వారే అడ్డుకుంటూ.. నెపం తెదేపాపై నెట్టేస్తూ

సామాజిక పింఛన్ల పంపిణీలో వైకాపా ప్రభుత్వం భారీ కుట్రకు తెరలేపింది. నాలుగున్నరేళ్లుగా నడుస్తున్న ఇంటింటికీ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని తానే అడ్డుకుని ఆ నెపాన్ని ప్రతిపక్ష తెదేపాపై నెడుతోంది.

Updated : 01 Apr 2024 07:10 IST

ఇంటింటికీ పింఛన్ల పంపిణీపై వైకాపా కుట్ర
దీనికి ఉన్నతాధికారుల అండ
వృద్ధుల్ని ఎండల్లో నడిపించే దుర్మార్గపు ఆట
పంపిణీలో జాప్యం చేయాలని ముందే నిర్ణయం
పథకం ప్రకారమే అమలు
ఈనాడు - అమరావతి

సామాజిక పింఛన్ల పంపిణీలో వైకాపా ప్రభుత్వం భారీ కుట్రకు తెరలేపింది. నాలుగున్నరేళ్లుగా నడుస్తున్న ఇంటింటికీ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని తానే అడ్డుకుని ఆ నెపాన్ని ప్రతిపక్ష తెదేపాపై నెడుతోంది. పింఛన్ల పంపిణీని గ్రామ/వార్డు సచివాలయాలకే పరిమితం చేసి వృద్ధులతోపాటు దివ్యాంగులు, మహిళల్ని మూడు, నాలుగు కిలోమీటర్ల దూరంలోని సచివాలయాలకు 42 డిగ్రీలకు పైగా ఎండల్లో నడిపించే వికృత రాజకీయ క్రీడ ప్రారంభించింది. గిరిజన ప్రాంతాల్లోని పింఛనుదారుల్ని కొండలు, గుట్టలు ఎక్కించి వాగులు, వంకలు దాటించి మరింత ఇబ్బందులు పెట్టే దుర్మార్గానికి ఒడిగట్టింది. దీనంతటికీ ప్రతిపక్షాలే కారణమనేలా.. పింఛనుదారులందరిలో విషబీజాలు నాటడమే వైకాపా సర్కారు ముఖ్య ఉద్దేశం. అందుకు అనుగుణంగానే శనివారం సాయంత్రం నుంచే సామాజిక మాధ్యమాల వేదికగా విషం చిమ్మే ప్రక్రియ మొదలు పెట్టింది. 15 వేలకు పైగా సచివాలయాల్లోని 1.35 లక్షల మంది గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు సునాయాసంగా ఇళ్ల వద్దనే పింఛన్లు పంపిణీ చేసే అవకాశం ఉన్నా కావాలనే పక్కన పెట్టి కుటిల రాజకీయం చేస్తోంది. ఇందులో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ముఖ్యమంత్రి కార్యాలయంలో ఓ కీలక అధికారి, సెర్ప్‌ సీఈఓ మురళీధర్‌రెడ్డిల ప్రమేయం ఉందని ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి. ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శల్ని సీఎస్‌ జవహర్‌రెడ్డి మూటగట్టుకుంటున్నారు. పింఛనుదారుల్ని సచివాలయాల దగ్గరకు రప్పించి నిరీక్షించేలా చేయాలని.. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇబ్బందులు పెట్టి చంద్రబాబు కారణంగానే ఇలాంటి పరిస్థితొచ్చిందని వైకాపా ప్రచారం చేసేలా అధికార యంత్రాంగం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నాయి.

సచివాలయాల దగ్గరే పంపిణీ అంటూ ఉత్తర్వులు

వాస్తవానికి వాలంటీర్లు లేకపోయినా ఇంటింటికీ పింఛను పంపిణీ చేయడానికి సరిపడా ఉద్యోగులు గ్రామ/వార్డు సచివాలయాల్లో ఉన్నారని ఎన్నికల సంఘానికి ప్రభుత్వ యంత్రాంగం ముందుగానే సమాచారం ఇచ్చింది. తీరా వాలంటీర్లను పక్కన పెట్టాలనే ఆదేశాలు వెలువడ్డాక అసలు వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. సచివాలయాల వద్దనే పంపిణీ చేయాలంటూ సెర్ప్‌ సీఈఓ మురళీధర్‌రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయాలని తాము డిమాండు చేశాక.. ఆఘమేఘాలపై సచివాలయాల వద్దే ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారని తెదేపా అనుమానిస్తోంది. ఈ ఉత్తర్వులు ఇంకా క్షేత్రస్థాయి అధికారులకు చేరకముందే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇంటింటికీ పింఛన్లు ఇవ్వడం లేదంటూ విలేకరుల సమావేశం పెట్టి ప్రకటించడం గమనార్హం.

ఎన్నికల సంఘం పవిత్రతపైనా బురదజల్లేలా

ఎన్నికల సంఘం పవిత్రతపైనా బురద జల్లేందుకు వైకాపా తెగబడింది. ‘రాష్ట్రంలో వాలంటీర్లంతా వైకాపా కార్యకర్తలే, మా అభ్యర్థుల గెలుపుకోసం పనిచేయాలి’ అని ముఖ్యమంత్రి జగన్‌ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు గతంలోనూ, ఇటీవల ఆదేశించారు. అలాంటప్పుడు వైకాపా కార్యకర్తలతో నగదు పంపిణీని ఎన్నికల సంఘం ఎలా అనుమతిస్తుందనే ఇంగితం కూడా వైకాపా నేతలకు లేకపోయింది. నగదు పంపిణీకి వాలంటీర్లను దూరంగా పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చేసరికి ఏకంగా రాజ్యాంగబద్ధ సంస్థపై దాడికీ వెనకాడటం లేదు. వాస్తవానికి అమల్లో ఉన్న ప్రభుత్వ పథకాలను  కొనసాగించడమంటే ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేయడమే. ఈ విషయంపై ఎన్నికల సంఘం కూడా జోక్యం చేసుకుని ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది.

ముఖ్యమంత్రి కార్యాలయం పాత్రేంటి?

వాలంటీర్లను పింఛన్ల పంపిణీ నుంచి పక్కన పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ పంపిణీపై ఉన్నతస్థాయి చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సరిపడా ఉద్యోగులు ఉన్నా, మూడు రోజుల్లో పంపిణీ పూర్తి చేయొచ్చని తెలిసినా సీఎంఓలో అన్ని వ్యవహారాలూ తానై నడిపే కీలక అధికారి అలా చేయొద్దని చెప్పారని ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి. పింఛనుదారులందరినీ సచివాలయాలకు పిలిపించేలా ఆయన నిర్ణయం తీసుకుని సెర్ప్‌ ద్వారా ఉత్తర్వులు ఇప్పించారని విమర్శిస్తున్నాయి. సదరు అధికారి 2019 ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే జగన్‌ చెంత చేరారు. అప్పటి నుంచి అధికార యంత్రాంగంలో ఆయనే నంబర్‌ 1. సివిల్‌ సర్వీసు అధికారుల నియామకం నుంచి వైకాపా టికెట్ల పంపిణీ వరకు అన్నీ తానై చక్రం తిప్పుతుండటంతో పాటు వైకాపా ఎమ్మెల్యే, ఎంపీల పనితీరుపై సర్వే ఫలితాలను ఆయనే పర్యవేక్షించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో వైకాపాకు లబ్ధి చేకూర్చేందుకు వీలుగా వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శిస్తున్నాయి.]

జవహర్‌రెడ్డికి బాధ్యత లేదా?

అమల్లో ఉన్న ప్రభుత్వ పథకాల్లో మార్పులు చేస్తే ఆచరణలో ఎలాంటి ఇబ్బందులు వస్తాయో సీఎస్‌గా ఉన్న జవహర్‌రెడ్డికి తెలియదా? తెలిసినప్పుడు అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి కదా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. పింఛన్ల పంపిణీపై ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఫోన్‌ చేస్తే పదిరోజులు పడుతుందని చెప్పడం ఏమిటని ఆయన వైపు కూడా అనుమానంగా చూస్తున్నాయి.

మురళీధర్‌రెడ్డి పాత్రలేదా?

ఇంటింటికీ పింఛన్ల పంపిణీని పక్కన పెట్టి సచివాలయాలకు రావాల్సిందే అంటూ సెర్ప్‌ సీఈఓ మురళీధర్‌రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. ఆయన వైకాపా పెద్దలు చెప్పినట్లే తలాడిస్తున్నారని, కనీసం ఇంటింటికీ పింఛన్ల పంపిణీ చేయాలనే ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి పంపలేదని ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి. మురళీధర్‌రెడ్డి.. పూర్వాశ్రమంలో ఏపీఐఐసీ ద్వారా తక్కువ ధరకే భూములు కేటాయించి ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చారని సీబీఐ నమోదు చేసిన కేసులో జగన్‌కు సహ నిందితుడు. వైకాపా ప్రభుత్వంలో కీలక అధికారి. సెర్ప్‌లో పనిచేస్తున్న అధికారుల్లో అత్యధికులు వైకాపాతో అంటకాగుతున్నవారేనన్న ఆరోపణలున్నాయి. నిన్నమొన్నటి వరకు సీఈఓగా  పనిచేసిన ఇంతియాజ్‌.. ఇప్పుడు కర్నూలు నుంచి వైకాపా అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తుండటం తెలిసిందే.


నిధులు ముందే ఎందుకు తీసుకోలేదు?

న్నికల కోడ్‌ వచ్చాక ప్రభుత్వం రూ.13వేల కోట్ల బిల్లులు చెల్లించింది. నియమావళి అమల్లో ఉన్నా.. స్క్రీనింగ్‌ కమిటీ ఆమోదం లేకుండా తమకు అనుకూలురైన వారికి రూ.వందలు, వేల కోట్ల బిల్లులు చెల్లించేశారు. పింఛన్ల పంపిణీ దగ్గరకు వచ్చేసరికి ఆర్థిక సంవత్సరం ముగింపు, బ్యాంకు సెలవులు అంటూ ప్రభుత్వం కొర్రీలు వేస్తోంది. సెలవు దినాలుంటే బ్యాంకుల్ని సంప్రదించి పింఛన్ల కోసం రూ.1,958 కోట్లు సిద్ధం చేయలేరా? సాధారణంగా ప్రతి నెలా 1వ తేదీకి ముందే నగదు తీసుకుంటారు. ఇప్పుడు ఆ ముందు చూపు ఏమైంది? మూడో తేదీ నుంచి పింఛను పంపిణీ అని సెర్ప్‌ ముందే చెప్పడంలో ఆంతర్యమేంటి? అంటే జాప్యం చేయాలని ముందే నిర్ణయించుకుని.. దాన్ని అమలు చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


ఇంటింటికీ పంపిణీ సులువే..

క్కో సచివాలయం పరిధిలో సగటున 9 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా పంపిణీ చేయాల్సిన పింఛన్లు 350 నుంచి 500 వరకు ఉంటాయి. అంటే ఒక్కో సచివాలయ ఉద్యోగికి సగటున 49 వరకు వస్తాయి. వాలంటీర్లు ఇప్పటి వరకు పింఛన్ల  పంపిణీకి నాలుగైదు రోజుల సమయం తీసుకుంటున్నారు. సచివాలయ ఉద్యోగుల ద్వారా రెండు, మూడు రోజుల్లోనే పంపిణీ పూర్తి చేయించవచ్చు. ఇప్పుడు వారికి పని ఒత్తిడి ఏమీ లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని