కడప జైల్లో రూ. కోట్ల బేరం!

ఇప్పటికే లెక్కలేనన్ని మలుపులు తిరుగుతున్న వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్‌ ఇది. ఈ కేసుకు సంబంధించి కడప జైల్లో ‘కోట్ల విలువైన’ కథే నడిచిందా? తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా? దీనికి సంబంధించి ‘అప్రూవర్‌’ షేక్‌ దస్తగిరి సరికొత్త విషయాలు బయటపెట్టారు.

Updated : 28 Feb 2024 06:55 IST

‘కొట్టి అప్రూవర్‌గా మార్చినట్లు’ చెప్పాలని భారీ ఆఫర్‌ 
అడ్వాన్సుగా రూ. 20 కోట్లు వెంటనే ఇస్తామన్నారు
శివశంకర్‌రెడ్డి కుమారుడు జైలుకు వచ్చి మరీ చెప్పారు 
వివేకా హత్య కేసు అప్రూవర్‌ దస్తగిరి వెల్లడి
పులివెందులలో జగన్‌పై పోటీ చేస్తానని ప్రకటన

ఈనాడు, హైదరాబాద్‌: ఇప్పటికే లెక్కలేనన్ని మలుపులు తిరుగుతున్న వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్‌ ఇది. ఈ కేసుకు సంబంధించి కడప జైల్లో ‘కోట్ల విలువైన’ కథే నడిచిందా? తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా? దీనికి సంబంధించి ‘అప్రూవర్‌’ షేక్‌ దస్తగిరి సరికొత్త విషయాలు బయటపెట్టారు. ‘వివేకా కేసు దర్యాప్తు చేసిన సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌ నిన్ను కొట్టి, బెదిరించి అప్రూవర్‌గా మార్చారని కోర్టుకు చెబితే నీకు కోట్ల రూపాయలిస్తాం. అడ్వాన్సుగా వెంటనే రూ. 20 కోట్లు చెల్లిస్తాం’ అంటూ ఈ కేసులో నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారుడు డాక్టర్‌ చైతన్యరెడ్డి తనను ప్రలోభ పెట్టారని షేక్‌ దస్తగిరి వెల్లడించారు. వృత్తిరీత్యా వైద్యుడైన ఆయన ఖైదీలకు వైద్య పరీక్షల పేరుతో కడప జైల్లోకి వచ్చి తనను కలిసి ఈ ఆఫర్‌ ఇచ్చారని తెలిపారు. ‘వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి కూడా.. సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌ తనను కొట్టి, ఒత్తిడి చేసి వాంగ్మూలం ఇప్పించుకున్నారంటూ ప్రకటించారు. నువ్వూ అలాగే చెబితే మొత్తం కేసే వీగిపోతుంది. అందరూ జైలు నుంచి బయటకొచ్చేస్తారు’ అని చైతన్యరెడ్డి చెప్పారని దస్తగిరి వివరించారు. వివేకా కేసులో హైదరాబాద్‌లోని సీబీఐ ప్రధాన న్యాయస్థానం ఎదుట మంగళవారం దస్తగిరి హాజరయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ డీల్‌ గురించి వెల్లడించారు. ఏ రాజకీయాన్ని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని.. తనను కొనేందుకు, ప్రలోభపెట్టేందుకు జగన్‌ ప్రయత్నిస్తున్నారో.. అదే రాజకీయంలోకి తాను దిగుతానని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో పులివెందుల్లో జగన్‌పై పోటీ చేసి ఆయన్ను ఢీకొంటానని చెప్పారు. ఆయన ఇంకా   ఏమన్నారంటే..

జగన్‌కు జనం ఓట్లేసే పరిస్థితి లేదు

‘‘ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో వివేకా హత్య కేసు తీవ్ర ప్రభావం చూపుతోంది. అది తనకు నష్టం కలిగిస్తుందని జగన్‌ భావిస్తున్నారు. ఈ కేసు వల్ల జగన్‌కు ప్రజలు ఓట్లేసే పరిస్థితి లేదు. అందుకే నన్ను ప్రలోభపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నన్ను అక్రమ కేసుల్లో ఇరికించి ఇటీవల కొన్ని నెలల పాటు కడప జైల్లో నిర్బంధించారు. అప్పుడే డాక్టర్‌ చైతన్యరెడ్డి నన్ను కలిసి ప్రలోభ పెట్టారు. అప్రూవర్‌గా మారినందున నన్ను అధికార పార్టీ నేతలు బెదిరిస్తున్నారు. వైకాపా ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, వైఎస్‌మనోహర్‌రెడ్డి బెదిరిస్తున్నారు. నా భార్య, పిల్లల్ని ఇబ్బందులు పెడుతున్నారు.

రక్షణ కల్పించాలని రేవంత్‌రెడ్డికి విన్నపం

జగన్‌ ప్రభుత్వం నాపై అక్రమంగా కిడ్నాప్‌ కేసు పెట్టి అరెస్టు చేసింది. నాకు 2+2 గార్డులు, 2+2 గన్‌మెన్‌లు, 5+5 ఎస్కార్టు ఉంది. నిరంతరం వారు నాతో పాటే ఉంటారు. వారికి తెలియకుండా నేనెలా కిడ్నాప్‌ చేస్తాను? నా భద్రతా సిబ్బందిని బెదిరించి నాకు వ్యతిరేకంగా వాంగ్మూలాలు తీసుకున్నారు. వీటన్నింటికీ జగన్‌మోహన్‌రెడ్డే కారణం. వీటిపైనా సీబీఐకి ఫిర్యాదు చేశాను. జగన్‌ ప్రభుత్వం నుంచి ప్రాణహాని ఉంది. నాకు భద్రత కల్పించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఇప్పటికే ఒకసారి కోరాను. మరోసారి విన్నవిస్తున్నా. నాకు భద్రత కల్పించాలని న్యాయస్థానంలో కూడా పిటిషన్‌ దాఖలు చేశా’’ అని దస్తగిరి చెప్పారు. 


కోర్టుకు హాజరైన ఎంపీ అవినాష్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: వివేకా హత్య కేసులో 8వ నిందితుడైన కడప ఎంపీ వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు ఎదుట హాజరయ్యారు. ఇతర నిందితులైన టి.గంగిరెడ్డి, యాదాటి సునీల్‌యాదవ్‌, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, డి.శివశంకర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి, వై.ఎస్‌.భాస్కర్‌రెడ్డిలను జైలు నుంచే హాజరుపరిచారు. సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి సీహెచ్‌.రమేశ్‌బాబు వారి రిమాండ్‌ను మార్చి 12 వరకూ పొడిగించారు. ఈ కేసులో దస్తగిరిపై జారీ అయిన నాన్‌బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ను ఉపసంహరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని