కుప్పం ఫక్కున నవ్వుకుంది

తెదేపా అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి నీళ్లు ఇచ్చామని గప్పాలు కొట్టుకోడానికి జగన్‌ సర్కారు నానాతిప్పలు పడుతోంది.

Updated : 28 Feb 2024 07:15 IST

ఒక్కరోజులోనే తేలిపోయిన మాటలు.. అరకొరగా కృష్ణా జలాలు
నీళ్లిచ్చామని చెప్పి అభాసుపాలైన సీఎం జగన్‌
ఖాళీ అయిన కాలువ

ఈనాడు, చిత్తూరు: తెదేపా అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి నీళ్లు ఇచ్చామని గప్పాలు కొట్టుకోడానికి జగన్‌ సర్కారు నానాతిప్పలు పడుతోంది. చిత్తూరు జిల్లాలోని కుప్పం బ్రాంచి కాలువ (కేబీసీ) పరిధిలోని 110 చెరువులను నింపేందుకు ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం బటన్‌ నొక్కారు. తాత్కాలికంగా గేటు (షట్టర్‌) పెట్టి ముందుగానే నిల్వ చేసుకున్న నీటిని వదిలి.. కృష్ణమ్మ కుప్పం వైపు బిరబిరా ప్రవహిస్తున్నట్లు బహిరంగ సభలో ప్రజలకు కట్టుకథ చెప్పారు. వాస్తవంగా ఇక్కడ గేటు అవసరం లేకున్నా లక్షల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేశారు. భారీస్థాయిలో కృష్ణా జలాలు విడుదల చేస్తున్నామని ఫొటోలకు పోజులు ఇచ్చారు. హెలికాప్టర్‌లో ఎగిరి వచ్చిన ముఖ్యమంత్రి భారీ ఖర్చుతో బహిరంగ సభ నిర్వహించి, 1,300 బస్సుల్లో ప్రజలను రప్పించి.. కుప్పానికి ఎంతో మేలు చేశామని డబ్బా కొట్టుకున్నారు. ఈ మేరకు నీళ్లన్నా వచ్చాయా.. అంటే అదీ లేదు.

వి.కోట మండలం కృష్ణాపురం, ఆదినేపల్లి పంప్‌హౌస్‌ల్లోని మోటార్లను ఆరేడు గంటలు మాత్రమే నడిపిస్తున్నారు. ఎగువ నుంచి పెద్దగా ప్రవాహం లేక కాలువలో నీళ్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి. వి.కోట మండలం కనమనాయనిపల్లితోపాటు పలుచోట్ల కేబీసీలో అడ్డుకట్టలు వేసి వచ్చిన నీటిని ఆపేసి.. ఒకస్థాయికి చేరాక ఆ కట్టలను తెంచి దిగువ ప్రాంతాలకు పంపిస్తూ కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోందని బిల్డప్పులు ఇచ్చారు. సీఎం నీటిని విడుదల చేసిన తర్వాత సోమవారం అర్ధరాత్రికి శాంతిపురం మండలం ఎంకేపురం వరకు కృష్ణా జలాలు రావడమే గగనమైంది. ఉదయానికి అక్కడ నీటి ఆనవాళ్లు కూడా కనిపించలేదు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గేటును మంగళవారం ఉదయమే సిబ్బంది తొలగించారు. కాలువల్లో నీటి తడైనా లేకపోవడంతో స్థానికులు, తెదేపా కార్యకర్తలు అందులోకి దిగి సర్కారు తీరును ఎద్దేవా చేశారు. జనాలను ఎందుకు మోసం చేస్తున్నారంటూ జగన్‌ను ప్రశ్నించారు. రూ. 400 కోట్లు ఖర్చు చేసి చంద్రబాబు కాలువను నిర్మించారన్నారు. సీఎం మాత్రం రూ.కోట్లు ఖర్చు చేసి కుప్పంలో గొప్పలు చెప్పారని ఎద్దేవా చేశారు. గేట్ల వ్యవహారంపై విమర్శలు రావడంతో సిబ్బంది మంగళవారం సాయంత్రం వాటిని మళ్లీ అమర్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని