జనం చెవుల్లో జగన్‌ పువ్వులు

కొన్నాళ్ల కిందట వచ్చిన ఒక సినిమాలో ఒక పిల్లాడు స్కూల్‌ ఎగ్గొట్టేసి ఇంట్లో కూర్చుంటాడు. ఎందుకురా స్కూల్‌కు వెళ్లలేదని తండ్రి అడిగితే... పేదరికంపై స్కూల్లో కథ రాయమన్నారని, ఆలోచిస్తున్నానని చెబుతాడు.

Updated : 31 Mar 2024 07:13 IST

రూ.వందల కోట్లున్న అభ్యర్థులు పేదవారా?
దాడులకు పాల్పడిన వారు సౌమ్యులా?
సీఎం నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే
అభ్యర్థుల పరిచయం పేరుతో పరిహాసం
ముక్కున వేలేసుకుంటున్న ప్రజలు

కొన్నాళ్ల కిందట వచ్చిన ఒక సినిమాలో ఒక పిల్లాడు స్కూల్‌ ఎగ్గొట్టేసి ఇంట్లో కూర్చుంటాడు. ఎందుకురా స్కూల్‌కు వెళ్లలేదని తండ్రి అడిగితే... పేదరికంపై స్కూల్లో కథ రాయమన్నారని, ఆలోచిస్తున్నానని చెబుతాడు. ఏం రాస్తున్నావని తండ్రి అడిగితే... ‘అనగనగా ఒక పేద కుటుంబం. ఆ కుటుంబంలో తండ్రి చాలా పేదవాడు. తల్లికూడా పేదదే. వాళ్ల పిల్లలు, తోటమాలి, వంటవాడు, ఆఖరికి కారు డ్రైవర్‌ కూడా పేదవాడే. పాపం వాళ్లు తినడానికి చికెన్‌ బిర్యానీ కూడా దొరక్క ఆకలితో ఏసీ కారులో వెళుతుండగా...’’ అని చెబుతూ తండ్రిని బురిడీ కొట్టించాలనుకుంటాడు. ఆ తండ్రికి కోపం నషాళానికి ఎక్కి... ‘20 మంది పనోళ్లు, ఏసీకార్లు ఉన్నవాళ్లు పేదోళ్లా... ఇది రాయడానికి స్కూల్‌ ఎగ్గొడతావా?’ అని చితకబాదుతాడు. అబద్ధాల జగన్‌ తీరు కూడా ఆ పిల్లాడిలాగే ఉంది. ఆయన నోరు తెరిచారంటే అన్నీ అసత్యాలే బయటకొస్తున్నాయి.

ఈనాడు - అమరావతి

గన్‌కు జనం వెర్రి వెంగళాయిల్లా కనిపిస్తారేమో... తాను ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్మేస్తారన్న గట్టి భ్రమలో ఆయన ఉంటారేమో... ఎమ్మిగనూరులో శుక్రవారం జరిగిన వైకాపా ప్రచారసభలో తమ పార్టీ కర్నూలు లోక్‌సభ అభ్యర్థి బీవై రామయ్యతో పాటు, ఆ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు బుట్టా రేణుక, విరూపాక్షి, శ్రీదేవి, సతీష్‌, ఇంతియాజ్‌, సాయిప్రసాద్‌రెడ్డి, బాలనాగిరెడ్డిలను పరిచయం చేస్తూ, తనదైన శైలిలో చేతిని విచిత్రంగా కదిలిస్తూ జగన్‌ చెప్పిన అబద్ధాలు విని జనం ముక్కున వేలేసుకుంటున్నారు. వైకాపా అభ్యర్థులంతా పేదవారట.. పైగా మంచివాళ్లు, సౌమ్యులూనట..! నీతి ఆయోగ్‌ వంటి సంస్థలు రాత్రికి రాత్రే దేశంలో పేదరికం కొలమానాల్ని ఏమైనా మార్చేశాయా? కనీసం రూ.వంద కోట్ల ఆస్తులు ఉన్నవారినే పేదలుగా పరిగణిస్తున్నట్లు ప్రకటించాయా? లేకపోతే 2012లో సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీటు ప్రకారమే రూ.43 వేల కోట్లకుపైగా ఆస్తులున్న జగన్‌... వాటితో పోల్చుకుని పదులు, వందల కోట్లలో ఆస్తులున్న తన పార్టీ అభ్యర్థుల్ని పేదలుగా భావిస్తున్నారు కాబోలు... అనే సందేహాలు ప్రజల్లో కలుగుతున్నాయి. జగన్‌ పరిచయం చేసిన వైకాపా అభ్యర్థులు ‘ఎంత కడు పేదరికం’లో ఉన్నారో చూద్దామా...


3 కిలోల నగలు.. రూ.వందల కోట్ల ఆస్తులు

కడు పేద 1 : ఎమ్మిగనూరు అభ్యర్థి బుట్టా రేణుక

బుట్టమ్మ నా చెల్లెలు. ఆర్థికంగా కూడా పాపం అంతంత మాత్రంగానే ఉంది. 

 జగన్‌

బుట్టా రేణుక కర్నూలు మాజీ ఎంపీ. 2014లో లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఆమె సమర్పించిన అఫిడవిట్‌లో తన ఆస్తుల విలువ రూ.242.60 కోట్లుగా పేర్కొన్నారు. ఈ పదేళ్లలో అవి ఇంకా పెరిగి ఉంటాయి. కుటుంబ ఆస్తుల్నీ కలిపితే ఇంకెన్ని కోట్లు ఉంటాయో!

  •  ‘మాకు ఎడ్యుకేషన్‌, ఆటోమొబైల్స్‌, ఆతిథ్యరంగంలో వ్యాపారాలున్నాయి. మేం నడుపుతున్న మెరిడియన్‌ స్కూల్స్‌కు 3 బ్రాంచ్‌లు ఉన్నాయి. ఉప్పల్‌లో ఒక ఫ్రాంచైజీ ఇచ్చాం. మా కుమార్తె ఆలివ్‌ ప్రీస్కూల్స్‌ చైన్‌ను నడుపుతోంది. 20 ఏళ్లుగా హోండా టూ వీలర్‌ డీలర్‌షిప్‌, టాటా మోటార్స్‌ ఫోర్‌ వీలర్‌ డీలర్‌షిప్‌ ఉన్నాయి. బుట్టా కన్వెన్షన్‌ హాల్‌ను నడుపుతున్నాం. యాత్రీ నివాస్‌ హోటల్‌ను లీజుకు తీసుకుని నిర్వహిస్తున్నాం’ అని రేణుక ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
  • 2014లో సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న ప్రకారం... రేణుకకు విలువైన రత్నాలు పొదిగిన 2.250 కిలోల ఆభరణాలు ఉన్నాయి. ఆమె కుటుంబసభ్యుల దగ్గర మరో కిలో బంగారు నగలున్నాయి. 3.250 కిలోల ఆభరణాలున్నవాళ్లు  సీఎం దృష్టిలో పేదవాళ్లు. ప్రస్తుతం వాటి విలువ రూ.2 కోట్లు.
  • రేణుక కుటుంబానికి బుట్టా ఎంటర్‌ప్రైజస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, బుట్టా ఆటోమేటివ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, బుట్టా చిట్‌ ఫండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, బుట్టా కన్వెన్షన్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, బుట్టా ఫెసిలిటీ అండ్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, బుట్టా హెల్త్‌కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, బుట్టా హాస్పిటాలిటీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, బుట్టా ఇంపెక్స్‌ అండ్‌ ట్రేసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, బుట్టా ఇన్వెస్ట్‌మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, తేజస్వీ మోటార్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వంటి కంపెనీలున్నాయి.
  • రేణుక కుటుంబం నడుపుతున్న మెరిడియన్‌ స్కూళ్లు హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన బంజారాహిల్స్‌, మాదాపూర్‌ ప్రాంతాల్లో ఉన్నాయి. వాటిల్లో రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తారు. మెరిడియన్‌ ఎడ్యుటెక్‌ సొల్యూషన్స్‌లో బుట్టా కుటుంబానికి ఉన్న 25 లక్షల షేర్ల విలువ 2014లోనే రూ.25 కోట్లు.
  • 2014లోనే రూ.28 లక్షల విలువైన టయోటా ఫార్చ్యూనర్‌ కారును వినియోగించారు. రేణుక, ఆమె భర్త పేరు మీద హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ వంటి ఖరీదైన ప్రాంతాల్లో రూ.కోట్ల విలువైన స్థిరాస్తులున్నాయి. పంజాగుట్టలో ఊర్వశి హోటల్‌ ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. రేణుకది పేరుకే కర్నూలు జిల్లా అయినప్పటికీ... ఆమె స్థిరపడింది, నివాసం ఉండేదీ హైదరాబాద్‌లోనే.

కడుపేద  2
ఆదోని అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి

ఆదోని సాయన్న... డబ్బు విషయంలో అంతంత మాత్రమే. సౌమ్యుడు, మంచివాడు.

 జగన్‌

  • 2019 ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్‌ ప్రకారమే ఆదోని ఎమ్మెలే సాయిప్రసాద్‌రెడ్డి ఆస్తుల విలువ రూ.5.17 కోట్లు. తమది సంపన్న కుటుంబమని ఆయనే పలు సందర్భాల్లో చెప్పారు.
  • ప్రియదర్శిని అర్బన్‌ కోఆపరేటివ్‌ టౌన్‌ బ్యాంక్‌లో వాటాలు, షిర్డీసాయి కార్పొరేషన్‌లో ఆయన భార్యకు పెట్టుబడులున్నాయి.
  • కొనకండ్ల, రామాపురం గ్రామాల్లో 43.66 ఎకరాల వ్యవసాయ భూములున్నాయి. ఆయన భార్య పేరు మీద మరో 6.97 ఎకరాలున్నాయి. ఆదోని, నంద్యాల, నూనెపల్లి వంటి చోట్ల విలువైన స్థలాలు, ఆదోనిలో సొంతిల్లు, కర్నూలులోని టీజే అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ వంటి స్థిరాస్తులున్నాయి.
  • ఆయన పేరు మీద 25 తులాలు, ఆయన భార్య పేరు మీద 96 తులాల బంగారం ఉంది. ఇవన్నీ 2019 అఫిడవిట్‌లో వెల్లడించిన వివరాలే. బయట పెట్టని ఆస్తుల విలువ ఇంకెంత ఉంటుందో!
  • ఆయన రూ.34 లక్షల విలువైన కారు వాడుతున్నారు.
  • ఆయనపై భూకబ్జాలు, క్రికెట్‌ బెట్టింగ్‌, మట్కా, కర్ణాటక మద్యం అక్రమ రవాణా వంటి వాటిలో రూ.కోట్లకు పడగలెత్తినట్లు ఆరోపణలున్నాయి. అలాంటి వ్యక్తి పేదవాడట. గతంలో రోడ్లు బాగు చేయలేదని ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకు ఒక ఆటో డ్రైవర్‌ను ఆయన అనుచరులు తీసుకెళ్లి విచక్షణరహితంగా కొట్టారు.
  • సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని ఓ జనసేన నాయకుడి ఇంటికి వెళ్లి మరీ ఎమ్మెల్యే అనుచరులు దాడికి పాల్పడ్డారు. కానీ సీఎం దృష్టిలో ఆయన సౌమ్యుడు, మంచివాడూనట.

కడుపేద 3

మంత్రాలయం అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి

బాలనాగిరెడ్డి... మీ అందరికీ పరిచయస్థుడే. మంచివాడు, సౌమ్యుడు, కానీ డబ్బులు విషయంలో అంతంత మాత్రమే.

జగన్‌

  • 2019లో దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్‌ ప్రకారమే బాలనాగిరెడ్డి స్థిర చరాస్తుల విలువ రూ.2.29 కోట్లు.
  • ఆయనకు 400 గ్రాములు, ఆయన భార్యకు 15 తులాల బంగారం, 15 కిలోల వెండి ఉంది.
  • వీరికి ఉన్న సుమారు 44 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్‌ విలువను రూ.39.65 లక్షలుగా చూపించారు.
  • ఆయనకు ఆదోనిలో వాణిజ్య భవనాలు, గుంతకల్లు, ఎమ్మిగనూరుల్లో విశాలమైన భవనాలు, కర్నూలులో సొంతిల్లు ఉన్నాయి. బీమా ఎడ్యుకేషన్‌ సొసైటీలో వాటాలున్నాయి. ఆయన ఆస్తుల మార్కెట్‌ విలువ రూ.కోట్ల పైనే. జగన్‌ దృష్టిలో ఆయన పేదవాడట.
  • 2019 ఎన్నికల సందర్భంగా ఖగ్గల్లులో ప్రచారానికి వెళ్లిన తెదేపా అభ్యర్థి తిక్కారెడ్డిని బాలనాగిరెడ్డి మనుషులు అడ్డుకుని దాడికి పాల్పడ్డారు. తిక్కారెడ్డి కాలికి బుల్లెట్‌ తగిలి తీవ్రంగా గాయపడ్డారు. కౌతాళం మండలం ఎరిగేరి గ్రామంలో తొమ్మిది ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రైవేటు వ్యక్తులను పురమాయించి రాళ్లు పాతించారన్న ఆరోపణలొచ్చాయి.
  • నియోజకవర్గంలోని కుంబళనూరు, మరళి, గుడికంబాలి, వల్లూరు, సాతనూరు, అగసనూరు, మాధవరం, చెట్నేపల్లి, మంత్రాలయం తదితర గ్రామాల్లో తుంగభద్ర నదిలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అలాంటి వ్యక్తికి జగన్‌ సౌమ్యుడంటూ కితాబివ్వడం ప్రజల్ని ఆశ్చర్యానికి గురిచేసింది.

కడుపేద 4

పత్తికొండ అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి

శ్రీదేవి నా అక్కలాంటిది. మీ చల్లని దీవెనలు ఆమెపై ఉంచాలని కోరుతున్నా.

జగన్‌

  •  2019 ఎన్నికల అఫిడవిట్‌ ప్రకారం శ్రీదేవి ఆస్తుల విలువ రూ.3.19 కోట్లు.
  • కల్లూరు మండలం పర్ల, వెల్దుర్తి మండలం మల్లేపల్లి, సూడేపల్లి, కర్నూలు మండలం బాసపురం, కృష్ణగిరి మండలం తొగరచేడు, కర్నూలు సమీపంలోని దూపాడు గ్రామాల్లో 42.41 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.
  • కర్నూలు నగరంతో పాటు తెలంగాణలోని ఘట్‌కేసర్‌లో విలువైన స్థలాలున్నాయి. కర్నూలులోని బంగారుపేటలో వాణిజ్య భవనాలున్నాయి.
  • ఎండోమెంట్‌ కాలనీలో ఇల్లు, హైదరాబాద్‌లోని సుందర్‌నగర్‌ కాలనీలో ఓ ఇల్లు ఉంది. గుత్తేదారులు, స్థిరాస్తి వ్యాపారుల నుంచి మామూళ్ల వసూళ్లు, అడిగినంత ఇవ్వనివారిపై దాడులు, భూముల ఆక్రమణలు వంటి ఆరోపణలున్నాయి.
  • ఎమ్మెల్యేగా ఎన్నికైన కొత్తలో ఇతరులు కొనుగోలు చేసిన భూముల్లోనూ అక్రమంగా తవ్వకాలు జరిపి ఇనుప ఖనిజాన్ని పెద్దఎత్తున తరలించారనే ఆరోపణలున్నాయి.

కడుపేద 5

కోడుమూరు అభ్యర్థి సతీష్‌

సతీష్‌ సౌమ్యుడు. డాక్టరు. డబ్బులు అంతంతమాత్రంగానే ఉన్నాయి.

జగన్‌

మంత్రి ఆదిమూలపు సురేష్‌కు సతీష్‌ స్వయానా తమ్ముడు. రూ.కోట్లకు అధిపతి. వీరికి కర్నూలుతోపాటు ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం, మార్కాపురం పట్టణాల్లో విద్యా సంస్థలతోపాటు విలువైన భూములు, ప్లాట్లు ఉన్నాయి. కర్నూలులో బీఈడీ, నర్సింగ్‌ కళాశాలలతోపాటు మరో కళాశాల, కర్నూలు జొహరాపురం సమీపంలో రూ.కోట్ల విలువైన స్థలాలు, ప్లాట్లకు యజమాని.


కడుపేద 6

ఆలూరు అభ్యర్థి విరూపాక్షి

విరూపాక్షి చాలా పేదోడు

జగన్‌

విరూపాక్షి 2001 నుంచి రైల్వే క్లాస్‌-1 కాంట్రాక్టర్‌. రైల్వేలో రూ.కోట్ల విలువైన పనులు చేస్తున్నారు. సబ్‌ కాంట్రాక్ట్‌లూ తీసుకుంటున్నారు. సొంతూరు చిప్పగిరిలో ఇంటితోపాటు, ఆ మండలంలో 50 ఎకరాల పొలం,  గుంతకల్లులో రూ.కోటికిపైగా విలువ చేసే ఇళ్లున్నాయి. గుంతకల్లులో రూ.20 కోట్ల విలువైన లేఅవుట్‌ వేసి అమ్మారు. స్థిరాస్తి వ్యాపారం కొనసాగిస్తున్నారు.


కడుపేద 7

ఐఏఎస్‌ పోస్టునే వదిలేసి..

కర్నూలు అసెంబ్లీ స్థానం అభ్యర్థి, మాజీ ఐఏఎస్‌ అధికారి ఇంతియాజ్‌

ఇంతియాజ్‌ అన్న ఒక ఐఏఎస్‌ ఆఫీసర్‌. పదవికి రాజీనామా చేసి కర్నూలు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. డబ్బులు అంతంత మాత్రమే.   

జగన్‌

ఎన్నికల్లో పోటీ చేయడం కోసం ఏడాది సర్వీసు ఉండగానే ఇంతియాజ్‌ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. అప్పటికి ప్రతి నెలా భారీగా వేతనం తీసుకుంటున్నారు. ఐఏఎస్‌ అధికారిగా రాష్ట్రస్థాయిలో ఒకేసారి మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా, సెర్ప్‌ సీఈఓగా, సీసీఎల్‌ఏ అదనపు కార్యదర్శి బాధ్యతలు నిర్వర్తించారు. అంతకుముందు కీలకమైన ఉమ్మడి కృష్ణా జిల్లా కలెక్టర్‌గానూ చేశారు. ఆయనను ఎన్నికల బరిలోకి దించే ఆలోచన ఉండబట్టే.. జగన్‌ సర్కారు ఆయనకు అన్ని పోస్టుల్ని ఒకేసారి కట్టబెట్టింది. పదవీ విరమణ చేసేనాటికి ఆయన పరిధిలోని వివిధ ప్రభుత్వ శాఖకు చెందిన ఆరేడు కార్లను ఆయన వినియోగించేవారు. అలాంటి ఐఏఎస్‌ పోస్టును వదులుకుని ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారంటేనే ఆయన పేదవాడు కాదని అర్థమవుతోంది.


కడుపేద 8

అప్పుడు రూ.54 లక్షలు.. ఇప్పుడు రూ. కోట్లలో ఆస్తులు
కర్నూలు లోక్‌సభ అభ్యర్థి బీవై రామయ్య

రామయ్య పేదవాడైనా మంచితనం గుండెల నిండా ఉందని నేను సర్టిఫికెట్‌ ఇస్తున్నా.

జగన్‌

కర్నూలు మాజీ మేయర్‌ బీవై రామయ్య... 2014 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు సమర్పించిన అఫిడవిట్‌లో తన ఆస్తుల విలువ రూ.54 లక్షలుగా పేర్కొన్నారు. కానీ ఆయన ఆస్తుల విలువ రూ.కోట్లలో ఉంటుందని సమాచారం. కర్నూలు మేయర్‌ క్యాంప్‌ కార్యాలయం సమీపంలో 13 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేశారు. దాని విలువ రూ.2 కోట్లు. నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని వక్ఫ్‌ బోర్డు స్థలంలో ఆయనకు 8 సెంట్లు ఉన్నట్లు సమాచారం. దీని విలువ రూ.50 లక్షలు. నంద్యాల చెక్‌పోస్టు సమీపంలో రెండు ఇళ్లు ఉన్నాయి. వాటి విలువ రూ.2 కోట్లపైమాటే. కర్నూలు గ్రామీణ మండలం దిన్నెదేవరపాడు సమీపంలో ఓ బిల్డర్‌ 50 సెంట్ల స్థలం కానుకగా ఇచ్చినట్లు సమాచారం. దీని విలువ రూ.3 కోట్లు. నగరంలోని ఓ ట్రస్టుకు సంబంధించి టీడీఆర్‌ ఇప్పించే క్రమంలో రూ.కోటి తీసుకున్నట్లు సమాచారం. టీడీఆర్‌ రావాల్సి ఉంది. గడివేముల మండలంలో పెద్దల ఆస్తి 7 ఎకరాలు ఉండగా, మరో రెండెకరాలు ఇటీవల కాలంలో రూ.40 లక్షలు పెట్టి కొన్నట్లు సమాచారం. బి.తాండ్రపాడు సమీపం సఫా ఇంజినీరింగ్‌ కళాశాల వద్ద 3 ఎకరాల భూమి ఉంది. దీని విలువ రూ.6 కోట్లు. ఓర్వకల్లు మండలం పుడిచర్ల గ్రామంలో రెండెకరాల భూమి ఉన్నట్లు సమాచారం. దీని విలువ రూ.4 కోట్లపైనే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని