ఈడబ్ల్యూఎస్‌ కోటా సీట్ల భర్తీకి తొలగిన అడ్డంకి

ప్రైవేటు బీఈడీ కళాశాలల్లో ఈడబ్ల్యూఎస్‌ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు) కోటా 10శాతం సీట్ల భర్తీకి హైకోర్టు ఉత్తర్వులతో అడ్డంకి తొలగింది.

Published : 02 Mar 2024 05:18 IST

ఎన్‌సీటీఈ ప్రొసీడింగ్స్‌ను సస్పెండ్‌ చేసిన హైకోర్టు

ఈనాడు, అమరావతి: ప్రైవేటు బీఈడీ కళాశాలల్లో ఈడబ్ల్యూఎస్‌ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు) కోటా 10శాతం సీట్ల భర్తీకి హైకోర్టు ఉత్తర్వులతో అడ్డంకి తొలగింది. ఈ సీట్ల భర్తీకి అవరోధంగా ఉన్న ఉపాధ్యాయ విద్యా జాతీయ మండలి ప్రాంతీయ డైరెక్టర్‌ (ఎన్‌సీటీఈ) జారీచేసిన ప్రొసీడింగ్స్‌ను సస్పెండ్‌ చేసింది. అవకతవకల ఆరోపణలతో కొన్ని బీఈడీ కళాశాలలపై విచారణ జరుగుతున్న కారణంగా ఈడబ్ల్యూఎస్‌ కోటా సీట్ల భర్తీని నిలువరించడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. సంబంధిత కళాశాలలపై విచారణ జరపడానికి తామిచ్చిన ఉత్తర్వులు అడ్డంకికాదని స్పష్టంచేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.సుజాత శుక్రవారం ఈమేరకు ఉత్తర్వులిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖను ఆధారంగా చేసుకొని బీఈడీ కళాశాలల్లో ఈడబ్ల్యూఎస్‌ కోటా 10శాతం సీట్ల భర్తీని తాత్కాలికంగా పక్కనపెడుతూ ఎన్‌సీటీఈ జారీచేసిన ఉత్తర్వులను సవాలుచేస్తూ శ్రీవివేకానంద కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, మరికొన్ని కళాశాలల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది ఎ.సత్యప్రసాద్‌ వాదనలు వినిపించారు. ఈడబ్ల్యూఎస్‌ కోటా సీట్లను భర్తీ చేసేందుకు అనుమతి ఇవ్వకపోవడం ప్రాథమిక హక్కులను హరించడమేనన్నారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. అవకతవకలకు పాల్పడిన కళాశాలలపై విచారణ జరుగుతోందన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. కొన్ని కళాశాలల ఆరోపణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో మొత్తం ఈడబ్ల్యూఎస్‌ కోటా సీట్లను బర్తీ చేయకుండా నిలుపుదల చేయడం సరికాదని తేల్చిచెప్పారు. ఎన్‌సీటీఈ ఉత్తర్వులను సస్పెండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని