విద్యార్థుల ఖాతాల్లో రూ.708 కోట్లు జమ

వసతి దీవెన, విద్యాదీవెన పథకాల కింద గత 57 నెలల్లో రూ.18 వేల కోట్లను బటన్‌ నొక్కి విద్యార్థుల ఖాతాల్లో వేశామని ముఖ్యమంత్రి జగన్‌ వెల్లడించారు.

Published : 02 Mar 2024 04:15 IST

విద్యాదీవెన నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి జగన్‌

ఈనాడు, అమరావతి: వసతి దీవెన, విద్యాదీవెన పథకాల కింద గత 57 నెలల్లో రూ.18 వేల కోట్లను బటన్‌ నొక్కి విద్యార్థుల ఖాతాల్లో వేశామని ముఖ్యమంత్రి జగన్‌ వెల్లడించారు. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 9.44 లక్షల మంది విద్యార్థులకు 2023 అక్టోబరు నుంచి డిసెంబరు కాలానికి  ‘విద్యాదీవెన’ కింద శుక్రవారం రూ.708.68 కోట్లను ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. కృష్ణా జిల్లా పామర్రులో శుక్రవారం నిర్వహించిన జగనన్న విద్యాదీవెన నిధుల విడుదల సభలో సీఎం జగన్‌ మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్నత విద్య చదువుతున్న 93 శాతం మందికి పూర్తి ఫీజును తమ ప్రభుత్వమే కడుతోందన్నారు. ‘పేద పిల్లల చదువులకు సంబంధించిన పథకాల కోసమే ఇప్పటివరకూ రూ.73 వేల కోట్లను ఖర్చు చేశాం. ఏదో ఒక డిగ్రీ తీసుకుంటే ఈ పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావడం కష్టం. అందుకే ప్రపంచంలోని అతిపెద్ద సంస్థల్లో ఉద్యోగాలు సాధించేందుకు అవసరమైన నైపుణ్యాలు, కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చాం. మండలానికి రెండు జూనియర్‌ కళాశాలలు, వాటిలో ఒకటి ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాం. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు రూ.1.25 కోట్ల వరకూ ఆర్థిక సాయం అందిస్తున్నాం’ అని జగన్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని