వృద్ధుడి మృతిపై వైకాపా దుష్ప్రచారం

బాపట్ల జిల్లా బాపట్ల మండలం కొండుభొట్లపాలెం జేపీనగర్‌కు చెందిన వృద్ధుడు పర్వతరెడ్డి రామ్మూర్తి (82) మృతిపై వైకాపా దుష్ప్రచారానికి తెరతీసింది. స్వయంగా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోన రఘుపతి విలేకరుల సమావేశం నిర్వహించి ఇలాంటి ప్రచారానికి పాల్పడ్డారు.

Published : 02 Apr 2024 03:28 IST

ఇంటి వద్ద పింఛను అందదన్న మనోవేదనే కారణమన్న వైకాపా అభ్యర్థి
సహజ మరణం అంటున్న కుటుంబీకులు

బాపట్ల, న్యూస్‌టుడే: బాపట్ల జిల్లా బాపట్ల మండలం కొండుభొట్లపాలెం జేపీనగర్‌కు చెందిన వృద్ధుడు పర్వతరెడ్డి రామ్మూర్తి (82) మృతిపై వైకాపా దుష్ప్రచారానికి తెరతీసింది. స్వయంగా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోన రఘుపతి విలేకరుల సమావేశం నిర్వహించి ఇలాంటి ప్రచారానికి పాల్పడ్డారు. తన మామకు గతంలో గుండె సంబంధిత సమస్య ఉందని, ఎనిమిది నెలల కిందట బైపాస్‌ శస్త్రచికిత్స జరిగిందని రామ్మూర్తి అల్లుడు తోటకూర శ్రీనివాసరావు తెలిపారు. రెండ్రోజుల నుంచి ఆరోగ్యం బాగోలేదని, సోమవారం తెల్లవారుజామున 5.45 గంటలకు మంచంపై పడుకుని ఉండగానే గుండెపోటు వచ్చి చనిపోయారని చెప్పారు. దీనికి పూర్తి భిన్నంగా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోన రఘుపతి స్పందించారు. పింఛను ఇంటి వద్ద అందదని తెలిసి వృద్ధుడు మనోవేదనతో చనిపోయారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ‘రామ్మూర్తి తెల్లవారుజామున ఐదింటికి వాలంటీరు వద్దకు వెళ్లి పింఛను సొమ్ము గురించి అడిగారు. తాను పంచడం లేదని.. సచివాలయం వద్దకు వెళ్లాలని ఆయన సూచించారు. పింఛను చెల్లించే విషయంలో స్పష్టత రాలేదని సచివాలయం వద్ద చెప్పటంతో వృద్ధుడు మనోవేదనకు గురయ్యారు. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరి చనిపోయారు’ అని తెలిపారు. సోమవారం తెల్లవారుజామున వృద్ధుడు ఇంటి నుంచి బయటకు వెళ్లలేదని, ఎవరినీ కలవలేదని, కాలకృత్యాలు తీర్చుకున్నాక మంచంపైనే గుండెపోటుతో చనిపోయారని రామ్మూర్తి కుటుంబసభ్యులు చెప్పటం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని