డబ్బు కొట్టు.. ఇల్లు కట్టు!

ఆ నేత పేరు వింటేనే.. ‘నాటుకొట్టుడు.. వీరకొట్టుడు.. దంచికొట్టుడు..’ అన్న పాట గుర్తొస్తుంది. పాటకు తగినట్లుగానే అవినీతి సొమ్మును దంచి కొట్టడంలో ఆయనకు ఆయనే సాటి! యజమానులు డబ్బు కొడితే కానీ ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వలేదు.

Published : 30 Mar 2024 04:37 IST

దక్షిణ సమర్పిస్తేనే నిర్మాణాలకు అనుమతులు
‘పశ్చిమ’లో ప్రజాప్రతినిధి అక్రమ దందా
పక్కా ప్రణాళికతో తండ్రీకొడుకుల వసూళ్లు
ఈనాడు, ఏలూరు

ఆ నేత పేరు వింటేనే.. ‘నాటుకొట్టుడు.. వీరకొట్టుడు.. దంచికొట్టుడు..’ అన్న పాట గుర్తొస్తుంది. పాటకు తగినట్లుగానే అవినీతి సొమ్మును దంచి కొట్టడంలో ఆయనకు ఆయనే సాటి! యజమానులు డబ్బు కొడితే కానీ ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వలేదు.. అందుకు ఆయన పెట్టిన పథకం.. ‘డబ్బు కొట్టు.. ఇల్లు కట్టు’! తండ్రికి తోడుగా తనయుడూ వేర్వేరుగా కౌంటర్లు తెరిచారు. కాదూ.. కూడదు అని తోకజాడిస్తే.. తండ్రీకొడుకులు గుండెల్లో ‘బాంబులు’ పేల్చుతారంతే..!!

ఆ నాయకుడికి దైవభక్తి ఎక్కువ అని చెబుతుంటారు. దేవుడి సొమ్ము తినడం మహాపాపం అని ఆయన కూడా ఎన్నో నీతులు వల్లెవేస్తుంటారు. దేవుడికి ఎంతో సేవ చేస్తున్నట్లు సొంత భజన చేసుకుంటారు. ఇదంతా విని ఆ నేతకు ఎంతో దైవభీతి, పాపభీతి ఉందనుకుంటే మోసపోయినట్లే. ప్రజాస్వామ్యంలో ప్రజలే అసలైన దేవుళ్లు కదా.. దేవుళ్ల లాంటి ప్రజల నుంచి డబ్బు పిండుకోవడంలోనూ ఆయన సిద్ధహస్తుడు. ముడుపులు ముట్టజెప్పనిదే ఏ పనీ చేయరు. ఆ నేతకు అంత ‘దైవ’భక్తి మరి! ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ‘గూడెం’లో ఒక్క ఇల్లు కట్టుకోవాలనుకున్నా జనాలు జడిసిపోతున్నారు. భవనాలు నిర్మించుకోవాలనుకునేవారు బెంబేలెత్తిపోతున్నారు. ఆ నాయకుడి తీరుతో కొన్నాళ్లుగా అక్కడ నిర్మాణ రంగమే స్తంభించిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఇదొక్కటే కాదు.. ఇంకెన్నింట్లోనో ఆ నేత చిలక్కొట్టుడు కొడుతుంటారు. అడిగినంత సమర్పించుకుని మిన్నకుండటమే ప్రజల వంతు!!

అది ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మధ్యలో జాతీయ రహదారిని ఆనుకుని ఉండే ప్రాంతం. ఇటు డెల్టా, అటు మెట్ట నేలల అనుసంధానంగా ఉన్న ఆ ప్రాంతం హోల్‌సేల్‌ ఉల్లి వ్యాపారానికి ప్రసిద్ధి. అపరాల వ్యాపారమూ ఎక్కువే. రాష్ట్రంలో కీలకస్థానంలో ఉండి అక్కడ ప్రజాప్రతినిధిగా కొనసాగుతున్న ఆ నాయకుడి శైలే వేరు. ఆయన కుటుంబంలోని ఒకరు మహానగరంలో బడా వ్యాపారంలో చక్రం
తిప్పుతుంటారు. కార్పొరేట్‌ స్థాయి వ్యవహారాలు కూడా సాగిస్తుంటారు. ఆ మంత్రాంగంతోనే ఈ నేతకు ప్రభుత్వంలో కీలకపదవి దక్కిందన్న చర్చలు ఉన్నాయి. అంత ఉండి కూడా చిన్న పట్టణంలో నాయకుడి ‘చిలక్కొట్టుడు’ సామాన్యులకు విస్మయం కలిగిస్తోంది. బాణసంచా అమ్మేవారి నుంచి బడా వ్యాపారి వరకు ఎవరిస్థాయిలో వారు ఈ మహా‘మేత’కు ముడుపులు సమర్పించుకోవాల్సిందే! అందుకు తండ్రి పెద్దకౌంటర్‌ తెరిస్తే. కుమారుడు చిన్నకౌంటర్‌ తెరిచారు!!


పునాదులు కదులుతాయ్‌..!

పట్టణ ప్రణాళిక విభాగం మొత్తం ఆ నేత కనుసన్నల్లోనే పనిచేస్తుంది. ఇల్లు, భవనం నిర్మించాలంటే అధికారుల అనుమతి కంటే ముందు ఆ నేత అనుమతి ఉండాల్సిందే. ప్రజా ప్రతినిధికి ముడుపులు చెల్లిస్తేనే పునాదిలో రాళ్లు పడతాయి. మరోవైపు నాయకుడి అనుచరులు పట్టణంలో సంచరిస్తూ భవన నిర్మాణాలపై నిరంతరం ఆరా తీస్తుంటారు. సంబంధిత యజమాని భవన నిర్మాణానికి అనుమతి
తీసుకున్నారా? తమ నేతకు కప్పం కట్టారా? అన్న వివరాలు తెలుసుకుంటారు. అనుమతులు తీసుకుని తమ నాయకుడికి ముడుపులు ఇస్తే సరే. లేనిపక్షంలో అధికారులను ఉసిగొల్పుతారు.


అంతా పక్కా ‘ప్లానింగ్‌’ ప్రకారమే..

పట్టణంలో ఇళ్ల స్థలాలు విక్రయించడానికి లేఅవుట్‌ వేస్తే ఆ నాయకుడికి రూ.లక్షలు సమర్పించుకోవాల్సిందే. ఏదైనా వెంచర్‌ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే... రూ.50 లక్షల వరకు సమర్పించుకోవాలి. అన్నీ సక్రమంగా ఉండి... అనుమతులు తీసుకున్న వెంచర్‌కు కూడా స్థలాన్ని బట్టి రూ.5-10 లక్షల వరకు ముట్టజెప్పాల్సిందే. కొన్ని రోజుల కిందట పట్టణంలో ఓ స్థిరాస్తి వ్యాపారి అక్రమ లేఅవుట్‌ వేశారు. అందుకు వ్యాపారి రూ.40 లక్షలు ప్రజాప్రతినిధికి ఇచ్చినట్లు సమాచారం.


టీడీఆర్‌ బాండ్ల జారీలో అక్రమాలు

రాష్ట్రంలో టీడీఆర్‌ బాండ్లలో సాగిన అక్రమాల లీలలు ఇన్నీఅన్ని కావు. 80 అడుగులు ఉన్న నల్లజర్ల-కోడేరు రహదారిని 100 అడుగులకు విస్తరించాలని సంకల్పించారు. ఈమేరకు 3వేల చదరపు గజాలకు బాండ్లు జారీ చేశారు. ఆ స్థలం విలువను రూ.18 కోట్లుగా లెక్కగట్టి అందుకు 4రెట్ల విలువైన బాండ్లు విడుదల చేశారు. అక్కడ ఉన్న వాస్తవ విలువను పెంచి బాండ్లు జారీ చేయడం ఒక తప్పిదం అయితే.. ఆ స్థలాలు స్వాధీనం చేసుకోకుండానే బాండ్లు ఇవ్వడం మరో తప్పిదం. అనంతరం ఈ బాండ్లను వారే అమ్మేసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రజాప్రతినిధి కీలకపాత్ర పోషించి రూ.కోట్లను కొల్లగొట్టారు.


నిరుద్యోగుల నుంచి వసూళ్లు

నిట్‌, ఉద్యానవర్సిటీ, ఇతర విభాగాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ప్రజాప్రతినిధి అనుచరుడు కొందరు నిరుద్యోగులను నమ్మించారు. ఒక్కొక్కరి నుంచి రూ.10 లక్షల వరకు వసూలు చేశాడు. అందులో సగం వరకు ప్రజాప్రతినిధికే అందినట్లు సమాచారం. డబ్బులిచ్చి రెండేళ్ల వుతున్నా ఉద్యోగాలు రాకపోవడంతో నిరుద్యోగులు ప్రజాప్రతినిధిని కలవగా... తనకేం సంబంధం లేదని ఆయన చేతులు ఎత్తేశారు. దీంతో అనుచరుడు ప్రజాప్రతినిధికి ఇచ్చిన సొమ్మును సర్దుబాటు చేయలేక సతమతమవుతున్నారు.


సుతిమెత్తగా నొక్కేశారు...

పట్టణంలో ఓ నిర్మాణ సంస్థ.. అన్ని అనుమతులు తీసుకుని గృహ సముదాయాల నిర్మాణాలు చేపట్టింది. అయినా ప్రజాప్రతినిధి నుంచి కబురు వచ్చింది. తమకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయంటూ
ఆ సంస్థ వివరించింది. దానికి ప్రజాప్రతినిధి..‘అంతా బాగుంది కానీ.. రేపు ఆ పక్కన కంపోస్టు యార్డు వస్తే ఇబ్బంది పడతారు కదా.. ఆలోచించుకోండి’ అంటూ సుతిమెత్తగా చెప్పారు. దాంతో నిర్మాణ సంస్థ.. ప్రజాప్రతినిధికి లక్షల రూపాయలు సమర్పించుకుంది.

ఇదే ప్రాంతంలోని రాష్ట్రస్థాయి విద్యాసంస్థకు వెళ్లే మార్గంలో పట్టణ బృహత్‌ ప్రణాళికలో 80 అడుగుల రోడ్డు ఉంది. ఆ రోడ్డుకు ఇరువైపులా పేదలు తాత్కాలిక నివాసాలు ఏర్పాటుచేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఆ వెనకాలే ఓ ప్రముఖ వ్యాపార సంస్థకు స్థలం ఉంది. వ్యాపార సంస్థకు అడ్డుగా ఉన్న ఆ నివాసాలను తొలగించేందుకు నాయకుడు ఆ సంస్థ నుంచి అక్షరాల రూ.2 కోట్లు దండుకున్నారని ఆరోపణ. అలా ఖాళీ చేయించిన స్థలాన్ని ఆ వ్యాపార సంస్థ వాహనాల పార్కింగుకు ఉపయోగించుకుంటోంది. నియోజకవర్గ కేంద్రానికి సమీపంలోని గ్రామంలో సొంత పార్టీ నాయకుడే ఓ కల్యాణమండపాన్ని నిర్మించాలనుకున్నాడు. దానికి అధికారులు అనుమతులు ఇవ్వకుండా ప్రజాప్రతినిధి అడ్డుకున్నారు. ఆయనకు డబ్బులు సమర్పించుకున్న తర్వాతే అనుమతులు జారీ అయ్యాయి. ఇలా సొంత పార్టీ నాయకుడిని కూడా పిండేశారు ఈ ప్రజాప్రతినిధి.

నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో గ్రావెల్‌ నిక్షేపాలు ఉన్నాయి. వ్యాపారులు కొంతమేరకు అనుమతులు తీసుకుని ఇష్టానుసారం మట్టి తవ్వుతున్నారు. అనుమతులు లేని ప్రాంతాల్లో యంత్రాలతో అక్రమంగా మట్టి తవ్వి తరలిస్తున్నారు. అందుకు ప్రజాప్రతినిధికి లక్షల్లో కప్పం చెల్లిస్తున్నారు.


బాణసంచా వ్యాపారులకూ బాజా!

ఈ నియోజకవర్గ ప్రాంతం బాణసంచా వ్యాపారానికి ప్రసిద్ధి. ఇక్కడి నుంచే రాష్ట్రంలోని రిటైల్‌ వ్యాపారులకు టపాకాయలు సరఫరా అవుతుంటాయి. ప్రతి దీపావళికి ఇక్కడ రూ.కోట్ల వ్యాపారం సాగుతుంది. దీపావళి వచ్చిందంటే అందరికంటే ముందు ఆ నేతకే పండుగ. వ్యాపారుల నుంచి ముక్కుపిండి మరీ రూ.లక్షల్లో డబ్బులు వసూలు చేస్తారు. గత దీపావళి సమయంలో వ్యాపారులందరిని తన ఇంటికి పిలిపించుకుని.. ఒక్కో వ్యాపారి రూ.5 లక్షల చొప్పున ఇస్తేనే బాణసంచా అమ్మకాలు చేయిస్తానని తెగేసి చెప్పారు. ఇలా ఒక్క దీపావళికే రూ. కోట్లు వసూలు చేశారు.


తండ్రీ కొడుకుల కౌంటర్లు వేరే..

పట్టణంలోని ఓ కుటుంబం తమ స్థలంలో భవన నిర్మాణానికి ఓ బిల్డర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. బిల్డర్‌ భవనాన్ని పూర్తిగా నిర్మించకుండా ఇబ్బంది పెడుతున్నాడు. దీంతో ఆ కుటుంబం ప్రజాప్రతినిధి కుమారుడిని కలిసి సమస్యను పరిష్కరించాలని వేడుకుంది. ప్రతిఫలంగా ఆయన అడిగిన మొత్తాన్ని సమర్పించుకున్నారు. మొదట పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయండని, పోలీసులకు చెప్పి అంతా తాను చూసుకుంటానని తనయుడు హామీ ఇచ్చారు. బాధిత కుటుంబం స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినా పోలీసులు మాత్రం కేసు నమోదు చేయలేదు. కారణం ఏంటని ఆరా తీస్తే.. బిల్డర్‌ అప్పటికే ప్రజాప్రతినిధికి డబ్బులు ముట్టజెప్పి కేసు నమోదు కాకుండా పోలీసులను ‘మేనేజ్‌’ చేసుకున్నారని తెలిసింది. ఇలా తండ్రి ఒక కౌంటర్‌, కుమారుడు మరో కౌంటర్‌ నిర్వహిస్తున్నారని అప్పటి నుంచి ప్రచారం జరుగుతోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు