జనం డబ్బుతో జగన్‌ డాబు

ఆర్టీసీ నడుపుతున్న కాలంచెల్లిన డొక్కు బస్సులతో నాలుగున్నరేళ్లుగా ప్రజలు నరకం చూస్తున్నారు. బస్సులు రన్నింగ్‌లో ఉండగానే స్టీరింగ్‌లు, చక్రాలు, యాక్సిల్స్‌ ఊడిపోవడం, గమ్యస్థానానికి చేరకముందే మార్గమధ్యలో ఆగిపోవడం, బ్రేకులు విఫలమై పొలాల్లోకి, పంట కాల్వల్లోకి దూసుకుపోవడం.. వంటి ఘటనలు నిత్యకృత్యమైపోయాయి.

Updated : 26 Feb 2024 06:47 IST

రూ.20 కోట్లతో 2 బుల్లెట్‌ప్రూఫ్‌ బస్సులు కొనుగోలు
రూ.3 కోట్లతో మరో మూడు నాన్‌ బుల్లెట్‌ప్రూఫ్‌ వాహనాలు
ఇటీవలే అద్దె ప్రాతిపదికన రెండు హెలికాప్టర్లు తీసుకున్న వైనం
ఆర్టీసీ డొక్కు బస్సులతో ప్రజలు అవస్థలు పడుతున్నా పట్టించుకోని సీఎం

ఈనాడు, అమరావతి: ఆర్టీసీ నడుపుతున్న కాలంచెల్లిన డొక్కు బస్సులతో నాలుగున్నరేళ్లుగా ప్రజలు నరకం చూస్తున్నారు. బస్సులు రన్నింగ్‌లో ఉండగానే స్టీరింగ్‌లు, చక్రాలు, యాక్సిల్స్‌ ఊడిపోవడం, గమ్యస్థానానికి చేరకముందే మార్గమధ్యలో ఆగిపోవడం, బ్రేకులు విఫలమై పొలాల్లోకి, పంట కాల్వల్లోకి దూసుకుపోవడం.. వంటి ఘటనలు నిత్యకృత్యమైపోయాయి. అయినా ప్రయాణికుల క్షేమంపై వైకాపా సర్కారు దృష్టిపెట్టలేదు. కొత్త బస్సుల కొనుగోలుకు ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. ఆర్టీసీ మాత్రం..సీఎం జగన్‌ కోసం ఏకంగా రూ.20 కోట్లు వెచ్చించి కొత్తగా రెండు బుల్లెట్‌ ప్రూఫ్‌ బస్సులను కొనుగోలుచేసింది. సీఎం పర్యటనల కోసం ఇప్పటికే ఆర్టీసీ వద్ద రెండు బుల్లెట్‌ ప్రూఫ్‌ బస్సులు ఉండగా, వాటి స్థానంలో కొత్తవి తీసుకుంది. మరో రూ.3 కోట్లు వెచ్చించి మూడు నాన్‌ బుల్లెట్‌ ప్రూఫ్‌ బస్సులు కూడా కొనుగోలుచేసింది. వీటిలో రెండు నాన్‌ బుల్లెట్‌ప్రూఫ్‌ బస్సులు ఆదివారం విజయవాడ చేరుకున్నాయి. మిగిలినవి ఈ వారంలోనే నగరానికి రానున్నాయి. మరో పది రోజుల్లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కానుంది. తర్వాత దాదాపు రెండు నెలలపాటు ఎన్నికల ప్రచారమే ఉంటుంది. దీంతో సీఎం ప్రచారానికి ఉపయోగించేందుకు వీలుగా.. ప్రజలు టికెట్ల రూపంలో ఆర్టీసీకి చెల్లించిన సొమ్ముతో ఈ బస్సులు కొనుగోలు చేశారనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ వర్గాల ఆదేశాలతోనే సీఎం పర్యటనలకు వినియోగించే బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేస్తుందని, వీటిని వినియోగించుకున్నందుకు ప్రత్యేక టారిఫ్‌ ఉంటుందని, దాని ప్రకారం సర్కారు ఆర్టీసీకి సొమ్ము చెల్లిస్తుందని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి.

4-5 కి.మీ.కు మించి బస్సుల్లో తిరగని సీఎం!

సాధారణంగా సీఎం జగన్‌ బస్సుల్లో ప్రయాణించేది అతికొద్ది దూరమే. ఏదైనా జిల్లాలో సభ ఉంటే    హెలికాప్టర్‌లో చేరుకుంటారు. అక్కడ హెలిప్యాడ్‌ నుంచి సభా వేదిక మధ్య దూరం గరిష్ఠంగా 5 కి.మీ. లోపే ఉంటుంది. సభాస్థలికి చేరుకొనేందుకు    బుల్లెట్‌ ప్రూఫ్‌ బస్సులను వినియోగిస్తారు. అయితే సీఎం హెలిప్యాడ్‌ నుంచి సభా వేదికకు చేరుకునే మార్గమంతా బారికేడ్లు ఏర్పాటుచేసి, పరదాలు కట్టేసి, దరిదాపుల్లోకి ఎవరినీ రానివ్వకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాంటప్పుడు ఉన్నవి వాడుకోకుండా కొత్త బస్సులు కొనుగోలు చేయాల్సిన అవసరం ఏముందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇప్పటికే కొత్త హెలికాప్టర్లు

సీఎం జగన్‌ భద్రతకు ముప్పుఉందని, పర్యటనలకు రెండు కొత్త హెలికాప్టర్లను సమకూర్చాలని ఇటీవల ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ట్విన్‌ ఇంజిన్లతో కూడిన ఈ రెండు హెలికాప్టర్లకు నెలకు రూ.3.85 కోట్లు అద్దె చెల్లించనున్నారు. ఒకటి విజయవాడలోని గన్నవరం విమానాశ్రయంలో, మరొకటి విశాఖ విమానాశ్రయంలో ఉంటాయి.

గత ఏడాది రూ.15 కోట్లతో కాన్వాయ్‌

సీఎం జగన్‌ కాన్వాయ్‌లో వినియోగించే బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాల కోసం గత ఏడాది దాదాపు రూ.15 కోట్లు వెచ్చించారు. 19 టయోటా ఫార్చ్యూనర్‌ వాహనాలు కొనుగోలు చేసి, వాటిని బుల్లెట్‌ ప్రూఫ్‌గా మార్పుచేసి వినియోగిస్తున్నారు. సీఎంగా జగన్‌ ప్రమాణస్వీకారం చేసిన వెంటనే 2019 జూన్‌లో ఆరు టయోటా ఫార్చ్యూనర్‌ వాహనాలు కొనుగోలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని