కుట్ర అమలుకు తహతహ

పింఛనుదారులను ఇళ్ల నుంచి సచివాలయాల వద్దకు రప్పించి అక్కడే పింఛను ఇచ్చేలా వైకాపా పన్నిన కుట్ర అమలుకు పరోక్షంగా సహకరించేలా ఆదేశాలిచ్చిన సెర్ప్‌ సీఈఓ మురళీధరరెడ్డి.. చివరి వరకు దాన్ని కొనసాగించేందుకు విశ్వ ప్రయత్నం చేశారు.

Updated : 02 Apr 2024 09:43 IST

ఇంటింటికీ వెళ్లి పింఛన్లు ఇవ్వడం కుదరదట!
అడ్డుకునేందుకు సెర్ప్‌ సీఈవో మురళీధరరెడ్డి విశ్వప్రయత్నం
మెజారిటీ కలెక్టర్లు ఆమోదం తెలిపినా మొండిపట్టు
ఈనాడు - అమరావతి

పింఛనుదారులను ఇళ్ల నుంచి సచివాలయాల వద్దకు రప్పించి అక్కడే పింఛను ఇచ్చేలా వైకాపా పన్నిన కుట్ర అమలుకు పరోక్షంగా సహకరించేలా ఆదేశాలిచ్చిన సెర్ప్‌ సీఈఓ మురళీధరరెడ్డి.. చివరి వరకు దాన్ని కొనసాగించేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. ఇంటింటికీ పింఛన్ల పంపిణీపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగులను పింఛనుదారుల ఇళ్ల దగ్గరకు పంపి పింఛను అందించడం కుదరని పని అని ఆయన తేల్చిచెప్పినట్టు తెలిసింది. అత్యధిక జిల్లాల కలెక్టర్లు ఇళ్ల వద్ద పంపిణీకే మొగ్గు చూపినా దాన్ని అడ్డుకునేందుకే మురళీధరరెడ్డి ప్రయత్నించారని సమాచారం.  ‘వారే అడ్డుకుంటూ... నెపాన్ని తెదేపాపై వేస్తూ’ శీర్షికన ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనం రాష్ట్రవ్యాప్తంగా సోమవారం సంచలనంగా మారింది. దీనిపై సోమవారం సీఎస్‌ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.

ఇందులో ఇంటింటికీ పింఛన్ల పంపిణీపై జిల్లా కలెక్టర్ల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. మెజారిటీ కలెక్టర్లు గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా పింఛనుదారుల ఇళ్ల వద్దనే పింఛను అందించాలనే నిర్ణయానికి మొగ్గుచూపారు. కానీ మురళీధరరెడ్డి ఒక్కరే అది సాధ్యపడదని  చెప్పినట్లు తెలిసింది. గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులతోగానీ, ఆ శాఖ నిర్ణయాలతోనూ ఆయనకు సంబంధం ఉండదు. కేవలం పింఛన్ల నిధులు సమీకరించి విడుదల చేయడం, పంపిణీ తీరును పర్యవేక్షించడమే సెర్ప్‌ పరిధి. కానీ దానికి భిన్నంగా మురళీధరరెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఓ కీలక ఉన్నతాధికారి చెప్పినట్టల్లా తలాడిస్తూ.. వైకాపాకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సచివాలయ ఉద్యోగులు ఉండేది పింఛన్ల పంపిణీ కోసమే కాదు.. వారికి ఇతర పనులూ ఉంటాయి, వారు ఇంటింటికీ వెళ్లి పింఛను ఇచ్చేందుకు మ్యాపింగ్‌ వంటి సమస్యలు వస్తాయంటూ మురళీధరరెడ్డి వింత వాదన తెరపైకి తెచ్చారు.

ఎన్నికల సమయంలో నగదు పంపిణీ పథకాలన్నీ నిలిచిపోయాయి. ఇప్పుడు సచివాలయ ఉద్యోగులపై పని ఒత్తిడి కూడా లేదు. ఇది తెలిసీ ఇతర పనులున్నాయనేలా బుకాయించడం మురళీధర్‌రెడ్డి ఉద్దేశాన్ని చాటుతోంది. ఇక వాలంటీర్ల క్లస్టర్లను సచివాలయ ఉద్యోగులకు మ్యాపింగ్‌ చేయడం మహా అంటే రెండు మూడు గంటల పని. మ్యాపింగ్‌ సమస్యలున్నా అది గ్రామ, వార్డు సచివాలయాల శాఖ చూసుకుంటుంది. ఆ శాఖ కూడా ఆయన పరిధిలోనే ఉన్నట్టు నిర్ణయాలు తీసుకుంటున్నారంటే మురళీధరరెడ్డి ఏ స్థాయిలో వైకాపాకు వంత పాడేందుకు కంకణం కట్టుకున్నారో ఇట్టే అర్థమవుతోంది. 

మొదటి నుంచి అత్యుత్సాహమే

ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంచే ప్రక్రియను అడ్డుకునేందుకు వైకాపా పన్నిన ముందస్తు వ్యూహాన్ని అమలు చేయడంలో మురళీధరరెడ్డి మొదటి నుంచీ అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. 1వ తేదీకి ముందే పింఛన్ల నగదును సమీకరించుకునేందుకు అవకాశమున్నా పట్టించుకోలేదు. ఆర్థిక సంవత్సరం ముగింపు, బ్యాంకు సెలవుల్ని సాకుగా చూపి ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2022 ఏప్రిల్‌లో ఇదే తరహా పరిస్థితి ఉన్నా 1వ తేదీనే పింఛన్లు పంపిణీ చేశారు. అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడేం వచ్చింది? ఎన్నికల కోడ్‌ వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం రూ.13 వేల కోట్ల బిల్లులు చెల్లించింది. స్క్రీనింగ్‌ కమిటీ దృష్టికి తీసుకెళ్లకుండానే కొంతమంది వైకాపా నేతలు, వారి అనుచర వర్గానికి బిల్లులు చెల్లించారు. వృద్ధులపై మమకారముంటే అందులో నుంచి పింఛన్లకు అవసరమయ్యే రూ.1,980 కోట్లు ఎందుకు పక్కన పెట్టలేదు? ఇదేమీ లేకుండానే మూడో తేదీ నుంచి పంపిణీ చేస్తామని ఆదేశాలిచ్చారు.

కొంతమంది వాలంటీర్లు బరితెగించి వైకాపాకు ప్రచారం చేస్తున్నారని తెలిసికూడా.. వారే ఇంటింటికీ వెళ్లి పింఛను పంపిణీ చేస్తారని స్పష్టం చేశారంటేనే ఆయన వైకాపాతో ఎంత అంటకాగుతున్నారో తెలిసిపోతోంది. హైకోర్టు సూచనల్ని పరిగణనలోకి తీసుకుని కేంద్ర ఎన్నికల సంఘం పింఛన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను పక్కన పెడితే.. దాన్ని తెదేపాకు ఆపాదించేందుకు వైకాపా పన్నిన కుతంత్రాన్ని అమలు చేసేలా పింఛనుదారులను సచివాలయాలకు రప్పించి పింఛను పంపిణీ చేసేలా మురళీధరరెడ్డి ఆదేశాలిచ్చారు. ఇదంతా ముఖ్యమంత్రి కార్యాలయంలో నంబర్‌ 1గా ఉన్న ఓ ఉన్నతాధికారి ఆదేశాలకు అనుగుణంగానే సాగినట్టు ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి.

పింఛన్ల పంపిణీ మార్గదర్శకాల్లో సవరణలు 

సామాజిక పింఛనుదార్లు సచివాలయాలకే వచ్చి పింఛన్లు తీసుకోవాలన్న సెర్ప్‌ సీఈవో ఆదేశాలు వివాదాస్పదమవడంతో పింఛన్ల పంపిణీకి సంబంధించిన మార్గదర్శకాలను పునస్సమీక్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయంలో అధికారులతో సమావేశమైన సీఎస్‌ జవహర్‌రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. సవరించిన మార్గదర్శకాలు సోమవారం అర్ధరాత్రికి లేదా మంగళవారం వెలువడే అవకాశాలున్నాయి. బుధవారం నుంచి పింఛన్ల పంపిణీలో సాధ్యాసాధ్యాలపై జిల్లా కలెక్టర్లతో సీఎస్‌ దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు. ‘ఎండల తీవ్రత దృష్ట్యా ఉపాధి హామీ పనులను ఉదయం 10.30 గంటల్లోపే పూర్తిచేయాలి. మంచినీటి చెరువులు నింపేందుకు ఈనెల 4న ప్రకాశం బ్యారేజి నుంచి ఏలూరు, బందరు, రైవస్‌ కాలువలకు.. 8న నాగార్జున కుడి ప్రధాన కాలువ ద్వారా నీటిని విడుదల చేయాలి’ అని సీఎస్‌ ఆదేశించారు.


సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లడం కొత్తా!

సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లడం ఇప్పుడే కొత్త అన్నట్టు వైకాపా ప్రభుత్వం, మురళీధరరెడ్డి హంగామా చేస్తున్నారు. కులగణన పేరుతో సచివాలయ ఉద్యోగులను ఇంటింటికీ పంపి ప్రతి కుటుంబం సమాచారం సేకరించిన సంగతి అప్పుడే మరిచిపోయారా? అంతపెద్ద కార్యక్రమానికి ప్రభుత్వం మొదట్లో ఇచ్చిన గడువు వారమే కదా?అంతకంటే పింఛన్ల పంపిణీ పెద్ద పనా?  బెనిఫిషియరీ అవుట్‌ రీచ్‌ యాప్‌ పేరుతో లబ్ధిదారుల వివరాలు సేకరించేందుకు ఎన్నిసార్లు సచివాలయ ఉద్యోగులను ప్రజల ఇళ్లకు పంపలేదు? ఆ ఉద్యోగులతో జగన్‌ భజన చేయించేందుకు ఇంటింటికీ పంపలేదా? వీటన్నింటికీ లేని  ఇబ్బంది ఏ ఆదరువూ లేని వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, ఇతరుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛను ఇవ్వడంలోనే వచ్చిందా?


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని