అది మెగా.. ఇది దగా

పొరుగునున్న తెలంగాణలో ఉపాధ్యాయ ఖాళీలను వెతికి మరీ భర్తీచేస్తుంటే.. మన రాష్ట్రంలో మాత్రం జగన్‌ సర్కార్‌ ఉన్న ఖాళీలను దాచేసి, నిరుద్యోగులను మోసగిస్తోంది.

Updated : 01 Mar 2024 13:13 IST

తెలంగాణలో 11వేల పోస్టులతో డీఎస్సీ
ఏపీ కంటే బడులు, పోస్టులు తక్కువే
రాష్ట్రంలో మాత్రం 6,100 పోస్టులకే ప్రకటన
ప్రపంచబ్యాంకు రుణం కోసం ఖాళీల దాచివేత


అలా.. ఎలా?

  • తెలంగాణలో 11,602 పోస్టులతో మెగా డీఎస్సీ.. పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు సరిపోయేంత సమయం ఉంది.. అప్రెంటిస్‌షిప్‌ లేదు.
  • ఏపీలో 2019 ఎన్నికల ముందు 23వేల ఉపాధ్యాయ ఖాళీలున్నాయన్న జగన్‌. ఇప్పుడు ఎన్నికల ముందు కేవలం 6,100 పోస్టులతో డీఎస్సీ. సన్నద్ధమయ్యేందుకు సమయం లేకుండా నిర్వహణ. రెండేళ్లపాటు వెట్టిచాకిరీ చేసే అప్రెంటిస్‌షిప్‌ విధానంతో నిరుద్యోగులకు షాక్‌.

ఇదో జగన్నాటకం..

  •  తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు 29,571 ఉండగా.. వీటిలో చదివే విద్యార్థులు 28 లక్షలు. అక్కడ ఒకేసారి 11వేలకు పైగా ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రకటించింది. 2017లో 8,792 పోస్టులు భర్తీచేశారు. ఇవికాకుండా గురుకులాల్లో తొమ్మిదేళ్లలో మూడువిడతల్లో 27వేల బోధన పోస్టుల నియామకాలు చేశారు.
  • ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు 44,426 ఉండగా.. వీటిలో చదివే విద్యార్థులు 38.25 లక్షల మంది. తెదేపా హయాంలో 18వేలకు పైగా పోస్టులతో రెండు డీఎస్సీలు వేశారు. జగన్‌ సర్కార్‌ ఐదేళ్లకు కలిపి 6,100 పోస్టులనే ప్రకటించింది. తెలంగాణ కంటే ఏపీలో బడులు.. విద్యార్థులు ఎక్కువే.. అలాంటప్పుడు ఖాళీలు పెరగాలి కదా? ప్రపంచబ్యాంకు రుణం కోసం ఈ ప్రభుత్వం ఆడుతున్న జగన్నాటకంలో పోస్టులు ఆవిరైపోతున్నాయి.

ఈనాడు, అమరావతి: పొరుగునున్న తెలంగాణలో ఉపాధ్యాయ ఖాళీలను వెతికి మరీ భర్తీచేస్తుంటే.. మన రాష్ట్రంలో మాత్రం జగన్‌ సర్కార్‌ ఉన్న ఖాళీలను దాచేసి, నిరుద్యోగులను మోసగిస్తోంది. ఏపీ ప్రభుత్వం ఈ నాలుగున్నరేళ్లలో ఏటా డీఎస్సీ నిర్వహించిందా అంటే.. అదీ లేదు. రాబోయే నెలల్లో పదవీవిరమణలు విరివిగా ఉంటాయి. కానీ, ప్రభుత్వం 6,100 పోస్టులకు డీఎస్సీ ఇచ్చి.. ఇక ఖాళీలు లేవంటోంది. చదువుపై పెట్టే ప్రతిపైసాను పెట్టుబడిగా భావిస్తానని, ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులు ప్రపంచస్థాయిలో పోటీపడాలని సీఎం జగన్‌ తరచూ సభల్లో ఊదరగొడుతూ ఉంటారు. పాఠాలు చెప్పేందుకు ఉపాధ్యాయులు లేకపోతే గ్లోబల్‌ విద్యార్థులు తయారవుతారా? ఉపాధ్యాయ పోస్టుల భర్తీ పెట్టుబడి కాదా?

అక్కడ జీవం పోస్తూ.. ఇక్కడ తీసేస్తూ..

తెలంగాణలో ప్రతి పంచాయతీలో కనీసం ఒక పాఠశాల ఉండాలనే నిబంధనను అక్కడి ప్రభుత్వం పెట్టింది. బడులు లేకపోతే కొత్తవాటిని ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. పేద పిల్లలకు బడులను ఇంటికి సమీపంలో ఉంచేలా చూస్తోంది. ఏపీలో వైకాపా ప్రభుత్వం బడుల నిర్వహణలోనూ రివర్స్‌ విధానం పాటిస్తోంది. ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను కిలోమీటరు దూరంలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు తరలించింది. ప్రాథమిక బడుల్లో విద్యార్థులు తగ్గిపోయి వాటికవే మూతపడుతున్నాయి. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 587 ప్రభుత్వ బడులు మూతపడ్డాయి. విలీనం కారణంగా 118 బడులకు తాళాలు వేశారు. రాష్ట్రంలో ఏకోపాధ్యాయ బడుల సంఖ్య 9,602కు పెరిగింది. మూతపడుతున్న వాటిలో ఎక్కువగా ఎస్సీ కాలనీలు, ఎస్టీల ఆవాసాల్లో ఉన్నవే. ఇదే పరిస్థితి కొనసాగితే ఎస్సీలు, గిరిజనులకు ప్రాథమిక విద్య దూరమవుతుంది. ఇంత జరుగుతున్నా.. జగన్‌ సర్కార్‌ మాత్రం మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్‌తో బోధనంటూ గోబెల్స్‌ను మించి ప్రచారం చేస్తోంది.

మంత్రే బుకాయిస్తే..

ఉపాధ్యాయ ఖాళీలపై విద్యాశాఖ మంత్రి బొత్స ఒక్కోసారి ఒక్కో ప్రకటన చేస్తూ బుకాయించారు. ప్రభుత్వ పాఠశాలల్లో 771 పోస్టులే ఖాళీగా ఉన్నాయని, పదవీవిరమణ వయసు 62ఏళ్లకు పెంచడం వల్ల ఖాళీలు రాలేదని గతేడాది మార్చి 20న శాసనమండలిలో ప్రకటించారు. తర్వాత గతేడాది సెప్టెంబరు 22న 8,366 పోస్టులు అవసరమని, వాటి భర్తీకి చర్యలు తీసుకుంటామని ప్రశ్నోత్తరాల్లో సమాధానమిచ్చారు. ఈ సమయంలోనే లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో 1,88,162 పోస్టులు ఉంటే పనిచేస్తున్న వారు 1,69,642 ఉన్నట్లు పేర్కొన్నారు. ఇటీవల డీఎస్సీ ప్రకటన సమయంలో 6,100 పోస్టులు ప్రకటించి, ఏప్రిల్‌ వరకు వచ్చే ఖాళీలన్నీ కలిపితేనే ఈ పోస్టులు వచ్చాయన్నారు. మంత్రి బొత్స చేసిన ప్రకటనల్లో ఒకదాంతో మరోదానికి సంబంధమే లేదు. ఎన్నికలకు నెల ముందు డీఎస్సీ వేసి, సమయం ఇవ్వకుండా నిరుద్యోగులను చిత్రహింసలు పెడుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని