ఈడ్చికొట్టిన ఈసీ

వాళ్లంతా అఖిలభారత సర్వీసు అధికారులమనే ఇంగితం మరిచారు. అధికార వైకాపాకు బంటుల్లా మారారు. వైకాపా నాయకులు చెప్పిందే చట్టం. వారి మాటే శాసనం అన్నట్టుగా పనిచేశారు.

Updated : 03 Apr 2024 15:57 IST

జగన్‌ భక్త ఉన్నతాధికారులను పక్కన పెట్టిన కేంద్ర ఎన్నికల సంఘం
ఐజీ, ముగ్గురు కలెక్టర్లు, అయిదుగురు ఎస్పీల బదిలీ
అధికార పార్టీ అరాచకాలకు కొమ్ము కాసినందుకు శిక్ష
ప్రతిపక్షాల అణచివేత. నిబంధనల పాతరకు ఫలితం
ఈనాడు - అమరావతి

వాళ్లంతా అఖిలభారత సర్వీసు అధికారులమనే ఇంగితం మరిచారు. అధికార వైకాపాకు బంటుల్లా మారారు. వైకాపా నాయకులు చెప్పిందే చట్టం. వారి మాటే శాసనం అన్నట్టుగా పనిచేశారు. అయిదేళ్లుగా అధికార పార్టీ అరాచకాలకు కొమ్ముకాస్తూ పేట్రేగిన ఈ అధికార గణం.. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినప్పటికీ స్వామిభక్తిని వీడలేదు. అధికార పార్టీ సేవలను ఆపలేదు. ప్రతిపక్షాలను అణచివేశారు. తప్పు మీద తప్పు చేస్తూ వచ్చారు. ప్రభుత్వ పెద్దల అండ పుష్కలంగా ఉంటే తమను ఎవరేం చేస్తారనే ధీమాతో చెలరేగారు. చివరికి వారి తప్పులు నిగ్గు తేలాయి. కొంత ఆలస్యంగానైనా సరే కేంద్ర ఎన్నికల సంఘం ఎట్టకేలకు వారిపై వేటు వేసింది. గుంటూరు ఐజీ జి.పాలరాజు, కృష్ణా, అనంతపురం, తిరుపతి జిల్లాల కలెక్టర్లు పి.రాజబాబు,   ఎం.గౌతమి, డా.లక్ష్మీశ, ప్రకాశం, పల్నాడు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల ఎస్పీలు పరమేశ్వరరెడ్డి, వై.రవిశంకరరెడ్డి, పల్లె జాషువా, కేకేఎన్‌ అన్బురాజన్‌, కె.తిరుమలేశ్వరరెడ్డిలను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది. నిబంధనలకు పాతరేసిన జగన్‌ భక్త అధికారులకు ఇది చెంపపెట్టు..


అధికార పార్టీ నాయకుల అడుగులకు మడుగులొత్తిన ఉన్నతాధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. నిబంధనలకు పాతరేసిన ఈ సీనియర్‌ బ్యూరోక్రాట్లు.. వైకాపా కోసం ఆ పార్టీ కార్యకర్తలను మించి పనిచేస్తున్నారని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు గుప్పించాయి. ఈసీకి పలు మార్లు ఫిర్యాదులు చేసి.. వారిని విధుల నుంచి తప్పించాలని విజ్ఞప్తి చేశాయి.   వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న కమిషన్‌.. తన అధికారాలను ఉపయోగించి కఠిన చర్యలు తీసుకుంది.

 ఈనాడు, అమరావతి


కలెక్టర్‌గా కంటే.. వైకాపా కార్యకర్తగానే విధులు

  • లక్ష్మీశ.. కలెక్టర్‌గాకంటే అధికార వైకాపా కార్యకర్తగానే ఎక్కువగా పనిచేశారు. జనవరి 31న తిరుపతి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన.. ఆ వెంటనే తితిదే ఛైర్మన్‌, తిరుపతి వైకాపా ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఇంటికి వెళ్లి దర్శించుకున్నారు.  తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల సమయంలో ఈఆర్వో లాగిన్‌ నుంచి 35 వేలకుపైగా ఎపిక్‌ కార్డులు అక్రమంగా డౌన్‌లోడ్‌ చేసి వాటితో పెద్దఎత్తున దొంగ ఓట్లు వేయించిన వ్యవహారంలో కరుణాకరరెడ్డి, ఆయన కుమారుడు అభినయ్‌రెడ్డి ప్రమేయంపై అభియోగాలు ఉన్నాయి. లక్ష్మీశ కంటే ముందు ఆ జిల్లాలో పనిచేసిన గిరీషా ఈ దొంగ ఓట్ల వ్యవహారంలోనే సస్పెండయ్యారు. ఆయన స్థానంలో అక్కడికి వెళ్లిన లక్ష్మీశ.. వైకాపా నాయకులతో అంటకాగారు.
  • చంద్రగిరి ఎమ్మెల్యే, ఒంగోలు లోక్‌సభ వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఓటర్లకు పంపిణీ చేసేందుకు రేణిగుంట సమీపంలోని ఓ గోదాములో నిల్వ చేసిన తాయిలాలను ప్రతిపక్షాలు పట్టించాయి. ఈ వ్యవహారంలో లక్ష్మీశ పూర్తిగా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు. కిందిస్థాయి అధికారులను అక్కడికి పంపించి మొక్కుబడిగా తేల్చేశారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి నివేదికా ఇవ్వలేదు. చెవిరెడ్డిపై కేసు నమోదు చేయించలేదు. అధికార పార్టీ నాయకుల ఎన్నికల అక్రమాలపై ప్రతిపక్షాలు ఎన్ని ఫిర్యాదులిస్తున్నా పట్టించుకోలేదు. అధికార పార్టీ పట్ల విపరీతమైన స్వామి భక్తిని ప్రదర్శించిన ఆయనపై ఎట్టకేలకు ఎన్నికల సంఘం వేటు వేసింది. అధికార పార్టీ పట్ల విపరీతమైన స్వామి భక్తిని ప్రదర్శించిన ఆయనపై ఎట్టకేలకు ఎన్నికల సంఘం వేటు వేసింది.

వైకాపా కోసం ప్రధాని మోదీ సభ భద్రతనే గాలికొదిలేశారు

వైకాపా అరాచకాలకు వత్తాసు పలికిన ఎస్పీల్లో రవిశంకర్‌రెడ్డి ప్రధానమైనవారు. పల్నాడు జిల్లాలో వరుసగా జరుగుతున్న హింసాత్మక ఘటనలను అరికట్టలేకపోయారు. ప్రతిపక్ష పార్టీ కార్యాలయం, ప్రతిపక్ష నాయకులు, సానుభూతిపరుల ఇళ్లలోకి వైకాపా శ్రేణులు చొరబడి అరాచకం సృష్టిస్తే అవన్నీ చాలా చిన్న సంఘటనలేనని తేల్చేశారు.  అవి పాత ఫ్యాక్షన్‌ గొడవల వల్లే జరిగాయంటూ మాట్లాడారు. తెదేపా వారిపై అక్రమంగా కేసులు పెట్టించి వేధించారు. బైండోవర్‌ చేయించి వారిని కట్టడి చేశారు. ఈయన హయాంలో పల్నాడు జిల్లాలో తెదేపా నేతల హత్యల పరంపర కొనసాగింది. మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెప్పిందే చట్టమన్నట్లుగా పనిచేశారు.

  • ప్రధాని నరేంద్రమోదీ ముఖ్యఅతిథిగా హాజరైన ‘ప్రజాగళం’ సభ భద్రతను గాలికొదిలేశారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినా సరే వైకాపా, ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు నడుచుకున్నారు. పోలీసుల నిర్లక్ష్యం ఫలితంగా కొందరు ఆకతాయిలు ప్రధాన వేదికకు సమీపంలోని గ్యాలరీలోకి నీళ్ల సీసాలు విసిరారు. వేదిక ముందే తోపులాట చోటుచేసుకుంది. ప్రాంగణంలోని టవర్లపైకి కొంతమంది ఎక్కటంతో వారిని కిందికి దించాలని ప్రధాని స్వయంగా వేదికపై నుంచి పోలీసులను కోరాల్సి వచ్చింది. ఎన్‌ఎస్‌జీ, ఎస్పీజీ బృందాలు సభాప్రాంగణంలో బందోబస్తుపరంగా లోపాలున్నాయని గుర్తించి రాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేసినా వారు సరిగ్గా స్పందించలేదు.
  • ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన మర్నాడే మాచర్లలో తెదేపా కార్యకర్త ఇర్ల సురేష్‌ కారును వైకాపా నాయకులు దహనం చేశారు. ఈ ఘటనపై ఎన్నికల సంఘం ఎస్పీ రవిశంకర్‌రెడ్డిని పిలిపించి ప్రశ్నించింది.

అధికార పార్టీ అరాచకాలకు కొమ్ముకాస్తూ...

  • వైకాపా అనుకూల, వారి అరాచకాలకు కొమ్ముకాసే అధికారిగా పరమేశ్వర్‌రెడ్డి గుర్తింపు పొందారు. గతంలో సీఎం జగన్‌ భద్రత విభాగంలో పనిచేసిన పరమేశ్వర్‌రెడ్డి 2022 ఏప్రిల్‌ నుంచి జనవరి వరకూ తిరుపతి ఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో చంద్రగిరి వైకాపా ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డిలతో సన్నిహితంగా ఉంటూ, వారి అరాచకాలకు కొమ్ముకాస్తూ ప్రతిపక్షాలను వేధించేవారు.
  • గతేడాది మార్చిలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరుపతి కేంద్రంగా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి.  పరమేశ్వర్‌రెడ్డే ఎస్పీగా ఉన్నా వాటిని నిలువరించలేదు.  చంద్రగిరి నియోజకవర్గంలో ప్రతిపక్షాల ఓట్ల తొలగింపునకు నకిలీ ఫాం-7 దరఖాస్తులు చేసిన వారిపై ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇటీవల పది కేసులు నమోదయ్యాయి. ఆయా కేసుల్లో నిందితులందరూ వైకాపావారే. కానీ వారిలో ఒక్కరినీ ఈయన అరెస్టు చేయించలేదు. శ్రీకాళహస్తి సీఐగా పనిచేసిన అంజూయాదవ్‌ జనసేన నాయకుడు సాయిపై చేయి చేసుకున్న వ్యవహారంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యల వల్లే రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తిదంటూ రాజకీయ నాయకుడి మాదిరి పరమేశ్వర్‌రెడ్డి ప్రకటన ఇచ్చారు. రాష్ట్రంలో గంజాయి వినియోగం, సాగు బాగా పెరిగిందంటూ తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ విమర్శలకు కౌంటర్‌ ఇస్తూ మాట్లాడారు.
  • ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన వెంటనే ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గడికోట పంచాయతీకి చెందిన తెదేపా నాయకుడు పాముల మునయ్య(37)ను వైకాపా నాయకులు హతమార్చారు. ఈ రాజకీయ హత్యపై సీరియస్‌ అయిన ఎన్నికల సంఘం ఆయన్ను పిలిపించి ప్రశ్నించింది.

ప్రధాని సభ ఏర్పాట్లలోనూ నిర్లక్ష్యమే

ప్రధాని మోదీ పాల్గొన్న ప్రజాగళం సభ భద్రత ఏర్పాట్లలో అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి వారు చెప్పినట్టు పనిచేశారు. ఇటీవల ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన ఇన్‌స్పెక్టర్ల బదిలీల్లోనూ వైకాపా నాయకుల సిఫార్సులకే ప్రాధాన్యమిచ్చారు. వారు కోరుకున్న వారిని కోరుకున్నచోట నియమించారు. రేంజ్‌ పరిధిలో ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలపై పెద్ద ఎత్తున అక్రమ కేసులు బనాయిస్తున్నా అడ్డుకోలేదు. తెదేపా నాయకులు ఇచ్చిన ఫిర్యాదులను పట్టించుకోలేదు. నెల్లూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల ఎస్పీలు పేట్రేగిపోతున్నా నిలువరించలేదు. ‘ప్రధాని సభలో భద్రతా వైఫల్యాలకు డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి, నిఘా విభాగాధిపతి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులతో పాటు గుంటూరు ఐజీ పాలరాజు కారణమని, వారిపై చర్యలు తీసుకోవాలంటూ గత నెల 18న విపక్ష నాయకులు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు.


పేర్ని నాని చెప్పిందే చట్టం

 ఏడాదిగా కృష్ణా జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న రాజబాబు.. మచిలీపట్నం వైకాపా ఎమ్మెల్యే పేర్ని నాని ఏది చెబితే అదే చట్టమన్నట్టు పనిచేశారు. బోగస్‌ ఓటర్లపై ఎన్ని ఫిర్యాదులొచ్చినా చర్యలు తీసుకోలేదు. నకిలీ ఓట్లకు బాధ్యుడైన ఆర్డీవోపై చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల సంఘం ఆదేశాలను బేఖాతరు చేశారు. మచిలీపట్నం వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు నకిలీ ఇళ్ల పట్టాలు ఇచ్చిన సంఘటనపై తెదేపా ఫిర్యాదునూ పట్టించుకోలేదు. వైకాపా నాయకులు ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డా అడ్డుకోలేదు. ఎన్నికల వేళ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ వారికి మరింత మద్దతుగా నిలిచారు.


వైకాపా నాయకుల సేవలో తరింపు

పల్లె జాషువాకు అత్యంత వివాదాస్పదమైన అధికారిగా పేరుపడింది. గతంలో కృష్ణా జిల్లా ఎస్పీగా పనిచేసే సమయంలో గన్నవరం, గుడివాడ నియోజకవర్గాల్లో వైకాపా అరాచకాలకు కొమ్ముకాశారు. ఆయా నియోజకవర్గాల్లో ప్రతిపక్ష నాయకులపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేయించారు.  ఆయనకు గత జనవరిలో చిత్తూరు ఎస్పీగా కీలక బాధ్యతలు అప్పగించారు. అక్కడ విధుల్లో చేరినప్పటినుంచి తెదేపా నాయకులపై విచ్చలవిడిగా అక్రమ కేసులు పెట్టారు. రౌడీషీట్లు తెరిచారు. బైండోవర్లు చేశారు. కుప్పం, పుంగనూరు నియోజకవర్గాల్లో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణులు దాడులకు తెగబడుతుంటే బాధ్యులకే వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ప్రభుత్వంలో నంబరు-2గా చెలామణి అవుతున్న పెద్దిరెడ్డి.. జాషువాను ఏరికోరి చిత్తూరు ఎస్పీగా నియమించుకున్నారు.


కోడ్‌ ఉల్లంఘించిన జగన్‌ను అడ్డుకోలేదు...దొంగ ఓట్లను నిలువరించలేదు

అనంతపురం కలెక్టర్‌ గౌతమి.. పూర్తిగా వైకాపా నాయకులు చెప్పినట్లే నడుచుకున్నారు. తహసీల్దార్లు, ఎంపీడీవోల బదిలీల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేల సిఫారసులకే పెద్దపీట వేశారు. ఓటర్ల జాబితాల రూపకల్పనలో అక్రమాలకు పాల్పడుతూ వైకాపాకు అనుకూలంగా వ్యవహరించిన అధికారులపై ఎన్ని ఫిర్యాదులందినా చర్యలు తీసుకోలేదు. అనంతపురం, రాప్తాడు నియోజకవర్గాల్లో కొంతమంది రెవెన్యూ అధికారులు దొంగ ఓట్ల నమోదుకు సహకరిస్తున్నారన్న ఫిర్యాదులపై విచారించి నివేదిక ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించగా.. ఎలాంటి అక్రమాలు జరగలేదంటూ తప్పుడు నివేదిక పంపించారు. జిల్లా పరిధిలో దొంగ ఓట్లపై ప్రతిపక్షాలు ఎన్నిసార్లు ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదు. ఉరవకొండ నియోజకవర్గంలో తెదేపా సానుభూతిపరుల ఓట్ల తొలగింపు వ్యవహారంలో బాధ్యులందరిపైనా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించినప్పటికీ బీఎల్‌వోలకు షోకాజ్‌ నోటీసులిచ్చి ఊరుకున్నారు.

గత నెల 30న అనంతపురం జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర నిర్వహించారు. నిబంధనల ప్రకారం రాత్రి పదింటి వరకే యాత్రకు అనుమతి ఉన్నా 11.30 వరకూ కొనసాగింది. వైకాపా నాయకులు ముఖ్యమంత్రి బస్సు వెంటే ఉంటూ జెండాలు పట్టుకుని చెలరేగారు. ఇది కోడ్‌ ఉల్లంఘన అని తెలిసినప్పటికీ జిల్లా ఉన్నతాధికారిణిగా గౌతమి ఈ యాత్రపై కనీస పర్యవేక్షణ చేయలేదు. వైకాపా నాయకులు కొన్ని రోజులుగా యథేచ్ఛగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తున్నా చర్యలు తీసుకోలేదు.


వివేకా హత్య కేసులో సీబీఐనే ముప్పుతిప్పలు పెట్టారు

  • వైకాపా అధికారం చేపట్టాక నాలుగేళ్లపాటు ముఖ్యమంత్రి సొంత జిల్లా కడప ఎస్పీగా పనిచేశారు. ఎంపీ అవినాష్‌రెడ్డి కనుసన్నల్లో నడిచారన్న విమర్శలున్నాయి. అధికార పార్టీ నాయకుల ప్రత్యర్థులకు పోలీసు మార్కు వేధింపుల రుచి చూపించారు. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన మూడో సిట్‌కు అధిపతిగా వ్యవహరించిన అన్బురాజన్‌ అసలు నిందితులను తప్పించేందుకు ప్రయత్నించారన్న ఫిర్యాదులున్నాయి. ఈ కేసు దర్యాప్తును సీబీఐ మొదలుపెట్టాక వారిని ముప్పుతిప్పలు పెట్టారు. ఈ హత్య కేసులో నిందితుడి ఫిర్యాదు ఆధారంగా ఏకంగా సీబీఐ దర్యాప్తు అధికారి రామ్‌సింగ్‌పైనే కేసు నమోదు చేయించారు. రామ్‌సింగ్‌ను అవినాష్‌రెడ్డి కోర్టులోనే బెదిరించినా ఆయనపై చర్యలు తీసుకోలేదు. ఈయన వల్లే వివేకా హత్య కేసు విచారణను పక్కరాష్ట్రానికి బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలివ్వాల్సి వచ్చిందన్న వ్యాఖ్యలున్నాయి.  గతేడాది సెప్టెంబరు 17న అనంతపురం ఎస్పీగా బదిలీపై వెళ్లిన అన్బురాజన్‌ ఆ జిల్లాలో ప్రతిపక్షాల నేతలపై ఉక్కుపాదం మోపారు. ముఖ్యంగా చిన్నపాటి ఆందోళన చేసినా, నిరసన తెలిపినా తెదేపా నాయకులు, కార్యకర్తలపై ఇబ్బడిముబ్బడిగా కేసులు నమోదు చేయించారు.
  • ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్‌ ఇటీవల అనంతపురం జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనగా, ఆయన బస్సుయాత్ర కోసం ముందు రోజుంతా సెక్యూరిటీ రిహార్సల్‌ నిర్వహించారు. రూట్‌ చెకప్‌ పేరుతో ఎస్పీ స్వామిభక్తి చాటుకున్నారనే ప్రచారం పోలీసు శాఖలోనే ఉంది.  ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి రాత్రి పదింటి తర్వాత కూడా ముఖ్యమంత్రి జగన్‌ అనంతపురం జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించినప్పటికీ అడ్డుకోలేదు. పోలీసు బదిలీల్లో వైకాపా ఎమ్మెల్యేల సిఫార్సులకే ప్రాధాన్యమిచ్చారు.

అధికార పార్టీ సేవలో మామా అల్లుళ్లు

  • నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి వైకాపాకు అనుకూలంగా పనిచేశారు. తెదేపా సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి నారాయణ లక్ష్యంగా పలుమార్లు పోలీసులతో దాడులు చేయించారు. తిరుమలేశ్వర్‌రెడ్డి మామ వైకాపాలో క్రియాశీలంగా ఉంటూ విజయసాయిరెడ్డితో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈయన రోజూ ఎస్పీ కార్యాలయానికి వస్తున్నట్లు ఎన్నికల సంఘానికి ఇటీవల ఫిర్యాదులందాయి. సర్వేపల్లి నియోజకవర్గంలో క్వార్ట్జ్‌ అక్రమ తవ్వకాలపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా కనీస చర్యలు తీసుకోలేదు.
  • ఫిబ్రవరి 9న నెల్లూరులోని నారాయణ వైద్య కళాశాల, నారాయణ నివాసంలో తనిఖీలు చేయించి చివరకు ఏం లేవని తేల్చి చెప్పారు. ఈ సమయంలో పెద్దఎత్తున పోలీసులు హడావుడి చేసి రోగులను ఇబ్బందిపెట్టారు.
  • మార్చి 4న మరోసారి నారాయణ సంబంధీకులు, ఆయన విద్యాసంస్థల్లో పనిచేసే వారి ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. రాంజీనగర్‌లో ఉంటున్న మాజీ జడ్పీటీసీ ముప్పాళ్ల విజేతారెడ్డి ఇంటికి సుమారు 20 మంది పోలీసులు ఉదయం ఆరింటికి వెళ్లారు. మరో పది మంది ఆమె ఉంటున్న అపార్టుమెంట్‌ను చుట్టుముట్టారు. చివరకు విలేకర్ల సమావేశం నిర్వహించి నారాయణ విద్యాసంస్థలకు సంబంధించి బస్సుల కొనుగోలులో పన్ను ఎగవేతకు సంబంధించి తనిఖీలు చేశామని చెప్పారు. అయితే నారాయణ సంబంధీకుల ఇళ్లలో తనిఖీలు ఎందుకనే ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. ప్రధాని పాల్గొన్న ప్రజాగళం సభకు సంబంధించి సభాప్రాంగణంలో గ్యాలరీలకు బాధ్యుడిగా ఆ విధులను గాలికొదిలేశారన్న ఆరోపణలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని