా చెబుతున్నాం. సామాన్యుడిని కాపాడేందుకు, పరిపాలన కోసమే అప్పులు చేయాల్సి వచ్చింది. మనం ఒక్కళ్లమే కాదు... అంతా రుణాలు తీసుకుంటున్నారు. ప్రపంచంలో అప్పు చేయని ఒక దేశం పేరు చెప్పండి. 2016-17 నుంచి స్థూల ఉత్పత్తిలో రుణాల శాతం గమనిద్దాం. మామూలుగా 28% ఉండేది. ఇప్పుడు 30% దాటింది. మనతోపాటు చాలా రాష్ట్రాలు అప్పులు చేస్తున్నాయి. మనమేమీ అత్యుత్తమంగా ఉన్నామని చెప్పడం లేదే...’’

(2019 నుంచి ఆర్థిక మంత్రిగా బుగ్గన చేస్తున్న వ్యాఖ్యలివీ)


ప్రతిపక్ష నేతగా జగన్‌ నాడు ఏం చెప్పారంటే..!

1) ‘‘ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిని దాటి అప్పులు తీసుకునే, నిధులు వాడుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడిది? నిబంధనలకు లోబడి జీఎస్‌డీపీలో 3% వరకు మాత్రమే రుణాలు తీసుకోవాలి. చంద్రబాబు ప్రభుత్వం 8% వరకు అప్పులు చేస్తోంది. ఇది ప్రభుత్వమా లేక ప్రయివేటు రంగ సంస్థా? ప్రభుత్వం బడ్జెట్‌ లెక్కలనూ తారుమారు చేస్తోంది..’’

(2016 మార్చి 17న బడ్జెట్‌ సమావేశాల సందర్బంగా శాసనసభ లాబీలో మీడియాతో మాట్లాడుతూ జగన్‌ విమర్శలు)


మరిప్పుడు రోజూ అప్పులేగా...!

ఇప్పుడు ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి అన్న మాటకు అర్థమే లేకుండా చేశారు. ప్రతి సంవత్సరం ఈ చట్టాన్ని తమకు అనుగుణంగా సవరించుకుంటున్నారు. దాంతో ఆంధ్రప్రదేశ్‌ అప్పులను కాగ్‌ తప్పు పడుతోంది. కేంద్రం కూడా ఏపీ ఆర్థిక వ్యవహారాలు రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నాయంది. జగన్‌... కొత్తగా ప్రభుత్వ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటి పేరిట రూ.వేల కోట్ల అప్పులు పుట్టిస్తున్నారు. వాటిని ప్రభుత్వ అప్పులుగా చూపరు. పైగా అవే అప్పులను తీర్చేందుకు రాష్ట్ర బడ్జెట్‌లో గ్రాంట్ల రూపంలో నిధులిస్తున్నారు. అంతెందుకు ప్రతినెలా రిజర్వు బ్యాంకు వద్ద విపరీతంగా చేబదుళ్లు తీసుకుంటున్నారు. బహిరంగ మార్కెట్‌ నుంచి రుణం తీసుకుని మరీ ఆయా అప్పులను తీరుస్తున్నారు. అప్పు లేకుండా రాష్ట్ర ఆర్థిక నావ నడవలేని దుస్థితికి తెచ్చారు.


2. ‘‘రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ, వ్యయాల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచాలి. అర్థవంతమైన చర్చలకు వీలు కల్పించాలంటే పూర్తి సమాచారం అందుబాటులో ఉండాలి. కేంద్ర ప్రభుత్వం వివిధ మంత్రిత్వ శాఖల తాజా సమాచారాన్ని వాటి     వెబ్‌సైట్లలో ఉంచుతోంది. ప్రతినెలా పన్నులు, పన్నేతర రాబడులు, కేంద్రం నుంచి తీసుకున్న రుణాలు, ఇతర  రాబడులు, రాబడిలో లోటు, ద్రవ్యలోటు, ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయం వంటి వివరాలు ఎప్పటికప్పుడు ప్రభుత్వమూ తన వెబ్‌సైట్‌లో ఉంచాల్సిందే. ప్రస్తుత ప్రభుత్వమూ  అకౌంటింగ్‌ వ్యవస్థను కంప్యూటరైజ్‌ చేసినందున అంశాల వారీగా ఆయా వివరాలను వెల్లడించేందుకు ఇబ్బందులు ఏమీ ఉండవని భావిస్తున్నా’’

(2014 డిసెంబరులో అప్పటి సీఎం చంద్రబాబుకు ప్రతిపక్ష నాయకుడి హోదాలో వైఎస్‌ జగన్‌ రాసిన లేఖలో చేసిన డిమాండ్లు ఇవీ.)


పారదర్శకతకు పాతరేశారేం జగన్‌?

ప్రస్తుత జగన్‌ సర్కారులో అన్నీ రహస్యాలే. కార్పొరేషన్లకు ఎంత మొత్తం గ్యారంటీ ఇచ్చారు? ఎన్ని అప్పులు తెచ్చారనే విషయాన్ని ఎప్పుడూ బయటపెట్టరు. ఏ లెక్కల్లోనూ పారదర్శకత లేదు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సమర్పించిన లెక్కలను ప్రతినెలా కాగ్‌ పరిశీలించి తన వెబ్‌సైట్‌లో వెలువరిస్తుంటుంది. ప్రభుత్వ గ్యారంటీల ద్వారా ఎంత రుణం తెచ్చారు? ఎంత రుణం తీర్చారు. ఎంత రుణాన్ని     వినియోగించారన్న వివరాలు తాము కోరినా... ఏపీ సర్కారు ఇవ్వడం లేదని కాగ్‌ ప్రతినెలా అంటున్నా వీరిలో చలనం లేదు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గ్యారంటీల ద్వారా తెచ్చిన రుణాల వివరాలను సైతం కాగ్‌కు సమర్పిస్తున్నాయి. ఆయా వివరాలను కాగ్‌ తన వెబ్‌సైట్‌లో స్పష్టంగా పొందుపరుస్తోంది. ఏపీ ప్రతిపక్ష నాయకుడిగా పారదర్శకతపై లేఖలు రాసిన జగన్‌ మరిప్పుడు ఎందుకా విషయాన్ని విస్మరిస్తున్నారు? తెదేపా ప్రభుత్వ హయాంలో సీఎం డ్యాష్‌బోర్డులో అన్ని ప్రభుత్వ శాఖల సమాచారమూ ప్రజలకు అందుబాటులో ఉండేది. ఆ సమాచారాన్ని నిత్యం నవీకరించేవారు. ఇప్పుడు జగన్‌ సర్కారులో అంతా రహస్యం. పబ్లిక్‌ అకౌంట్‌ నుంచి ఎంత మొత్తం రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంటోందో కూడా చెప్పాలని కాగ్‌ ప్రతినెలా అడుగుతోంది. ఆ లెక్కలనూ వెల్లడించడం లేదు.


ఈనాడు, అమరావతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని