మళ్లీ జగన్‌ గెలిస్తే జనాలను బతకనిస్తారా!?

అఫ్గానిస్థాన్‌లోని తాలిబాన్లను మించిన అరాచకం రాష్ట్రంలో రాజ్యమేలుతోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌, ఉత్తర కొరియా అధినేత కిమ్‌ను మించిన నియంతగా సీఎం జగన్‌ మారారు. ప్రతిపక్షాలు గళం ఎత్తకూడదు.

Updated : 22 Feb 2024 11:36 IST

రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది
పుతిన్‌, కిమ్‌లను మించిపోతున్నజగన్‌
‘ఈటీవీ - ప్రతిధ్వని’ చర్చలో వక్తల అభిప్రాయం

అఫ్గానిస్థాన్‌లోని తాలిబాన్లను మించిన అరాచకం రాష్ట్రంలో రాజ్యమేలుతోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌, ఉత్తర కొరియా అధినేత కిమ్‌ను మించిన నియంతగా సీఎం జగన్‌ మారారు. ప్రతిపక్షాలు గళం ఎత్తకూడదు. మీడియా కలం చూపకూడదు. ప్రజలు నోరు తెరవకూడదు. కోర్టులు, ఎన్నికల సంఘం ప్రశ్నించడాన్ని సహించరు. ఎవరన్నా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే భరించరు. భౌతికదాడులు చేయడానికి వైకాపా మూకలు ఆయుధాలతో నడిరోడ్డుపై స్వైరవిహారం చేస్తాయి. అనుచరగణాలు కబ్జాలు చేస్తాయి. ప్రభుత్వ చెప్పుచేతల్లోని విచారణ సంస్థలు పనిచేస్తాయి. గిట్టనివారి వ్యాపారాలపై దాడులు చేస్తాయి. ‘మళ్లీ గెలిస్తే జనాల్ని బతకనిస్తారా?’ అనే అంశంపై బుధవారం ‘ఈటీవీ- ప్రతిధ్వని’ చర్చ నిర్వహించింది. ఇందులో పాల్గొన్న వక్తలు వారి అభిప్రాయాలను వెల్లడించారు.


గతంలో లేని రాజకీయ సంస్కృతి  
- కందుల రమేష్‌, సీనియర్‌ పాత్రికేయుడు

ముఖ్యమంత్రిగా జగన్‌ వచ్చిన తర్వాత అసమ్మతి స్వరాలు వినిపించకూడదనే కొత్త సంస్కృతిని తీసుకొచ్చారు. వ్యవస్థలన్నీ తన చేతిలో ఉన్నాయని, తాను చెప్పిందే జరగాలని, చేసిందే విధానం అనే పరిస్థితి తీసుకొచ్చారు. ప్రతిపక్ష నాయకుల మీద దాడులు చేయడం, కేసులు పెట్టడం ప్రారంభించారు. ఎవరైనా వ్యతిరేక స్వరం వినిపిస్తే జైలే గతి. భౌతికదాడుల నుంచి తప్పించుకోలేరనే భయానక వాతావరణం రాష్ట్రమంతటా వ్యాప్తి చేశారు. ఈ తరహా రాజకీయ సంస్కృతి గతంలో ఎన్నడూ లేదు. మంగళగిరిలోని తెదేపా ప్రధాన కార్యాలయంపై దాడి దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమై ఆధారాలున్నా వారిపై నేటికీ చర్యలు లేవు. ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీదకు వెళ్లి తలుపులు పగలకొట్టేందుకు నాయకత్వం వహించిన ఎమ్మెల్యేకు నజరానాగా మంత్రి పదవిని కట్టబెట్టారు. డజన్ల కొద్దీ కేసులు, ఏడాదిన్నర జైలులో ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి తన ప్రవృత్తికి తగ్గట్లుగానే మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ‘చంద్రబాబును కాల్చి చంపాలి’.. ‘నడిరోడ్డుపై ఉరి తీయాలి’ అంటూ హింసను ప్రేరేపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అభిమానులకు బీపీ వచ్చి దాడులు చేశారంటూ రాజ్యాంగ పదవిలో ఉండి మాట్లాడడం సరికాదు. జగన్‌ ప్రభుత్వంలో విచిత్రాలు, అకృత్యాలు, ఘోరాలు, నేరాలు అనేకం చూస్తున్నాం. సొంత చిన్నాన్నను హత్య చేసిన కేసులో సీఎం సోదరుడు, వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డిని అరెస్ట్‌ చేయటానికి కర్నూలు వచ్చిన సీబీఐ ఆ పని చేయలేకపోయింది. దేశ చరిత్రలో సీబీఐకి అలాంటి పరిస్థితి రావడం ఇదే ప్రథమం. జగన్‌ అండతో పోలీసు వ్యవస్థ మొత్తం ఆయన పాదాక్రాంతమైంది. ప్రజల ఓట్లతో అపరిమితమైన అధికారాన్ని జగన్‌కు కల్పించారు.

మళ్లీ వస్తే నియంతృత్వమే..

తనకు అధికారం ఇస్తే ఏం చేస్తాననేది ఇప్పటికే జగన్‌ ప్రజలకు రుచి చూపారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఇంతకు మించి నియంతృత్వంలో కొత్త పోకడలు, మాఫియా రాజ్యం ప్రత్యక్షంగా చూపిస్తారు. తమది హింసా ప్రవృత్తి, మాఫియా మనస్తత్వం, రక్తపిపాసి భావన అని చాటుతారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన ప్రభుత్వం ఇలాంటి వ్యవహారాలను ప్రోత్సహించకపోవడం వల్లే జగన్‌ స్వేచ్ఛగా పాదయాత్ర చేశారు. అప్పటి ప్రభుత్వం, ముఖ్యమంత్రిపై ఇష్టారాజ్యంగా విమర్శలు చేశారు. ఇప్పుడు ఎవరు విమర్శించినా వ్యక్తిగతంగా దాడులు చేయిస్తున్నారు. గతంలో ప్రభుత్వాలు రాజ్యాంగానికి, చట్టానికి లోబడి, సంప్రదాయాలను గౌరవించాయి. వాటికి జగన్‌ వల్ల తీవ్ర నష్టం జరిగింది. ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రతిపక్షాలను నాశనం చేయాలి, ఇష్టంలేని శక్తులను, వర్గాలను అణచివేయాలి, ఇందుకు అధికారాన్ని తీవ్రంగా ఉపయోగించుకోవాలి అనే కొత్త ప్రజాస్వామ్య వ్యతిరేక భావనలను జగన్‌ పాలన నేర్పిస్తోంది. ప్రభుత్వం మారితే వైకాపా నేతల అరాచకాలపై కేసులు నమోదు చేస్తే వారంతా తీవ్రమైన శిక్షలకు గురికావాల్సి ఉంటుంది. మరోసారి జగన్‌కు ఓటు వేసి గెలిపిస్తే ఎన్నికల ద్వారా విజయం సాధించి నియంతగా వ్యవహరించడం ఎలా? అనే విషయంలో సీఎం పీహెచ్‌డీ పొందినట్లే అనుకోవాలి. పోలీసులపై ఫిర్యాదులు చేసేందుకు ఉన్న పోలీసు కంప్లయింట్‌ అథారిటీ నిర్వీర్యమైంది. అంతా కోర్టుల మీద ఆధారపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై నమోదవుతున్న వందల సంఖ్యలో కేసుల్లో చాలావాటికి కోర్టు ధిక్కరణకు పాల్పడుతూ న్యాయస్థానాల ఆదేశాలను సైతం అమలు చేయడంలేదు. ఇదే పరిస్థితి కొనసాగితే జగన్‌ అరాచకం ముందు ప్రజలు విలవిలలాడిపోతారు. ప్రతిపక్షాలను రాచి రంపాన పెడతారు. గతంలో రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో కనిపించి, మరుగున పడుతోందనుకున్న ఫ్యాక్షన్‌ సంస్కృతి రాష్ట్రమంతటా వ్యాప్తి చెందుతుంది. సమీప భవిష్యత్తులో ప్రజలు తేరుకునే అవకాశం ఉండదు.


తాలిబాన్లు సైతం దిగదుడుపు
- ముప్పాళ్ల సుబ్బారావు, ఏపీ పౌరహక్కుల సంఘం అధ్యక్షులు

విచారణ సంస్థలను చెప్పుచేతల్లో పెట్టుకుని ప్రతిపక్షాలు, సంస్థలపై దాడులు చేయడం నిలువునా నియంత పాలనకు నిదర్శనం. దాడులకు పాల్పడిన వారి దృశ్యాలు, చిత్రాలు బయటికొచ్చినా బాధ్యులను అరెస్టు చేయడానికి దర్యాప్తు సంస్థలకు చట్టాలు గుర్తుకురావడంలేదు. అల్లరిమూకలకు అధికార పార్టీ పూర్తిగా అండదండలు అందిస్తోంది. ప్రభుత్వాన్ని విమర్శించే పాత్రికేయులపై దేశద్రోహం కేసులు కూడా పెడుతున్నారు. తాలిబ్లను సైతం జగన్‌ ముందు దిగదుడుపే. ఎవరైనా విమర్శిస్తే తమ కార్యకర్తలు, నాయకులు, సానుభూతిపరులు తిరగబడతారని స్వయంగా ముఖ్యమంత్రి జగన్‌ చెబుతున్నారు. సాధారణంగా ఏ నాయకుడైనా సంయమనం పాటించాలని హితవు పలుకుతారు. జగన్‌ మాటలు హింసను, ఉద్రిక్తతలను ప్రోత్సహించేలా ఉంటున్నాయి. ప్రతిపక్ష నేతగా అదే ధోరణి. ఇప్పటికీ ఆ భావనలో మార్పు లేదు. అనంతపురం తర్వాత వరుసగా రెండు సంఘటనలు జరిగాయి. సీఎం, వైకాపా నేతలు ఆలోచన ధోరణిలో ఫ్యాక్షన్‌ భావజాలమే కనిపిస్తోంది. రాష్ట్రంలోని ఏ వ్యవస్థా స్వతంత్రంగా పనిచేయలేకపోతోంది. వాటిని నిర్వీర్యం చేశారు. ఫ్యాక్షన్‌ పోకడలు, ముద్దాయి ఆలోచనలు, సంస్కృతిని జగన్‌ కొనసాగిస్తున్నారు. కంచే చేను మేసినట్లుగా.. చట్టాలను రక్షించాల్సిన వారే ఆ పని తమది కాదన్నట్లుగా పాలకుల చేతిలో కీలుబొమ్మల్లా, పార్టీ కార్యకర్తల్లా మారిపోయారు. బాధితులకు బదులు పోలీసులే ఫిర్యాదులు చేసి మరీ కేసులు పెడుతున్నారు. అర్ధరాత్రి వేళ ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయడం ద్వారా రాజకీయంగా వారిని అణగదొక్కాలని చూస్తున్నారు.

అధికారులూ అదే బాటలో..

హిట్లర్‌ కూడా ముఖ్యమంత్రి ఎదుట దిగదుడుపే. పాలకులతోపాటు అధికారులు కూడా ప్రజావ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నారు. ‘ఈనాడు’కు ఆర్థిక ఇబ్బందులు కలిగించాలనే మార్గదర్శి సంస్థపై దాడులు చేశారు. న్యాయస్థానాల ఆదేశాలను ఉల్లంఘించి మరీ బ్రాంచి మేనేజర్లను అరెస్టు చేశారు. పత్రికా స్వేచ్ఛ ఉండాలని అంతా ఆకాంక్షిస్తుంటే- అలాంటి వ్యవస్థపై దాడులు చేసేలా అధికార పార్టీ నేతలను ప్రోత్సహిస్తున్నారు. గత ఎన్నికల్లో గంపగుత్తుగా దళితులు జగన్‌కు ఓట్లేశారు. దానికి ప్రతిఫలంగా డాక్టరు సుధాకర్‌ నుంచి సుబ్రమణ్యం వరకు దళితులపై దాడులు, హత్యలు చేశారు. ఇసుక మాఫియాను దళితులు అడ్డుకుంటే వారిపై కేసులు పెడుతున్నారు. సీతానగరంలో ఓ దళిత యువకుడికి శిరోముండనం చేశారు. రాష్ట్రపతికి లేఖ రాసి నక్సలైట్లలో కలిసిపోతానన్నా అతనికి దిక్కులేదు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్సీ ఓ వ్యక్తిని హత్య చేసి డోర్‌ డెలివరీ చేసినట్లు ఆరోపణలు వస్తే ఆయనకు బెయిల్‌ ఇప్పించడమే కాకుండా ఊరేగింపులు జరిపించారు.

అయ్యా.. ఎస్‌

ఐఏఎస్‌ అధికారులు పలువురు అయ్యా..ఎస్‌ అంటుంటే.. ఐపీఎస్‌ అధికారులు కొందరు నీ బాంచన్‌ దొర అంటూ మొక్కుతున్నారు. మా ఖాతాలో డబ్బులు వేస్తున్నాడు కదా అనే అపోహతో వైకాపాకు ఓటు వేస్తే భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించలేం. రాష్ట్రం అప్పుల ఆంధ్రాగా మారింది. ఉద్యోగాలు లేవు. పనులు చేద్దామన్నా అవకాశం లేదు. కొత్త పరిశ్రమలు రావడంలేదు. స్వయం ఉపాధి చేసుకోవాలన్నా అవకాశాలు లేవు. నియంత పాలన కొనసాగితే ప్రజల ఆస్తులను అప్పనంగా ఆక్రమించుకుంటారు. భావవ్యక్తీకరణ స్వేచ్ఛను నాశనం చేస్తారు. రాజ్యహింసకు అడ్డు లేకుండాపోతుంది. మేధావులు, పారిశ్రామికవేత్తలు వంటి వారు వేరే చోటకు తరలిపోయే ప్రమాదం ఉంది.


ఈటీవీ, అమరావతి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని