Dharmana: ‘ఖాతాల్లో డబ్బు పడుతుంటే సమావేశాలకు ఎందుకు ఉంటారు?’

‘ఎవరి ప్రమేయం లేకుండా పథకాల సొమ్ము మీ ఖాతాల్లో పడిపోతుంటే మా సమావేశాలకు మీరెందుకు ఉంటారు’ అని రాష్ట్ర రెవెన్యూమంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు.

Published : 12 Mar 2024 07:33 IST

చేయూత లబ్ధిదారులపై మంత్రి ధర్మాన అసహనం

శ్రీకాకుళం నగరం, న్యూస్‌టుడే: ‘ఎవరి ప్రమేయం లేకుండా పథకాల సొమ్ము మీ ఖాతాల్లో పడిపోతుంటే మా సమావేశాలకు మీరెందుకు ఉంటారు’ అని రాష్ట్ర రెవెన్యూమంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. శ్రీకాకుళంలో సోమవారం చేనేత కుటుంబాలతో ఆత్మీయ సమావేశం, వైఎస్‌ఆర్‌ చేయూత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. చేయూత సమావేశ ప్రాంగణం ప్రధాన గేటు మూసి వాలంటీర్లు కాపలా ఉన్నా మంత్రి ప్రసంగానికి ముందే మరో గేటు నుంచి మహిళలు బయటకు వెళ్లిపోతుండటంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు.

‘నేను వచ్చే ముందు వారిని ఇక్కడికి తీసుకురమ్మని మా వాళ్లకు చెబుతా. నాకంటే ముందు వాళ్లు వచ్చేస్తే ఇలానే జరుగుతుంది’ అని పేర్కొన్నారు. చేనేత కుటుంబాలతో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ‘పథకాల లబ్ధి పొంది ప్రభుత్వానికి విధేయులుగా లేని పనికిమాలిన వారి గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు’ అని వ్యాఖ్యానించారు. ‘ప్రభుత్వం నడిపిన వారిగా మేం చెబుతున్నాం. మాకు వర్గం, కులం, మతం వద్దు. జెండా కట్టినా కట్టకపోయినా..వాడి ఒంటిపై పసుపు చొక్కా ఉన్నా మనకు మొన్న ఓటు వేయకపోయినా..రేపు మరలా మాకు ఓటు వేయరని అనుకున్నా వారి కన్నీరు తుడిచే పని మేం చేస్తాం. మాకు ఓ వర్గం ఉంది. నేను ఆ వర్గంలోనే ఉంటానని వారంటే నేనేం చేయను. అటువంటి వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బుద్ధి లేనివారు పోతే పోనివ్వండి. ఈ ప్రభుత్వం అందించిన మంచి ఆహార గింజలు తిని..విద్యా సౌకర్యాలు, అన్ని రకాల రిజర్వేషన్లు, నేతన్న నేస్తం, అమ్మ ఒడి పొంది అడ్డంగా మాట్లాడితే అటువంటి వారిని వదిలేయాలి’ అని మంత్రి ధర్మాన అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని