జగన్‌ ప్రభుత్వ పరపతి ఢమాల్‌

జగన్‌ ప్రభుత్వ పరపతి మట్టికొట్టుకుపోయింది. ముఖ్యమంత్రిగా ఆయన పాలనాతీరుపై గుత్తేదారులకు పూర్తిగా నమ్మకం పోయినట్టుంది.

Updated : 25 Feb 2024 08:58 IST

రెండో విడత దివ్యాంగుల మోటారు వాహనాల పంపిణీకి బ్రేక్‌
3సార్లు టెండర్లు పిలిచినా ముందుకు రాని గుత్తేదారులు

ఈనాడు - అమరావతి: జగన్‌ ప్రభుత్వ పరపతి మట్టికొట్టుకుపోయింది. ముఖ్యమంత్రిగా ఆయన పాలనాతీరుపై గుత్తేదారులకు పూర్తిగా నమ్మకం పోయినట్టుంది. ఏటా వేల కోట్ల బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నామంటూ జగన్‌ చాటింపు వేసుకోవడమేగానీ.. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కనీసం రూ.20 కోట్లు, రూ.30 కోట్ల విలువైన టెండర్లలో పాల్గొనేందుకు కూడా గుత్తేదారులు ఎవరూ ముందుకు రాని పరిస్థితి దాపురించింది. అధికారులు బతిమలాడుతున్నా జగన్‌ ప్రభుత్వానికో నమస్కారమంటూ దండం పెట్టేస్తున్నారు. దివ్యాంగులకు రెండో విడతగా 1,750 రెట్రోఫిటెడ్‌ మోటారు వాహనాలు అందించేందుకు ప్రభుత్వం ఇటీవల పిలిచిన టెండర్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.  ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అంటూ సర్కారు వారి పాట పాడటమే తప్ప.. గుత్తేదారులెవరూ అటువైపుగా చూడటం లేదు. అయిదు నెలలైనా పరిస్థితిలో మార్పురాకపోవడంతో అధికారులు చేతులెత్తేశారు. ఏం చేయాలో చెప్పాలంటూ బంతిని ప్రభుత్వ కోర్టులోకే నెట్టేశారు. తనకు కావాల్సింది కూడా ఇదేనని జగన్‌ అనుకున్నారేమో తెలియదు గానీ.. ఆ నివేదికను కూడా నెల రోజులుగా మూలన పడేశారు.

వందల సంఖ్యలో అర్హులున్నా.. : దివ్యాంగులకు రెట్రోఫిటెడ్‌ మోటారు వాహనాలు అందిస్తే వారి ఉపాధికి చాలా చేయూతగా నిలుస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో అర్హులున్నారు. 80 శాతం, 90 శాతం వైకల్యమున్నవారు వీటి కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చేది నియోజకవర్గానికి 10 చొప్పున 1,750 వాహనాలే. ఒక్కో మోటారు వాహనం విలువ గరిష్ఠంగా రూ.లక్ష వేసుకున్నా మొత్తం ఖర్చు రూ.17.50 కోట్లే. దివ్యాంగులకు ఎంతో ఆదరవునిచ్చే వీటి పంపిణీపై జగన్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ మాత్రం మొత్తం ఖర్చు పెట్టడం నిమిషాల పని. కానీ ఆయన ఆలోచన వేరే ఉన్నట్లుంది!

మొదటి విడత పంపిణీకి రెండేళ్ల సమయం: జగన్‌ ప్రభుత్వం దివ్యాంగులకు మొదటి విడతలో రెట్రోఫిటెడ్‌ మోటార్‌ వాహనాలను అందించినప్పుడూ ఇదే పరిస్థితి. రెండు, మూడుసార్లు టెండర్లు పిలిచినా గుత్తేదారులెవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. ఎలాగోలా తంటాలుపడి టెండర్లు ఖరారు చేసినా లబ్ధిదారులకు ఇచ్చేసరికి విపరీతమైన జాప్యం జరిగింది. 2021 సెప్టెంబరులో మొదలైన పంపిణీ 2023 సెప్టెంబరు వరకు కొనసాగింది. అప్పుడు కూడా ఒక్కో నియోజకవర్గానికి ఇచ్చింది 10 మందికే. అర్హులు వందల సంఖ్యలో ఉన్నా వైకాపా ప్రభుత్వం నామమాత్రంగా పంపిణీ చేయడంపై దివ్యాంగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.

ఎన్నికల హడావుడేనని పసిగట్టినట్టున్నారు: ఎన్నికల గిమ్మిక్కులు చేయడంలో జగన్‌ దిట్ట కదా? అందుకే రెండో విడత కింద మళ్లీ పంపిణీ చేస్తామంటూ ఎన్నికల ముందు హడావుడి మొదలుపెట్టారు. ఆ విషయాన్ని గుత్తేదారులు పసిగట్టినట్లున్నారు. ఆవేశపడి ముందుకెళితే బిల్లులు రావని గుర్తించినట్లున్నారు. అందుకే టెండర్లకు దూరంగా ఉండిపోయారు. 5 నెలల క్రితం వీటి పంపిణీకి ప్రభుత్వం టెండర్లు పిలిచింది. టెండర్లలో పాల్గొనాలంటూ రాష్ట్రంలోని ప్రముఖ తయారీ సంస్థలన్నింటినీ అధికారులు సంప్రదించినా ప్రయోజనం శూన్యం. మొదటిసారి పిలిచినప్పుడు గుత్తేదారులెవరూ రాలేదు. రెండోసారి టెండర్లు పిలిస్తే ఎంపిక చేసిన గుత్తేదారు.. సరఫరా చేయలేనంటూ చేతులేత్తేశారు. మూడోసారి టెండర్లలో బిడ్‌ వేసింది ఒకే ఒక గుత్తేదారు కావడంతో నిబంధనల ప్రకారం దాన్నీ రద్దు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని