నా.. నీ.. ‘భేదం లేదు..’ సర్వం గుట్కాయ స్వాహా!

కబ్జాల నుంచి కాల్‌మనీ వరకు.. వడ్డీ వ్యాపారం నుంచి క్యాసినోల వరకు.. గుట్కా నుంచి మట్కా వరకు.. అన్నింటా ముందుండే ఈ ప్రజాప్రతినిధి.. అభివృద్ధి పనుల విషయంలో మాత్రం తుస్‌!

Updated : 01 Mar 2024 12:53 IST

భూముల నుంచి బియ్యం వరకూ అన్నీ బుక్కేశారు!
అధికారులకు వేధింపులు.. సామాన్యులకు బెదిరింపులు
నియోజకవర్గ కేంద్రంలో ఒక్క రోడ్డూ బాగు చేయలేదు
ఉమ్మడి కృష్ణాలో అడుగడుగునా ఆయన అరాచకమే
ఈనాడు, అమరావతి

కబ్జాల నుంచి కాల్‌మనీ వరకు.. వడ్డీ వ్యాపారం నుంచి క్యాసినోల వరకు.. గుట్కా నుంచి మట్కా వరకు.. అన్నింటా ముందుండే ఈ ప్రజాప్రతినిధి.. అభివృద్ధి పనుల విషయంలో మాత్రం తుస్‌! ఎవరో గాడిదకు నల్లబెలూన్లు కట్టినా... కచ్చితంగా తననే అవమానించారని.. భుజాలు తడుముకునే మహాజ్ఞాని..! ఆయన మంత్రిగా వెలగబెట్టినప్పుడు.. తన శాఖ మీద కూడా పట్టులేని విజ్ఞాని!! ఆయన గ్యాంగ్‌ వస్తే వ్యాపారులు.. ఆయన నోరు విప్పితే జనాలు.. జడుసుకోవాల్సిందే!

యన మాట్లాడుతుంటే టీవీలో ‘బీప్‌’ శబ్దాలే ఎక్కువ.. ఆయన మాటలు అంత ‘కంపు’గా ఉంటాయి మరి.. ఇది ఆయన వ్యక్తిగతమే అయినా,  ఆయనో ఓ ప్రజాప్రతినిధి కావడమే.. ప్రజల దౌర్భాగ్యం.

ఆయన నలుగురుకీ ఆదర్శం మాట అటుంచి పలువురిని దోచుకుని వెనకేసుకున్న తీరు ఎవరైనా ముక్కున వేలేసుకునేలా చేస్తుంది. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది.. కొన్నాళ్లు మంత్రిగానూ వ్యవహరించారు. ఒక్కసారీ ఆ శాఖను సమీక్షించిన దాఖలాలు లేవు. సన్నబియ్యం ఇస్తామని మాటమార్చిన వ్యక్తి. అదే అడిగితే.. బూతు పురాణం అందుకున్నారు. ఆ ప్రజాప్రతినిధి తన నియోజకవర్గానికి ఉన్న కీర్తిని దిగజార్చారనేది ప్రజాభిప్రాయం. కృష్ణా జిల్లాకి క్యాసినోను పరిచయం చేసిన ఘనుడు. యువతను చేరదీస్తున్నట్లు మేలి ముసుగు కప్పుకొని వారికి అన్ని రకాల చెడు వ్యసనాలను అంటగట్టి బానిసలను చేసుకోవడం ఆయనకు గుట్కాతో పెట్టిన విద్య. మంత్రి అయ్యాక ఒక్కటేంటి.. అనేక అక్రమాలూ, అరాచకాలతో రూ.కోట్లకు పడగలెత్తారు.


కంకరరాళ్ల దందా..!

మ్మెల్యేగా ఎన్నికైన కొత్తలో ఉమ్మడి జిల్లాలో పదుల సంఖ్యలో గ్రావెల్‌ అనుమతులు పొంది బినామీలకు అప్పగించారు. కొండలన్నీ బోడిగుండ్లు చేసేశారు. ఇదీ తన నియోజకవర్గంలో కాదు.. పక్క నియోజకవర్గంలో కావడం విశేషం. ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే పార్టీ మారే పరిస్థితిలో ఉన్నప్పుడు స్నేహితుడే అని మొత్తం అనుమతులు తనే తీసుకున్నారు. పలు సంస్థలకు గ్రావెల్‌ రవాణా చేశారు. రూ.కోట్లు పోగేశారు. పోలవరం కాలువ కట్టలను మాయం చేశారు. పట్టణ పరిధిలో టిడ్కో ఇళ్లకు మట్టి సరఫరా పేరుతో రూ.కోట్లు కుమ్మేశారు.


ఒక్క రోడ్డు వేయలేదు..!

ఇంత చేసీ తన నియోజకవర్గంలో ఒక్క రోడ్డయినా వేయలేకపోయారు. నియోజకవర్గ కేంద్రం నుంచి జాతీయ రహదారికి వెళ్లే రోడ్డు గుంతలతో దారుణంగా ఉంటుంది. మరో రోడ్డుకు ఎన్‌డీబీ నిధులతో శంకుస్థాపన చేసినా.. దాన్నీ పూర్తి చేయించలేదు.


ఇనాం భూములకు ఎసరు..?

కృష్ణా జిల్లాలో ఓ ప్రముఖ పట్టణానికి శివారున ఉన్న దాదాపు 150 ఎకరాల ఇనాం భూములకే గాలం వేశారు. వస్తే.. రూ.500 కోట్ల ఇనాం కొండ లేదంటే.. ఆయన భాషలో ఒక వెంట్రుక. వాటిని కొంతమందికి ఇనాంగా ఇచ్చినా.. తర్వాత రైత్వారీ పట్టాలు చేయలేదు. కాలక్రమంలో చేతులు మారాయి. కానీ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఇవి దేవాదాయ భూములుగానే ఉన్నాయి. మంత్రి హోదాలో ఉన్నప్పుడు ఒక ఐఏఎస్‌ అధికారితో కలిసి దీని ఆక్రమణకు స్కెచ్‌ వేశారు. అంతా సిద్ధమైంది.. రెవెన్యూ శాఖ కూడా నిరభ్యంతర పత్రం జారీ చేసింది. ఆ ఐఏఎస్‌ ఇవి దేవాదాయశాఖకు చెందిన భూములు కావని ఎన్‌వోసీ జారీ చేశారు. ఈ దస్త్రం దేవాదాయ శాఖ కమిషనర్‌ దగ్గరకు వెళ్లింది. అక్కడ క్లియరెన్సు దొరక్కపోవడంతో ఆ వ్యవహారం పెండింగ్‌లో పడింది. అప్పటికే నాటి మంత్రికి రూ.కోట్లు ముట్టాయంటున్నారు. ఇప్పటికీ ఆ భూములు ఆక్రమణదారుల కబ్జాలోనే ఉన్నాయి, ఇటీవల కంచెలు కూడా వేశారు.

  • ఓ పట్టణ పరిధిలో వక్ఫ్‌ బోర్డు భూముల్లో కొంత భాగాన్ని కొందరు వ్యాపారులు కొన్నారు. దాన్ని అడ్డుకోవాల్సింది పోయి.. అక్రమాల్ని సక్రమం చేసి కోట్లు అందుకున్నారు.
  • ఆ పట్టణానికి సమీపంలోనే 8.64 ఎకరాల డీటీసీపీ అనుమతి ఉన్న లేఅవుట్‌ను ఈ ‘బీప్‌..’ ప్రజాప్రతినిధి ఆక్రమించేశారు. ఒక ప్రముఖ వ్యక్తి.. మరో వ్యక్తికి ‘పవర్‌ ఆఫ్‌ అటార్నీ’ జారీ చేశారు. ఆమేరకు కొంతమంది ఈ భూములను కొనుగోలు చేసుకుని సొసైటీ పేరుతో లేఅవుట్‌ వేసుకుని.. స్థలాలు పంపిణీ చేసుకున్నారు. అన్ని అనుమతులూ వచ్చాక.. విద్యుత్తు స్తంభాలు వేసే సమయంలో ‘గ్యాంగ్‌’ అడ్డుపడింది. దీంతో తాను పవర్‌ ఆఫ్‌ అటార్నీ ఎవరికీ ఇవ్వలేదని మెలిక పెట్టి అసలు వ్యక్తి ఎదురు తిరిగారు. ఆయనకు ఈ నేత మద్దతుగా నిలిచారు. స్థలాన్ని తన అనుచరుల పేరుమీదకు మార్చుకుని స్వాధీనం చేసుకున్నారు. 
  • పట్టణంలో ఒక స్థిరాస్తి వ్యాపారి షాపింగ్‌ కాంప్లెక్సు నిర్మాణం చేశారు. ఆయన భారీగా సంపాదించారు. తనకు అప్పు ఉన్నారని, దాన్ని చెల్లించాలని ఈ ప్రజాప్రతినిధి ఒత్తిడి తెచ్చారు. దాన్ని రూ.కోట్లలో చూపారు. మరోవైపు అధికారులతో ఒత్తిడి పెంచారు. తట్టుకోలేక ఆ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నారు. ఆపై షాపింగ్‌ కాంప్లెక్సు ఈ నేత స్వాధీనం చేసుకున్నారు.
  • మంత్రిగా ఉన్నప్పుడు ఓ అధికారికి రెవెన్యూ శాఖ నుంచి బియ్యం శాఖకు డిప్యుటేషన్‌పై ఒక జిల్లా అప్పగించారు. ఆ జిల్లా ధాన్యం సాగులో ప్రసిద్ధి. ఇంకేముంది ధాన్యం కొనుగోలు పేరుతో రెండేళ్లు దండుకున్నారు. ఫలితంగా మంత్రికి ఓ విలాసవంతమైన విల్లా కానుకగా ఇచ్చారు.
  • ఆ ఉమ్మడి జిల్లాలో దాదాపు 300 వరకు ధాన్యం మిల్లులు ఉంటాయి. అందరికీ సీఎంఆర్‌ కేటాయిస్తుంటారు. దీని రీసైక్లింగ్‌లో ఓ మిల్లరు ప్రసిద్ధి. దీంతో వారి నుంచి భారీగా విరాళం అందింది. అంతేకాదు.. నాడు మరో మంత్రితో కలిసి జిల్లా కేంద్రంలో ఒక గోదాము నిర్మించారు. దీన్ని గిడ్డంగుల సంస్థకు లీజుకు ఇచ్చి బియ్యం నిల్వ చేస్తుంటారు. గోదాము నిర్వహణ బాధ్యతను తమ చేతుల్లో   ఉంచుకుని కాకినాడ పోర్టుకు పెద్దఎత్తున బియ్యం తరలిస్తున్నారనేది అధికారులు  సైతం అంగీకరిస్తున్న సత్యం.

చీడపురుగులా మారి...

  • గతంలో ఆ నియోజకవర్గానికి ప్రముఖులు ప్రాతినిధ్యం వహించారు. అలాంటి కేంద్రంలో సంక్రాంతికి గోవా తరహా క్యాసినో నిర్వహించారు. క్యాబరేలు, మందులూ, విందులకు కొదవే లేదు. పక్క నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన స్నేహితుడు దీన్ని ఆదర్శంగా తీసుకున్నారు.
  • పక్క మండలంలో సీఎం బామ్మర్దంటూ ఒక అనుచరుడిని తయారు చేశారు. ఇప్పటికే ఆయన ప్రభుత్వ భూములను 50 ఎకరాలు ఆక్రమించి చెరువులు తవ్వి లీజుకు ఇచ్చారు. దీనిలో చెరిసగం ఆదాయం.
  • నియోజకవర్గ పరిధిలోని ఓ మండలంలో చేపల చెరువులను తవ్వుతుంటే.. ఆర్‌ఐ అడ్డుకున్నారు. అంతే అతనిపై అనుచర గణం దాడి చేసి లంచాలు అడిగారని ఎదురు కేసు పెట్టింది.
  • మరో అనుచరుడు ఒక యువతికి ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బు వసూలు చేశాడు. ఎంతకీ ఉద్యోగం రాకపోగా డబ్బు అడిగితే ఎదురు దాడికి దిగారు. కేసు పెడితే నీరు గార్చారు. కొంతమంది మహిళలు పక్క నియోజకవర్గంలో గాడిదకు నల్లబెలూన్లు కడితే.. తననే అవమానించారని పోలీసులను ఉసిగొల్పి కేసులు పెట్టించారు.

యువతే లక్ష్యం..!

గ్రామానికో పది మందిని ఎంపికచేసి తన గ్యాంగులో చోటిచ్చి.. వారిని జల్సా రాయుళ్లలా మార్చడం.. ఎన్నికల సమయంలో ప్రయోగించడం.. ఈ ప్రజాప్రతినిధి పని. ప్రతిపక్షంపై దాడులు చేయించడం, అభిమాన సినీ హీరోల పుట్టినరోజు వేడుకలు స్వయంగా జరిపించడం.. వారికి ఫ్లెక్సీలు కట్టించడం ద్వారా యువతను ఆకట్టుకోవడంలో నేర్పరి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని